Political News & latest gadgets , latest automobile news , computers information ,
Thursday, April 19, 2012
కుల రాజకీయాల కధ కమామిషు ......
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్రిస్టియనా?
రెడ్డా? రాష్ట్ర కాంగ్రెస్ నేతలలో కొత్తగా చోటు చేసుకున్న మీమాంస ఇది.ఆయన
జీవించి ఉంటే, అధికారంలో కొనసాగి ఉంటే అసలు ఈ ఊసే వచ్చి ఉండేది కాదు.
ఇన్ని కొత్త చర్చలకు ఆస్కారం ఉండేది కాదు. కాని కాలం ఎప్పుడూ ఒకేవిధంగా
ఉండదు. కాలగమనంలో ఎన్నో మార్పులు చూడాల్సిందే. నిజానికి కులాల గురించి ఇంత
బాహాటంగా మాట్లాడుకోవలసి రావడం బాధాకరమే. కాని వాస్తవం ఏమిటంటే మన
దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఏదో రూపంలో ఈ కులాలు రాజకీయాలలో ప్రముఖ పాత్ర
పోషిస్తున్నాయి.అందులో మన రాష్ట్రం మినహాయింపు కాదు.ఒక కులమే మొత్తం
రాజకీయాలను శాసించగలుగుతుందా? ఒక్క కులాన్ని ఆకట్టుకుంటే ఎన్నికలలో విజయం
సాధించగలుగుతారా? అంటే అది జరిగే పని కాదు. కాని డామినెంట్ గా ఉండే కులాలు
ఇతర కులాలను కలుపుకుని రాజ్యాధికారంలోకి వస్తాయి. రెండు కులాలు
పోటాపోటీగా ఉన్నప్పుడు ఆ రెండు వర్గాల మధ్య పోటీ ప్రధానంగా ఉంటుంది. ఒకవేళ
ఒక కులానికి చెందినవారే ఒక నియోజకవర్గంలో ఉంటే అప్పుడు కులమే రెండుగా
చీలుతుంది. వారి మధ్యనే పోటీ ఉంటుంది. ఇది సహజ సూత్రం. కులాన్ని రాజకీయ
నేతలు వాడుకున్నంతగా మరెవ్వరూ వాడుకోరన్నది నగ్న సత్యం. ఇక్కడ ఒక విషయం
గమనించాలి.అగ్రవర్ణాలకు చెందిన నాయకులు కులం గురించి పైకి మాట్లాడకుండా కుల
రాజకీయాలు నడపడంలో సిద్ద హస్తులుగా ఉంటున్నారు. అదే బలహీన, వెనుకబడిన
వర్గాలకు చెందిన రాజకీయ నాయకులలో పలువురు కులాల గురించి ఎక్కువగా
మాట్లాడుతుంటారు కాని ఆచరణలో వారు కుల రాజకీయాలను సఫలంగా నడపడంలో విఫలం
అవుతున్నారు. తాజాగా కులాల గురించి ఎందుకు చర్చ వస్తోంది?మాజీ మంత్రి జెసి
దివాకరరెడ్డి కాంగ్రెస్ కు దూరం అవుతున్న రెడ్డి సామాజికవర్గాన్ని తిరిగి
వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు ఆరంభించాలని ప్రతిపాదించారు. అక్కడే
ఉన్న మరో నేత తులసీరెడ్డి వై.ఎస్.కుటుంబం ప్రధానంగా క్రిస్టియన్ మత
ఆచారాలనే పాటిస్తుందని చెప్పినట్లు కధనాలు వచ్చాయి. విశేషం ఏమిటంటే నేరుగా
కాకపోయినా తెలుగుదేశం నాయకులు కూడా కొందరు దివంగత ముఖ్యమంత్రి
రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ను ఉద్దేశించి కులానికి తెలియకుండా మతాన్ని,
మతానికి తెలియకుండా కులాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. ఇలా
మాట్లాడడంలోని వారి ఆంతర్యం అర్ధం అవుతూనే ఉంది. క్రైస్తవ మతాన్ని
స్వీకరించిన వై.ఎస్.కుటుంబం అటు మతపరంగా రాజకీయ ప్రయోజనాన్ని పొందుతోందని,
అలాగే ఇటు హిందూ మతంలోని ఒక భాగమైన రెడ్డి సామాజికవర్గంగా గుర్తింపు పొంది
రాజకీయాలలో గట్టి పునాది ఏర్పరచుకుందన్నది వీరి భావన . ఇది నిజమే
కావచ్చు. కాని వీరంతా ఇదెలా జరిగిందన్నది తెలుసుకునే లోపే గతంలో
రాజశేఖరరెడ్డి కాని, ఇప్పుడు జగన్ గాని ఆ వర్గాలను ఆకట్టుకోగలిగారు.
