Read In Tollywood Latest News

Wednesday, February 22, 2012

సృష్టికి ప్రతిసృష్టి టుస్సాడ్స్‌ మ్యూజియం............

బాలీవుడ్ అందాల రాణులు కరీనా కపూర్‌, ఐశ్వర్యారాయ్‌లతో కలిసి ఫొటోలు దిగాలని ఉందా..? మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ని కలవాలనుందా..? బాలీవుడ్ టాప్‌ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ల పక్కన నిలబడాలనుందా..? వీరందరినీ ఒేకసారి దర్శించాలనుందా..? అయితే వెంటనే లండన్‌లోని మేడ్మ టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్లాల్సిందే. మన దేశానికి చెందిన ఈ ప్రఖ్యాత సెలబ్రిటీలే కాదు ప్రముఖ సెలబ్రిటీలు మైకెల్‌ జాక్సన్‌, బ్రిట్నీ స్పియర్స్‌ వంటి ఎందరినో ఒేక చోట సందర్శించే అద్భుతమైన వేదిక ఈ మ్యూజియం. ఇటువంటి ప్రముఖ వ్యక్తుల మైనపు బొమ్మలతో ఏర్పాటైన టుస్సాడ్స్ మ్యూజియం దేశ,విదేశాల్లో ఎంతో పేరొందింది. సందర్శకులకు మరచిపోలేని అనుభూతులను మిగిల్చే ఈ మ్యూజియం నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించింది. టుస్సాడ్స్ మ్యూజియంలో ఏడుగురు ఇండియన్‌ సెలబ్రిటీలకు చోటుదక్కింది. బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ మైనపు బొమ్మను ఇక్కడ మొదట ఏర్పాటుచేశారు. అమితాబ్‌ కోడలైన ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు కూడా మ్యూజియంలో చోటు దక్కింది. వీరితో పాటు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోలు షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ల మైనపు బొమ్మలను ఇక్కడ ఏర్పాటుచేసి వారి అభిమానులను ఆకట్టుకున్నారు. మాస్టర్‌ బ్లాస్టర్‌గా సచిన్‌ టెండూల్కర్‌ బ్యాట్‌ ఎత్తి కనిపించే మైనపు బొమ్మ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక టుస్సాడ్స్ మ్యూజియంలో చేరిన చివరి ఇండియన్‌ సెలబ్రిటీ బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనాకపూర్‌.
సృష్టికి ప్రతిసృష్టిని తలపించేవిధంగా లండన్‌లోని టుస్సాడ్స్‌ మ్యూజియం రూపుదిద్దుకుంది. మ్యూజియంలోని ప్రముఖుల మైనపు బొమ్మలను చూసి సందర్శకులందరూ విస్తుపోకుం డా ఉండలేరు. లండన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నేడు ఈ మ్యూజియం పేరు తెచ్చుకుంది. ప్రముఖుల మైనపు బొమ్మలను అద్భుతంగా రూపొందించి ఇక్కడ ఏర్పాటుచేశారు. జీవకళ ఉట్టిపడుతూ సజీవంగా గోచరించే ఆ విగ్రహ రూపాలను చూసినవారు చూపుతిప్పుకోకుండా ఉండలేరు.
రెండు శతాబ్దాల చరిత్ర...
టుస్సాడ్స్‌ మ్యూజియానికి చారిత్రక విశిష్టత ఉంది. 200 ‚సంవత్సరాల క్రితం ఏర్పాటైన మ్యూజియంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అప్ప ట్లో ఇంగ్లాండ్‌లో మేడమ్‌ టుస్సాడ్‌ ప్రముఖుల మైనపు బొమ్మలను తయా రుచేస్తుండేవారు. ఆమె తన మైనపు బొమ్మలను అన్ని ప్రాంతాల కూ తిరిగి ప్రదర్శించేవారు. 30 సంవత్సరాల పాటు ఊరూరా తిరిగి విసిగిపోయిన మేడమ్‌ టుస్సాడ్‌ తన కళాఖండాలకు స్థిరంగా ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలని నిశ్చయించారు. ఈ నేపథ్యంలో అద్భుతమైన మేడమ్‌ టుస్సాడ్‌ మైనపు బొమ్మల మ్యూజియం ఏర్పాటైంది. 1835లో ఈ మ్యూజియాన్ని ప్రారంభించగా అప్పటికి మేడమ్‌ టుస్సాడ్‌ వయసు 74 సంవత్సరాలు.
కొంతకాలం అనంతరం ఈ మ్యూజియం నిర్వహణ బాధ్యతలను తన కుమారులకు అప్పగించారు. అంతకుముందే మైనపు బొమ్మలను రూపొందించడంలో ఆమె పలువురికి శిక్షణనిచ్చారు. ఇక మరికొద్ది సంవత్సరాల్లో తాను మరణిస్తాననగా స్వయంగా తన మైనపు బొమ్మను ఆమె రూపొందించుకోవడం విశేషం. మ్యూజియంలో నేటికీ మేడమ్‌ టుస్సాడ్‌ మైనపు బొమ్మ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 1850 సంవత్సరంలో ఆమె తన ఆస్తినీ, మ్యూజియాన్ని కుమారులకు అప్పగించి తుదిశ్వాస విడిచారు. ఆ తర్వాత చాలా కాలం వరకు ఆమె కుమారులే దాని నిర్వహణ బాధ్యతలను చూశారు.
ఆకట్టుకునే వివిధ విభాగాలు...
