Read In Tollywood Latest News

Saturday, August 4, 2012

దక్కన్ క్రానికల్ కొనుగోలుకు దైనిక్ భాస్కర్?........

Dainik Bhaskar Is Bidding Deccan Chronicle
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ ప్రింట్ మీడియా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు ఉత్తరాదికి చెందిన మరో ప్రముఖ మీడియా కంపెనీ డీబీకార్ప్ (దైనిక్ భాస్కర్ ప్రచురణ సంస్థ) ఆసక్తితో ఉన్నట్టుగా వచ్చిన వార్తలు శుక్రవారం నాడు మార్కెట్‌లో పెను సంచలనం సృష్టించాయి. మరోవైపు తీవ్రమైన లిక్విడిటీ కొరతతో అల్లాడిపోతున్న దక్కన్ క్రానికల్ ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు అత్యవసరంగా నిధుల సమీకరణ మార్గాలను అన్వేషిస్తోంది. వాటాదారులు తమ ఆస్తులను మరిన్నింటిని కుదువ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అంతేకాకుండా, ప్రింట్ మీడియా వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసి విక్రయించే ప్రతిపాదన కూడా ఉన్నట్టు చెబుతున్నారు. దక్షిణాది మార్కెట్‌లో ప్రవేశించేందుకు గత కొన్నేళ్లుగా తగిన అవకాశాల కోసం డీబీ కార్ప్ ఎదురుచూస్తోంది. దక్కన్ క్రానికల్‌పై తమకు ఆసక్తి ఉన్నమాట నిజమేనని ఓ ప్రముఖ తెలుగు దినపత్రికతో డీబీ కార్ప్ డైరెక్టర్ పవన్ అగర్వాల్ ఫోన్‌లో చెప్పారు.

దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌ను మొత్తంగా కొనే ప్రయత్నం చేస్తున్నారా లేక కేవలం ప్రింట్ మీడియా వ్యాపారాన్ని మాత్రమేనా అని అడిగినప్పుడు, ఈ వివరాలు మాట్లాడేందుకు తాను తగిన వ్యక్తిని కాదని ఆయన అన్నట్లు ఆ పత్రిక రాసింది. ఇదిలా ఉండగా దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. డీబీ కార్ప్ తరపున ఎవరూ తమను ఇంతవరకు సంప్రదించలేదని వెల్లడించింది. ప్రింట్ వ్యాపారాన్ని విక్రయించే ఆలోచన లేదని కూడా స్పష్టం చేసినట్లు ఆ దినపత్రిక తెలిపింది.

మరోవైపు డీబీ కార్ప్ బీఎస్ఈకి పంపిన సమాచారంలో దక్కన్ క్రానికల్ కొనుగోలుకు తాము సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని చెప్పింది. బిఎస్ఈ సమాచారాన్ని చూసిన తర్వాత మళ్లీ డీబీ కార్ప్ డైరెక్టర్ పవన్ అగర్వాల్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన తాను ఫంక్షన్‌లో ఉన్నాననీ శనివారం ఫోన్ చేయాలని సూచించినట్లు ఆ తెలుగు దినపత్రిక రాసింది.

ఉత్తరాదిలోని అతిపెద్ద మీడియా కంపెనీల్లో డీబీ కార్ప్ ఒకటి. హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్, గుజరాతీ పత్రిక దివ్య భాస్కర్, మరాఠీ పత్రిక దైనిక్ దివ్య మరాఠీ, బిజినెస్ భాస్కర్ పత్రికలను ఈ గ్రూపు నిర్వహిస్తోంది. ఇంగ్లీష్‌లో డీఎన్ఏ పత్రికను నిర్వహిస్తోంది. మై ఎఫ్ఎం పేరుతో రేడియో స్టేషన్ కూడా ఉంది.
మొత్తం 13 రాష్ట్రాల్లో డీబీ గ్రూప్ మీడియా సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇదిలా ఉండగా దక్కన్ క్రానికల్ మార్చి 2012తో ముగిసిన ఆర్థిక సంవత్సరాన్ని సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి తమకు అనుమతులు లభించినట్టుగా వెల్లడించింది.

No comments:

Post a Comment