మొత్తం కులానికి కులం అంతా వెళ్లిపోయిందని చెప్పలేకపోయినా, మెజార్టీ
సామాజికవర్గం జగన్ వైపు ఆకర్షితులైనట్లు కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం
ఒక్కటే.రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత నూట ఏభై మంది ఎమ్మెల్యేలు జగన్ ను
ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అది కరెక్టా? కాదా అన్నది ఇక్కడ చర్చ
కాదు.ప్రజాస్వామ్యబద్దంగా మెజార్టీ ఉన్న అభ్యర్ధిని కాదని వేరే
సామాజికవర్గానికి చెందిన రోశయ్యను ముఖ్యమంత్రిగా చేయడాన్ని ఈ సామాజికవర్గం
జీర్ణించుకోలేకపోయింది. అంతేకాక జగన్ విషయంలో అప్పటి నుంచి
సోనియాగాంధీకానివ్వండి, కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాని
వ్యవహరించిన తీరును ఆ సామాజికవర్గం అవమానంగా భావించింది.పైగా ఇప్పుడు జగన్
ను వ్యతిరేకిస్తున్న కొందరు రెడ్డి సామాజికవర్గ నాయకులు ఆ రోజులలో జగన్
ను ఎంతగానో బలపరిచారు. అప్పుడు వారే కాదు. ఇతర సామాజికవర్గాలకు చెందిన
అనేకమంది కూడా జగన్ కు మద్దతు ఇచ్చారు. అందుకు కారణాలు ఏమైనా
ఉండనివ్వండి.తదుపరి సోనియాతో వై.ఎస్.కుటుంబం సమావేశం అయినప్పుడు కాని,
ఓదార్పుయాత్రకు అడ్డుపడిన వైనం కానివ్వండి, తర్వాత రోశయ్యను మార్చినప్పుడు
జగన్ తో సంప్రదింపులు జరపకపోవడం, పైగా వై.ఎస్.కుటుంబానికి చెందిన
వివేకాకు మంత్రి పదవి ఇవ్వడం , అన్నిటిని మించి జగన్ పై కేసులు వేయించిన
తీరు ఇదంతా ఆ సామాజికవర్గం సామాన్యులలో కూడా తీవ్ర అసంతృప్తికి దారి
తీసింది. అదే సమయంలో జగన్ వ్యూహాత్మంగా జనంలో తిరుగుతూ దళిత, ఇతర వర్గాలను
ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా చాలావరకు సఫలం అయ్యాయి.
దీనికితోడు రాజశేఖరరెడ్డి అమలు చేసిన కొన్ని ప్రజాకర్షక స్కీములు జగన్
పట్ల జనంలో ఆదరణ పెరగడానికి దోహదపడ్డాయి.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
కూడా అదే సామాజికవర్గానికి చెందినవారైనా , ఆయన పెద్దగా తప్పులు చేయకపోయినా
జనంలో ఈ ఫీలింగ్ బాగా నాటుకుపోయింది. అప్పుడు దాకా పొగిడిన నోళ్లే ఆ
తర్వాత వై.ఎస్. రాజశేఖరరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని తెగడాన్ని కూడా జనం
అర్ధం చేసుకోలేకపోయారు. ఇదంతా కాంగ్రెస్ హై కమాండ్ రాజకీయం అని నమ్మారు.
జగన్ పై చేసిన అవినీతి ఆరోపణలను కూడా జనం సీరియస్ గా తీసుకోవడం మానేశారు.
రెడ్డి సామాజికవర్గం బలంగా ఉన్నచోట్ల ఆ వర్గంలో ఎక్కువ శాతం జగన్ కు
మద్దతు ఇస్తుంటే, దళితులు, ముస్లింల తదితర కొన్ని వర్గాలను జగన్
ఆకట్టుకుని ముందుకు వెళుతున్నారు. అయితే వచ్చే కొద్ది కాలంలో రెడ్డియేతర
ప్రాంతాలలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.అక్కడ జగన్ ప్రభావం ఎంత ఉంటుందన్నది
తేలిపోతుంది.దానిపై ఆధారపడే రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయాలు నడుస్తాయి. ఈ
నేపధ్యంలో రాష్ట్రంలో కుల రాజకీయాల గురించి విశ్లేషణ చేస్తే అదేదో
ఇప్పటికిప్పుడే మొదలయ్యాయని అనుకోనవసరం లేదు. స్వాతంత్ర్యం రాకముందు,
వచ్చిన తర్వాత కూడా ఇలాంటి రాజకీయాలు నడిచాయి. 1951లో నీలం సంజీవరెడ్డి,
ఎన్.జి.రంగాలు ఆంధ్ర కాంగ్రెస్ అద్యక్ష పదవికి పోటీపడినప్పుడు కూడా ఈ వర్గ
రాజకీయాలు నడిచాయని అంటారు. ఆ తర్వాత రంగా కాంగ్రెస్ నుంచి బయటకు
వచ్చినప్పుడు ఆయన సామాజికవర్గం బలంగా ఉన్న కృష్ణా,గుంటూరు వంటి జిల్లాలలో
ఆయనకు మంచి మద్దతే లభించింది. అదే సమయంలో కాంగ్రెసేతర భావజాలం బాగా