టుస్సాడ్‌ మ్యూజియంలో సందర్శకులను ఆకట్టుకునే విభాగాలెన్నో ఉన్నాయి. వాటిలో చరిత్రలో చెప్పుకోదగ్గ ప్రముఖులను నిజంగా చూస్తున్నామా అనిపించే మైనపు మూర్తులు సందర్శకులను మైమరపిస్తాయి. వీటితో పాటు చరిత్రలో చెప్పుకోదగ్గ ముఖ్యమైన ఘట్టాలను కూడా మైనపు దృశ్యాలుగా ఇక్కడ చూడవచ్చు. మూడో రిచర్డ్‌, విక్టోరియా మహారాణి, ఇతర రాణులు, రాజుల ప్రతిమ లు, క్రీడాకారులు, సినీతారల మూర్తులు, చర్చిల్‌, గోర్బచె వ్‌ వంటి రాజకీయ నాయకుల శిల్పాలు మైనంతో రూపు దిద్దుకొని ఇక్కడ కనువిందుచేస్తాయి. మార్లిన్‌ మన్రో, ఎల్విన్‌ ప్రెస్లీ వంటి సెలబ్రిటీ రూపాలు ఇక్కడ మైనపు బొమ్మలు సందర్శకులను మురిపిస్తాయి. అగాధా క్రిస్టీలాంటి రచయిత్రితో పాటు ఇతర ప్రముఖ రచయిత లు ఇక్కడ కొలువు తీరి కనిపిస్తారు. 200 సంవత్సరాల క్రితం ఏర్పాటైన టుస్సాడ్స్ మ్యూజియంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నారుు. అప్పట్లో ఇంగ్లాండ్ లో మేడవ్గు టుస్సాడ్స్ప్రముఖుల మైనపు బొమ్మలను తయారుచేసి అన్ని ప్రాంతాలకూ తిరిగి వాటిని ప్రదర్శించేవారు. 30 సంవత్సరాల పాటు ఊరూరా తిరిగి విసిగిపోరుున ఆమె చివరికి 1835లో తన పేరిట మ్యూజియాన్ని ప్రారంభించారు.
ప్రత్యేక ఆకర్షణగా...
టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది స్లీపింగ్‌ బ్యూటీ. 1765వ సంవత్సరానికి చెందిన ఫ్రాన్సు రాజు 15వ లూరుూ ప్రియురాలు మేడమ్‌ డుబా రీ విశాలమైన పట్టె మంచంలో పట్టు పరుపుల మీద సుందరమైన స్వప్నాలను దర్శిస్తూ నిద్రపోతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడవచ్చు. ఎలక్ట్రిక్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ మైనపు బొమ్మ ఛాతి పైకి కిందకి కదలడం వల్ల అది బొమ్మ కాదు మనిషే అని భ్రాంతికి గురవుతారు సందర్శకులు. దేశ,విదేశాలకు చెందిన పర్యాటకులు స్లీపిం గ్‌ బ్యూటీని తిలకించేందుకు ప్రత్యేకంగా టుస్సాడ్స్‌ మ్యూజియానికి విచ్చేస్తారు. ఈ బ్యూటీని తిలకించి మైనపు బొమ్మను తయారుచేసిన వారి ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేకపోతారు.
కనువిందుచేసే ఇండియన్‌ సెలబ్రిటీలు...
వివిధ దేశాలకు చెందిన ఎందరో సెలబ్రిటీలు మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో కనువిందు చేస్తారు. వీరి సరసన మన దేశానికి ప్రముఖ సెలబ్రిటీలను కూడా చేర్చి వారిని గౌరవించారు మ్యూజియం నిర్వాహకులు. ఇక మ్యూజియంలో మొదటిసారిగా ఏర్పాటుచేసిన ఇండియన్‌ సెలబ్రిటీ అమితాబ్‌ బచ్చన్‌. ాబిగ్‌ బి్ణగా పేరొందిన ఆయన మైనపు బొమ్మను మ్యూజియం లో ఏర్పాటుచేశారు. ఈ మ్యూజియంలో అమితాబ్‌ కోడలైన ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌కు కూడా చోటు దక్కింది. ఈ అందాలభామ మైనపు బొమ్మ ఇక్కడ కనువిందు చేస్తుంది. వీరితో పాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హీరోలు షారూఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌ల మైనపు బొమ్మలను ఇక్కడ ఏర్పాటుచేసి వారి అభిమా నులను ఆకట్టు కున్నారు. క్రికెట్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌గా పేరుగాంచిన సచిన్‌ టెండూల్కర్‌ బ్యాట్‌ ఎత్తి కనిపించే మైనపు బొమ్మ ఇక్క డ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ మైనపు బొమ్మను సచిన్‌ తన భార్య అం జలి, కూతురు, కుమారుడుతో కలిసి సందర్శించి మైమర చిపోయారు. ఇక టుస్సాడ్‌ మ్యూజియంలో చేరిన చివరి ఇండియన్‌ సెలబ్రిటీ బాలీవుడ్‌ ముద్దు గుమ్మ కరీనాకపూర్‌. కొద్ది రోజుల క్రితం కరీనా మైన పు విగ్రహాన్ని మ్యూజియం లో ఏర్పాటుచేశారు. ఈ మ్యూజియానికి విచ్చేసిన కరీనా తన విగ్రహాన్ని చూసి ఎంతో ఆనందపడ్డారు. మ్యూజి యంలో మన దేశ మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీల విగ్రహాలను కూడా తిలకించవచ్చు. ఈ మైనపు బొమ్మల తయారీ కోసం వీరిద్దరూ కళాకారుల ఎదుట మోడల్స్‌గా కూర్చొని సహకరించడం విశేషం. అంతేకాదు తాము ధరించిన దుస్తులను మ్యూజియానికి సమర్పించగా వాటిని మైనపు బొమ్మలకు తొడిగారు.


స్పీకర్ నాదెండ్ల మనోహర్ మచ్చ తెచ్చుకుంటారా! .....................