పనిచేసిన ఉత్తరాంధ్ర జిల్లాలలో కూడా ఆయన పెట్టిన కొత్త పార్టీ కృషికార్
లోక్ పార్టీకి ఆదరణ దక్కింది. అయితే ఆయా సందర్భాలలో ఆయన కాంగ్రెస్ నుంచి
బయటకు రావడం, తిరిగి కాంగ్రెస్ లో చేరిపోవడం జరిగాయి. 1983 వరకు కాంగ్రెస్
పార్టీనే పూర్తిగా రాజకీయాలను శాసించింది.అందువల్ల పార్టీలోనే రెడ్డి,
కమ్మ సామాజికవర్గాల మధ్య ఆధిపత్య పోరు కొంతకాలం సాగింది. 1983లో
ఎన్.టి.రామారావు పార్టీని స్థాపించినప్పుడు కమ్మ సామాజికవర్గంలో అత్యధిక
శాతం ఆయనకు మద్దతు ఇచ్చింది. అదే సమయంలో ఇతర వర్గాలకు చెందిన వారు సైతం
కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన ఎన్.టి.ఆర్ పట్ల ఆకర్షితులయ్యారు. దాంతో ఆయన
అధికారంలోకి రావడం తేలిక అయింది. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కమ్మ
డామినేటెడ్ గాను, కాంగ్రెస్ పార్టీ రెడ్డి డామినేటెడ్ గాను రాజకీయాలు
సాగుతున్నాయి. అయితే ఇక్కడ అసలు ఒక విషయాన్ని గమనించాలి.ఈ రెండు
సామాజికవర్గాల నేతలు ఎప్పటికప్పుడు తెలివిగా వ్యవహరిస్తూ రాజకీయాలు తమను
దాటిపోకుండా చూసుకోగలుగుతున్నారు. ఉదాహరణకు 1977లో జనతా పార్టీ కొత్తగా
వచ్చినప్పుడు చాలామంది ఈ రెండు వర్గాల నేతలు ఆ పార్టీలో చేరారు.
అంతేకాకుండా 1978 లో కాంగ్రెస్ చీలి రెడ్డి కాంగ్రెస్ గా , ఇందిరా
కాంగ్రెస్ గా పోటీచేశాయి. జన సామాన్యం అంతా ఇందిరాకాంగ్రెస్ వైపు మొగ్గు
చూపడంతో ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది.ఆ తర్వాత రెడ్డి కాంగ్రెస్
మొత్తం ఇందిరాకాంగ్రెస్ లో చేరిపోయింది. అయితే రెండువేల తొమ్మిదిలో
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు కాపు సామాజికవర్గం
కూడా ప్రధాన భూమిక పోషించింది. కాని కాలం కలిసిరాని చిరంజీవి ప్రజారాజ్యం
పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అలా అని చెప్పి మొత్తం నేతలంతా
పూర్తిగా కులాలపైనే ఆధారపడతారని చెప్పడం సరికాదు. ప్రముఖ కమ్యూనిస్టు
యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య ను కమ్మ సామాజికవర్గమే అత్యధికంగా ఉండే కృష్ణా
జిల్లా గన్నవరం నుంచి మూడుసార్లు శాసనసభకు గెలిపించారు. ఎన్.టి.రామారావు
రాష్ట్రంలోని తన ప్రాంతమైన గుడివాడతోపాటు తిరుపతి, హిందుపూర్, నల్లగొండ,
టెక్కలి, కల్వకుర్తిలలో పోటీచేసి ఒక్క కల్వకుర్తిలో మాత్రం ఓడిపోయినా
మిగిలిన అన్ని చోట్ల గెలుపొందారు. గుడివాడలో తప్ప మిగిలిన చోట్ల కమ్మ
సామాజికవర్గం చాలా తక్కువగా ఉన్నా ప్రజలు గెలిపించారు. అయితే ఎన్.టి.ఆర్.
హయాంలో కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యత లభించిందని కాంగ్రెస్ ప్రచారం
చేస్తే, విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డి వంటివారు రెడ్లకే ప్రాధాన్యం
ఇస్తున్నారని టిడిపి ఆరోపణలు గుప్పించేది. అయితే ఇందుకోసం ఇతర కులాల నేతలను
కూడా ప్రయోగిస్తుంటారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో
ఉన్నవారు కొత్తగా వచ్చిన మూడో పార్టీపై ఈ తరహా విమర్శలు చేస్తున్నారు.
జనాభా తక్కువగా ఉన్నా, ఆధిపత్యాన్ని ప్రదర్శించగల ఈ సామాజికవర్గాల మధ్య
పోరు ఏ రూపం దాల్చుతుందో చూడాలి. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. ఎన్నికల
ముందు ఎలా ఉన్నా ఈ సామాజికవర్గాల ప్రముఖులు అధికారం ఎవరికి వచ్చినా అటు
వైపు వెళ్లిపోగల నేర్పుతో ఉంటారు. అసలు విజయ రహస్యం అదే. http://www.readbud.com/?ref=6339020 | |
| |
Subscribe to:
Posts (Atom)