శాసనసభ కు అధ్యక్షత వహించే సబాపతుల వ్యవస్థ కూడా తరచు పరీక్షలను ఎదుర్కుంటుంది.నిజానికి శాసనసభ స్పీకర్ కు సమావేశాలు జరిగే నలభై లేదా ఏభై రోజులే ఎక్కువగా పని ఉండాలి. కాని ఫిరాయింపుల నిషేదం చట్టం వచ్చిన తర్వాత వారి పాత్ర మారిపోయింది. నిత్యం రాజకీయాలలో జరిగే పరిణామాలకు వారు కూడా ఏదో రూపంలో భాగస్వాములు కావల్సి వస్తోంది. నిజానికి స్పీకర్ పదవి రాజ్యాంగబద్దంగా ఏర్పడిన పదవి.కాని తరచూ వివాదాలలో పడవలసి వస్తున్నది.ముఖ్యంగా మన రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల కారణంగా స్పీకర్ పదవిలో ఉన్నవారు మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. అధికారంలోకి వచ్చిన పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే సభాపతి అవుతారు. ఆ తర్వాత ఆ పదవిలో ఉన్న వ్యక్తి సాధ్యమైనంతవరకు నిష్పక్షపాతంగా బాధ్యతలను నిర్వహించాలి. ప్రతిపక్షానికి చెందినవారికి కూడా న్యాయం చేయవలసిన కర్తవ్యం సభాపతిపై ఉంటుంది.అయితే స్పీకర్ పదవిలో ఉన్నవారు కూడా విమర్శలకు గురి అవుతున్నారు. ఒకప్పుడు స్పీకర్ ను విమర్శించాలంటే వెనుకాముందాడేవారు. కాని రెండు దశాబ్దాలుగా స్పీకర్ ను మీడియా సమావేశాలు పెట్టి మరీ విమర్శిస్తున్నారు. గతంలోని స్పీకర్ లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడానికి ఎక్కువగా ప్రయత్నించేవారు.కాని ఆ తర్వాత కాలంలో ఆ పరిస్థితి మారింది. ముఖ్యంగా తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అదికారపార్టీకి అనుకూలంగా ఉండవలసిన పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఇటీవల స్పీకర్ నాదెండ్ల మనోహర్ అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ విప్‌ ఉల్లంఘించిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు పదిహేడు మందిపై వేటు వేయడంలో తాత్సారం చేయవలసి వస్తున్నది. దేశ చరిత్రలో ఎన్నడూ కూడా తాము విఫ్ ఉల్లంఘించామని , కనుక తమపై వేటు వేయాలని స్వయంగా డిమాండ్ చేసిన ఘటన ఇదే కావచ్చు. అంత బహిరంగంగా వ్యవహారం నడిచి, ఎమ్మెల్యేలు సవాలు విసిరితే వెంటనే వారిపై వేటు వేయలేని నిస్సహాయ స్థితిలో మనోహర్ పడ్డారు. దానికి కారణం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఏడు నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగవలసి ఉంది. వాటికి తోడు ఈ పదిహేడు నియోజకవర్గాలలో కూడా కలిపి ఒకేసారి ఉప ఎన్నికలు వస్తే, వాటిని ఎదుర్కోవడం కష్టమై, ఫలితాలు కనుక వ్యతిరేకంగా వస్తే , ప్రభుత్వం ఇబ్బందులలో పడుతుంది.దానిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం లేదా ముఖ్యమంత్రి అనధికార డైరెక్షన్
మేరకు నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. దీనితో రాజ్యాంగ విలువలను స్పీకర్ పరిరక్షించడం లేదన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు.జగన్ వర్గం ఎమ్మెల్యేలు చేస్తున్నది తప్పా , ఒప్పా అన్నది చర్చ కాదు. వారిపై చర్య తీసుకోలేకపోవడమే చర్చ అవుతోంది.అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోయినా, దానిని శాసనసభ వరకు విడిగానే కొనసాగించవలసి వస్తున్నది. ఇక్కడ కూడా రాజకీయకారణాలే ప్రధానంగా ఉన్నాయి.ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవికి వెనుక సీటులో కూర్చోవడం ఇష్టం లేదట. దాంతో విలీనం ప్రక్రియను మరికొంతకాలం ఆలస్యం చేస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాత్రమే ఎదుర్కోవలేదు. ఇంతకుముందు స్పీకర్ గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికాని, అంతకుముందు సభాపతి గా ఉన్న కె.ఆర్.సురేష్ రెడ్డికాని ఇలాంటి సమస్యలను చూడాల్సి వచ్చింది.కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర శాసనసభలో మెజార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేయడం, వాటిని ఆయన తిరస్కరించడం జరిగింది. టిఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి రాజీనామాలు సమర్పించిన సందర్భంలో టిఆర్ఎస్ వారివి మాత్రమే ఆమోదించి మిగిలిన రాజీనామాలను పెండింగులో ఉంచడం కూడా విమర్శలకు దారి తీసింది. అయితే వీరిలో కొందరు ఎమ్మెల్యేలు ప్రజల కోసం బయటకు వచ్చి ఒకమాట, లోపల స్పీకర్ వద్ద మరో మాట చెప్పారన్న ఆరోపణలు ఉన్నాయి.అంతకుముందు సురేష్ రెడ్డి హయాంలో పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక స్వతంత్ర అభ్యర్ధి నామినేషన్ పై సంతకాలు చేసి ఫార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించారన్న అభియోగం వచ్చింది. వారి చర్య చట్ట సమ్మతంకాదని సురేష్ రెడ్డి చివరికి తీర్పు చెప్పారు. వారిలో ఇద్దరు తప్ప మిగిలిన ఎనిమిది మంది ముందుగానే రాజీనామా చేయడం వాటిని ఆమోదించి, తీర్పులో మాత్రం వారు కూడా అనర్హులే అని చెప్పడం సంచలనమే. నిర్ణయం వరకు బాగానే ఉన్నా, దాదాపు రెండున్నర ఏళ్లకు పైగా సురేష్ రెడ్డి విచారణ జరిపి కావాలని కాలయాపన చేశారని టిఆర్ఎస్ పార్టీ దుయ్యబట్టేది. గతంలో స్పీకర్ల వ్యవస్థపై అధిక గౌరవం ఉండేది. రాష్ట్ర తొలి స్పీకర్ అయ్యదేవర కాళేశ్వరరావు స్వయాన చర్చలలో కూడా పాల్గొనేవారు. మంత్రులు సరిగా సమాధానం ఇవ్వకపోతే నిలదీసేవారు. ప్రతిపక్ష నాయకులకు సముచితమైన గౌరవం ఇవ్వడానికి ప్రయత్నించేవారు. ఆయనపై కూడా కొందరు సభ్యులు కొద్దిపాటి విమర్శలు చేసినా, అయ్యదేవర వారిని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.అయినా పెద్దవాడన్న అభిమానంతో ఎక్కువమంది వ్యవహరించేవారు. ఆ తర్వాత స్పీకర్ అయిన బి.వి.సుబ్బారెడ్డి రాష్ట్ర చరిత్రలోనే సుదీర్ఘకాలం పదవిలో ఉన్నారు. మూడు సార్లు స్పీకర్ గా ఎన్నికయ్యారు. మూడోసారి ఎన్నికవడానికి ఆసక్తికరమైన కారణం ఉంది. సుబ్బారెడ్డి మంత్రులు సభలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఆయా ప్రభుత్వ సంస్థలు సకాలంలో నివేదికలు సమర్పించాలని పట్టుబట్టేవారు. లేకుంటే సభా హక్కుల ఉల్లంఘన కింద చర్య తీసుకుంటామని హెచ్చరించేవారు. అలాంటి ఒక సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి తో సు్బ్బారెడ్డికి గొడవ అయింది. హక్కుల ఉల్లంఘన కింద చర్యకు కాసు అంగీకరించలేదు. దానిపై స్పీకర్ ఓటింగ్ జరుపుతానన్నారు. కాని ముఖ్యమంత్రి కాసుకు అనుకూలంగా పార్టీ ఎమ్మెల్యేలంతా నిలబడడంతో సుబ్బారెడ్డి ప్రతిపాదనను శాసనసభ తోసిపుచ్చింది. దాంతో ఆయన వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. తదుపరి వేరే వ్యక్తిని ఎన్నుకోవాలని కాసు యోచించినా, పార్టీ అధిష్టానం అందుకు ఒప్పుకోకుండా తిరిగి సుబ్బారెడ్డినే ఎంపిక చేసింది. ఆ తర్వాత 1985 వరకు పూర్తికాలం స్పీకర్లుగా పనిచేసినవారు లేరు. ఎందుకంటే స్పీకర్ గా ఎన్నికైన పిడతల రంగారెడ్డి, దివి కొండయ్యచౌదరి, కోన ప్రభాకరరావు, తంగి సత్యనారాయణ వంటివారు మంత్రి పదవులు తీసుకుని ఈ పదవులను వదులుకున్నారు. తంగి సత్యనారాయణ తెలుగుదేశం ఆవిర్బావం తర్వాత ఎన్నికైన స్పీకర్ . ఈయన తొలుత ఎన్.టి.రామారావు పక్షాన నిలిచినా, తర్వాత నాదెండ్ల వైపు మొగ్గు చూపి స్పీకర్ పదవిని వదులుకున్నారు. ఆ సమయంలో తాత్కాలిక స్పీకర్లుగా పనిచేసిన ఒవైసీ, బాగారెడ్డిలు సరిగా చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నాదెండ్ల తిరుగుబాటు సమయంలో స్పీకర్లు కూడా సంక్షోభం పెరగడానికి కారకులయ్యారు. చివరికి మహేంద్రనాధ్ స్పీకర్ బాద్యతలు చేపట్టి ఎన్.టి.ఆర్ ను గట్టెక్కించారు.అయితే 1985 లో టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పీకర్ గా పనిచేసిన జి.నారాయణరావు ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టేవారన్న అభిప్రాయం ఉండేది. కొన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావుతో ఆయన విబేధపడ్డారు. ఆ తర్వాత ఆయన పార్టీకి, ఎన్.టి.ఆర్. కు కూడా దూరం అయ్యారు.ఇక 1984-94 మద్య పనిచేసిన పి.రామచంద్రారెడ్డికాని, శ్రీపాదరావు కాని అధికార పార్టీవారితో వివాదపడిన సందర్బాలు చాలా ఉన్నాయి. నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో ఘర్షణ ఏర్పడినప్పుడు స్పీకర్ రామచంద్రారెడ్డి సభాపతి స్థానంలో ఉండే కంటతడిపెట్టుకున్నారు.శ్రీపాదరావునైతే అధికారపార్టీవారు బహిరంగంగానే విమర్శించేవారు.ఆ తర్వాత తిరిగి తెలుగుదేశం హయాంలో యనమల రామకృష్ణుడు స్పీకర్ గా వ్యవహరించిన సందర్భంలో కూడా పార్టీ చీలిక సమయంలో ప్రత్యర్ధి వర్గంవారు ఆయనపై తీవ్రంగా విమర్శలు గుప్పించేవారు. చంద్రబాబు ప్రభుత్వ విశ్వాస పరీక్ష రోజున ఎన్.టి.రామారావుకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్న విమర్శను చేసేవారు. కాగా ఆ సందర్భంలోనే టెక్కలి ఎమ్మెల్యే అప్పయ్య దొరపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్య తీసుకోవాలని అధికార టిడిపి ఫిర్యాదు చేసింది. విశేషం ఏమిటంటే అప్పట్లో సుమారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయకత్వానికి వ్యతిరేకంగా ఎన్.టి.ఆర్.కు మద్దతు ఇచ్చారు. ఎన్.టి.ఆర్.మరణం తర్వాత వారిలో చాలామంది తిరిగి చంద్రబాబునాయకత్వంలోకి వచ్చేశారు. సుమారు పది మంది మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్లారు.సభలో టిడిపిని తీవ్రంగా విమర్శించేవారు. అయినా వారిపై ఎవరూ చర్య తీసుకోకపోవడం విశేషంగా ఉండేది. ఆ తర్వాత ప్రతిభా భారతి స్పీకర్ గా ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆమెపై తీవ్రంగా విమర్శలు చేసేవారు. సభలోనే కొన్ని సందర్భాలలో ప్రతిభా భారతి ప్రభుత్వ పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టేవారు. తదుపరి కాంగ్రెస్ అధికారంలోకి రాగా కె.ఆర్.సురేష్ రెడ్డి స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఆయనపై విమర్శలు చేయడం టిడిపి వంతైంది. అంతేకాదు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విదంగా స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం కూడా జరిగింది. సురేష్ రెడ్డిపై పెట్టిన తీర్మానం వీగిపోయింది. అది వేరే విషయం.ఒకప్పుడు స్పీకర్ కు వ్యతిరేకంగా మాట్లాడడానికే సంకోచించేవారు. బివి సుబ్బారెడ్డి స్పీకర్ గా ఉన్నప్పుడు ఇద్దరు సభ్యులు స్పీకర్ పై హక్కుల తీర్మానం పెట్టడానికి ఒక లేఖ ఇచ్చారు. అదే పెద్ద వివాదం అయి, వారు దానిని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ దశ నుంచి ఇప్పుడు ఏకంగా స్పీకర్ పై రాజకీయ విమర్శలు చేయడం, అవిశ్వాస తీర్మానం వరకు పరిస్థితి వెళ్లింది. తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయినప్పుడు విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆయనను సభాపతి స్థానంలోకి తీసుకు వెళ్లడానికి కూడా ఇష్టపడలేదు. ఇది కూడా విమర్శలకు దారి తీసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ప్రాంతీయ సమస్య వచ్చినప్పుడు ఆయా రాజకీయపార్టీల నేతలు రాజీనామాలు సమర్పించడం, వాటిని స్పీకర్ తోసిపుచ్చడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డే రాజీనామాల నాటకంలో పాత్రధారిగా ఉన్నారని అప్పట్లో తెలంగాణ నేతలు కొందరు ఆరోపించేవారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజారాజ్యం తరపున ఎన్నికైన ఒక ఎమ్మెల్యే కిరణ్ ఇంటి వద్దకు వెళ్లి తమ రాజీనామాలను ఆమోదించాలని ధర్నా చేయడం కూడా వివాదాస్పదం అయింది. స్పీకర్ ఇంటి వద్ద అలా చేయవచ్చా అన్న చర్చ కూడా జరిగింది. శాసనసభ జరిగే రోజులలో ఆయా అంశాలపై స్పీకర్ కార్యాలయం వద్ద, ఛాంబర్ లోపల ధర్నాలు జరిగిన ఘటనలు గత రెండు దశాబ్దాలలో పలుమార్లు జరిగాయి.కాని ఇంటి వద్ద దర్నా చేయడం మాత్రం ఇదే మొదటిసారి. ఆ తర్వాత స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ కు ఈ కష్టాలు తప్పలేదు. తన రాజీనామా ఆమోదించాలని డిమాండు చేసిన సీనియర్ సభ్యుడు డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి ఏకంగా స్పీకర్ మనోహర్ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి నిరసన తెలిపారు. మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద దర్నా చేశారు.అలాగే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు సమర్పించగా వాటిని కూడా తోసిపుచ్చారు.కాని ఆ తర్వాత బహిరంగంగా వారు విప్ ఉల్లంఘన తర్వాత వారిపై వేటు వేయలేకపోవడం మాత్రం తీవ్రంగా విమర్శలకు దారి తీస్తోంది. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సూచన మేరకు స్పీకర్ నడవవలసి వస్తున్నదన్న అభియోగాలు వస్తున్నాయి. ఇందులో కొన్ని నిజాలు ఉండవచ్చు.గత బడ్జెట్ సమావేశాలలో ఎంతో ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పట్టికీ నాదెండ్ల మనోహర్ సమర్ధవంతంగా, సంయమనంగా వ్యవహరించారన్న పేరు వచ్చింది.అలాంటిది ఈసారి అందుకు భిన్నంగా కాస్త వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. నిజమే. రాజకీయాలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాని రాజ్యాంగ పదవులలో ఉన్నవారు కొంతమేరే మాత్రమే తమ పార్టీవారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప వారికి తందానా అన్నట్లుగా కనిపించకూడదు. మొత్తం ఇరవైనాలుగు ఉప ఎన్నికలు ఒకేసారి రాకూడదున్న ఒకే ఒక లక్ష్యంతో జగన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంలో ఆలస్యం చేయడం కచ్చితంగా రాజ్యాంగ విలువలను దెబ్బతీసినట్లే అవుతుంది.గతంలో రాష్ట్రపతులు కొందరు ప్రధానులతో సైతం ఘర్షణకు సిద్దమై రాజ్యాంగానికి అనుగుణంగా నడవడానికి ప్రయత్నించారు. దానివల్ల వారికి ఇబ్బంది వచ్చినా వ్యక్తిగతంగా చరిత్రలో ప్రతిష్ట తెచ్చుకున్నారు. వాజ్ పేయి ప్రభుత్వం అవిశ్వాస తీర్మాన పరీక్ష ను ఎదుర్కున్నప్పుడు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న గమాంగో అప్పటికి ఇంకా ఎమ్.పిగానే ఉన్నారు. ఆయన ఓటు చెల్లుతుందా? లేదా అన్న సమస్య వచ్చింది. సాంకేతికంగా ఆయన ఎమ్.పి కనుక అది చెల్లుతుందని ఆనాటి జి.ఎమ్.సి. బాలయోగి రూలింగ్ ఇచ్చారు. ఆ ఓటుతోనే వాజ్ పేయి ప్రభుత్వం పడిపోయింది. అయినా ఎవరూ బాలయోగిని ఆక్షేపించలేదు. పైగా బాలయోగిని అంతా మెచ్చుకున్నారు. మరి నాదెండ్ల మనోహర్ మరీ ఎక్కువ కాలం అనర్హత వేటు వేయకుండా తనకు చెడ్డ పేరు తెచ్చుకుంటారా? లేక రాజ్యాంగ స్పూర్తికి కట్టుబడ్డ వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారా అన్నది ఆయన చేతిలోనే ఉంది. పైగా ఇప్పటికీ మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కరరావు టిడిపిలో ఎన్.టి.ఆర్. ప్రభుత్వాన్ని పడగొట్టిన సందర్భంలో ప్రజలలో మచ్చ తెచ్చుకున్నారు. అలాంటి పరిస్థితికి యువకుడు, అన్ని విషయాలపై పరిజ్ఞానం కలిగిన మనోహర్ రాకుండా ఉండగలిగితే మంచిదనిపిస్తుంది. రాజకీయాలు ముఖ్యమే. కాని రాజకీయమే పరమావధి కారదన్నది గమనించాలి.

కాని నిజానికి అది ఖర్చులు, ఆదాయం బడ్జెట్లు ......

రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఎలా ఉందో, రాష్ట్ర బడ్జెట్ కూడా అదే మాదిరి గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఎప్పుడూ బడ్జెట్ ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది. సామాన్యుడికి అర్ధం కాకుండా, పెద్ద, పెద్ద అంకెలతో ఊదర కొట్టడమే బడ్జెట్ లక్ష్యంగా కనబడుతుంది. ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏమి కొత్త దనం ఉంది? మన రాష్ట్రం ఏదైనా కొత్త దిశకు, దశకు తీసుకువెళ్లగలిగే పరిస్థితికి ఈ బడ్జెట్ దర్పణం పట్టిందా అంటే దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా ఇది రాబడులు, ఖర్చుల లెక్కే అని తేల్చేశారు. నిజానికి బడ్జెట్ అన్నది ఒక వ్యూహ పత్రంగా, భవిష్యత్తు విదాన పత్రంగా, రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసే బడ్జెట్ గా ఉండాలి. కాని దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకులుగాని, మన బ్యూరోక్రాట్లు కాని ఆ దిశలో ఆలోచన చేయడం లేదనే చెప్పాలి. నిజమే. రాజకీయ పార్టీలు తమ మానిఫెస్టోలలో ఉన్న వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్ లను ప్రవేశపెడతాయి. కాని కాలం గడిచే కొద్దీ రాజకీయ పార్టీలు కేవలం ఓట్లను ఆకర్షించే కొన్ని తాయిలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అభివృద్దికి దోహదపడే దీర్ఘకాలిక అంశాలను సీరియస్ గా తీసుకోవడం లేదు. అప్పుడప్పుడు జీరో బేస్ డ్ బడ్జెట్ అని, లేదా అన్ని శాఖలను పూర్తిగా సమీక్షించి అవసరాలను కొత్తగా గుర్తించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కాని లాబీయింగ్ రాజకీయాలకు అవేవి సఫలం కాలేదు. ఎక్కడ ఏ శాఖలో కోత పెట్టినా అదే ప్రధాన వివాదంగా మారే పరిస్థిని రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నాయి. దాంతో ప్రభుత్వంలో ఉన్నవారు వాటి జోలికి వెళ్లలేకపోతున్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో 92799 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో కేవలం పదకుండు శాతం మాత్రమే పెట్టుబడి వ్యయంగా ఉంది. అంటే మన రాష్ట్రంలో ఆదాయం పెరిగినా, ఆస్తుల సృష్టికి, తద్వారా ఉపాధి పెంపుదలకు సరైన ప్రయత్నం జరగడంలేదని అర్ధం చేసుకోవచ్చు. మన వాళ్లు ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రజాకర్షక స్కీమ్ ను ఆరంభిస్తే దానికి ఒక ధీరీ మాత్రం తయారు చేస్తుంటారు. ఉదాహరణకు సబ్సిడీ బియ్యం పధకం కింద సుమారు రెండువేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని సంకల్పించారు. కిలో బియ్యం రూపాయికే సరఫరా చేస్తారు. దీనికి పౌష్టికాహారం పధకం కింద ప్రచారం చేస్తారు. 1983 లో కిలో రెండు రూపాయల పధకాన్ని ఎన్.టి. ఆర్ ప్రకటించినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. కాని అదే సమయంలో నాటి విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం రూపాయి తొంభై పైసలకే కిలో బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించి అమలు చేసినా జనం పట్టించుకోకుండా ఎన్.టి. ఆర్. ను గెలిపించారు. కాని 1989 లో టిడిపి ఓడిపోయింది. అప్పట్లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వం 1991 లో కిలో బియ్యాన్ని 3,50 రూపాయలకు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో కూడా సబ్సిడీ భాగాన్ని పెంచరాదని కూడా బావించారు. కాని ప్రతిపక్ష టిడిపి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. 1994 ఎన్నికలకు ముందు ఎన్.టి. ఆర్ మళ్లీ రెండు రూపాయల స్కీమును ఎన్నికల వాగ్దానంగా పెడితే అంతా ఆశ్చర్యపోయారు. కారణం ఏదైమైనా మళ్లీ ఎన్.టి. ఆర్ అదికారంలోకి రావడం దానిని అమలు చేయడం, అదే సమయంలో మద్య నిషేధం కూడా వర్తింప చేయడం వల్ల ప్రభుత్వ రెవెన్యూ సంక్షోభంలో పడింది. తదుపరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్లమెంటు ఎన్నికలకు ముందు తామైతేనే కిలో రెండు రూపాయల పధకం అమలు చేస్తామని చెప్పి ప్రచారం చేసినా, ఎన్నికల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో పలు సమావేశాలు ఏర్పాటు చేసి బియ్యం ధర పెంచవలసిన అవసరం, మద్య నిషేదాన్ని సడలించవలసిన పరిస్థితిని తెలియచెప్పారు. తదుపరి కిలో బియ్యం ఐదు రూపాయలకు పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత 1998 లోక్ సభ ఎన్నికలలో టిడిపి దెబ్బతిన్నా, 1999 ఎన్నికలలో బిజెపితో పొత్తు పెట్టుకుని టిడిపి అధికారంలోకి వచ్చింది. అంటే ఎన్. టి ఆర్ కిలో రెండు రూపాయలకు బియ్యం అమలు చేసినా 1989 లో ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు బియ్యం రేట్లు పెంచినా 1999 లో గెలవగలిగారు. 2004 నాటికి పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ నేత వై. ఎస్. రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తదితర ఆకర్షణీయమైన నినాదాలు తీసుకురావడం, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి పాదయాత్ర చేయడం వంటి వాటి ద్వారా అధికారంలోకి రాగలిగారు. రాజశేఖరరెడ్డి విప్లవాత్మకంగా ఉచిత విద్యుత్ తో పాటు సాగునీటి ప్రాజెక్టులకు ఎన్నడూ లేని రీతిలో ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా కొత్త పుంతలు తొక్కారని చెప్పాలి. ఆ రోజులలో చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలన్న వ్యాఖ్య చేసి ఇరుకున పడ్డారు. ఎందుకంటే తర్వాత కాలంలో ఆయన కూడా ఉచిత విద్యుత్ వాగ్దానం చేసినా ప్రజలు పూర్తిగా ఆయనను విశ్వసించలేదు. ఈ స్కీములు మంచివా? కావా అన్న మీమాంస ప్రజలలో రావడం లేదు. రాజకీయ నేతలు ప్రజలను ఓటు యంత్రాలుగా మలచి భ్రమలలో పెడుతున్నారు. అసలు సబ్సిడీలు వద్దని ఎవరూ అనరు. కాని దానికి కొన్ని పరిమితులు లేకపోతే భవిష్యత్తుకు అవసరమైన ప్రాజెక్టుల నిమిత్తం నిదుల సమస్య ఏర్పడుతుంది. అంతేకాదు. వై. ఎస్, రాజశేఖరరెడ్డి ఫీజుల రీయింబర్స్ మెంట్ స్కీము, ఆరోగ్యశ్రీ స్కీము వంటివి అమలు చేయడమే కాక మళ్లీ రెండు రూపాయలకు కిలో బియ్యం పధకాన్ని అమలు చేయడం ఆరంభించారు. అంటే 1983 లో అమలు చేసిన పదకాన్ని వై. ఎస్. మళ్లీ ఆచరణలోకి తెచ్చారన్నమాట. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో అడుగు ముందుకేసి కిలో బియ్యం రూపాయికే ఇస్తామని ప్రకటించి, దానిని అమలు చేయడం ఆరంభించారు. ఇది నిజంగా ఒకరకంగా ఆత్మహత్య సదృశ్యం వంటిదని చెప్పాలి. కేవలం ఓట్ల కోసం ఇలాంటి పధకాలను ప్రవేశపెడుతున్నారే కాని దాని మంచి, చెడు ఆలోచించడం లేదు. ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పేదరికంపై ప్లానింగ్ కమిషన్ వేసిన అంచనాల ప్రకారం మన రాష్ట్రంలో కేవలం 15.8 శాతం మంది మాత్రమే పేదలు ఉన్నారు. అయితే పట్టణాలలో మాత్రం 27.5 శాతం పేదలు ఉండగా, గ్రామాలలో కాస్త తక్కువగా ఉన్నారన్నది ఆ లెక్కల సారాంశం. ఇది మన రాష్ట్ర ప్రగతిగా చెప్పుకోవాలి. కాని ఇదే సమయంలో మన ప్రభుత్వం జారీ చేసిన తెల్ల కార్డుల సంఖ్య చూస్తే అవి కోటి ఎనభై లక్షలుగా ఉన్నాయి. పింక్ కార్డులు ముప్పైలక్షల లోపే ఉన్నాయి. ఇవి కాక ఎఎవై స్కీమ్ కింద మరో పదిహేనున్నర లక్షల కార్డులు ఉన్నాయి. అంటే దీనిని బట్టి మన రాష్ట్రంలో ఎనభై ఐదు శాతంమంది పేదరికంలో ఉన్నట్లు లెక్క. దీనిని ఏ విదంగా అర్దం చేసుకోవాలి. ఇది బడ్జెట్ గందరగోళంగా తీసుకోవాలా? వద్దా? ఎప్పుడు రచ్చబండలు జరిగినా లక్షల సంఖ్యలో తెల్లకార్డులు ఇచ్చామని ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంటోంది. ఇక తలసరి ఆదాయం చూస్తే 2010-11 లో 62.912 రూపాయలుగా ఉంటే, తదుపరి సంవత్సరం అది 71.540 రూపాయలుగా ఉంది. ఈ అంకెలను ఎంతవరకు విశ్వసించాలో అర్ధం కాదు. ఎందుకంటే మన ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలే అందుకు ఉదాహరణగా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ది చూస్తే అంతంతమాత్రంగానే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి .1991 నుంచి కొత్త పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చాక ఇప్పటివరకు 7346 ప్రతిపాదనలు వచ్చాయి. వాటి విలువ 7,78,494 కోట్లుగా ఉంది. ఇవన్ని అమలు అయితే 13,49,084 లక్షల మందికి ఉపాధి లభించి ఉండాలి. కాని వీటిలో 3132 ప్రతిపాదనలు అమలు చేస్తే పెట్టుబడి మాత్రం 73.588 కోట్లు మాత్రమే వచ్చింది. వీటివల్ల కలిగిన ఉపాధి 478900 అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అలాగే చిన్న, మద్య తరహా పరిశ్రమల అంచనాలు కూడా అందుకు భిన్నంగా లేవు. పరిస్థితి ఈ విధంగా ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ రాజివ్ యువకిరణాల ద్వారా రెండేళ్లలో పద్నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెబుతున్నారు. ఇరవైఏళ్లలో రాని ఉద్యోగావకాశాలు రెండేళ్లలో ఎలా వస్తాయో అర్దంకాదు. వ్యవసాయం రంగం చూస్తే గత సంవత్సరం అంతకుముందు ఏడాది కన్నా ముప్పై లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. కాని సాగు నీటి సదుపాయం కలిగిన విస్తీర్ణం ఇరవైఒక్క లక్షల ఎకరాలు పెరిగిందని చెప్పారు. కాని ఆహారధాన్యాల ఉత్పత్తి అంత భారీగా తగ్గడం ఏమి సూచిస్తుందో చెప్పనవసరం లేదు. ప్రతిష్టాత్మకంగా రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం అత్యంత ఖరీదైనకార్యక్రమంగా మిగిలిపోతుందేమోనన్న ఆందోళన కలుగుతుంది. ఇప్పటివరకు డెబ్బేవేల కోట్లు పైగా ఖర్చు చేసినా గణనీయంగా ఫలితాలు రాలేదు. మొత్తం 97 లక్షల ఎకరాలకు ఉద్దేశించిన 86 ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తి అవుతాయన్న గ్యారంటీ లేదు. పైగా పోలవరం ప్రాజెక్టును వివాదంగా మార్చడానికి కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో ఆచరణ సాధ్యం కాని ప్రాణహిత -.. చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ప్రజలను మోసం చేయడానికి అందరూ కృషిచేస్తున్నారు ఆ ప్రాజెక్టుకు అయ్యే సుమారు ఏభై వేల కోట్ల మొత్తాన్ని తెలంగాణ ప్రాంతానికి కేటాయించి, ఎక్కడకక్కడ చిన్న, మద్య నీటి పారుదల స్కీములను అమలు చేయడం మంచిదని అందరికి తెలిసినా, దాని గురించి ఆలోచించరు. ఎందుకంటే ప్రజలను మోసం చేస్తూ, తమను తాము మోసం చేసుకోవడంలో మన రాష్ట్ర నేతలు బిజీ అయిపోతున్నారు. అది మన దురదృష్టం. ఇక్కడే మనకు నాయకత్వ లోపం ఎదురవుతోంది. విద్యుత్ రంగం తీసుకోండి. కొత్త ప్లాంట్ లు వస్తుంటే ధర్నాలకు నేతలే నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో కూడా ముడుపుల గొడవలు ఎక్కువగానే ఉంటున్నాయి. అదే సమయంలో గంటల తరబడి కరెంటు కోతలు అనుభవించాల్సి వస్తున్నా ఎవరికి కనికరం కలగడం లేదు. దీనిపై బడ్జెట్ లో స్పష్టమైన విధానం ఉన్నట్లు కనిపించదు. కరెంటు కోత వల్ల పరిశ్రమలు మరింత దెబ్బతినబోతున్నాయి. ఇక ఎస్.ఇ. జడ్ ల గురించి చూస్తే 75 ఎస్.ఇ. జడ్ లు ఉంటే ఇప్పటికి ఇరవై ఏడు మాత్రమే అమలులోకి వచ్చాయి. ఎనిమిదిన్నర లక్షల మందికి ఉపాధి కలుగుతుందని భావిస్తే ఇంతవరకు లక్ష ఐదు వేల మందికే ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఒకే ఒక రంగంలో మనం మంచి ప్రగతి సాధించాం. మన రాష్ట్రం నుంచి జరుగుతున్న ఎగుమతులలో నలభై తొమ్మిది శాతం ఐటి రంగం నుంచే జరుగుతున్నాయి. ఇది బాగానే ఉన్నా, గత రెండేళ్లుగా ఈ రంగం కూడా బాగా దెబ్బతింది. ప్రాంతీయ ఉద్యమాలు, ఇ తర రాజకీయ సమస్యలు ప్రభావితం చేస్తున్నాయి. దీని గురించి బడ్జెట్ లో విశ్లేషణ ఉన్నట్లు కనబడదు. ఇక అప్పులు కూడా లక్షా అరవైవేల కోట్లకు చేరుకోవడం కూడా అంత మంచి పరిణామం కాదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. వివిధ కారణాల వల్ల మన రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. లక్షా నలభై ఐదు వేల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టడంలో కొంత అతిశయోక్తి ఉండవచ్చన్న భావన ఉన్నా, లక్ష ఇరవై వేల కోట్ల వరకు బడ్జెట్ అమలు జరిగినా అభినందించాల్సిందే. ఈ ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమంలో ఒకటైన రాజివ్ యువకిరణాలకు కూడా భారీగానే కేటాయింపులు జరిపారు. అంతవరకు బాగానే ఉంది. కాని నిర్దిష్ట ప్రయోజనం అమలు జరిగేలా చూడకపోతే ఈ నిధులన్నీ వృధా అయిపోతాయన్న విషయాన్ని నేతలు గుర్తించుకోవాలి. మన ప్రభుత్వాలు ఇటీవలికాలంలో ఓట్ల యావలో పడి అన్ని వర్గాలను ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో అనేక పధకాలను ఆరంభించి నోరు వెళ్లబెడుతున్నాయి. అందువల్లనే ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగాన్ని చదివి ఆయనే స్వల్ప అస్వస్థతకు గురి కావల్సి వచ్చింది. గంటన్నర ప్రసంగానికే ఆయన ఇబ్బంది పడితే, ఏళ్లతరబడి ప్రజలు ఉద్యమాలతో సతమతమవుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకుండా వ్యూహం లేకుండా కేవలం జమా, ఖర్చుల పత్రంగా బడ్జెట్ ను పరిగణిస్తే ఇంతకంటే గొప్పగా బడ్జెట్ ఎలా ఉంటుంది?