Read In Tollywood Latest News

Friday, August 31, 2012

కసబ్ దొరక్కపోతే: హైదరాబాద్ ఖాతాలోనే 26/11...

But Kasab Capture Blame Might Have Fallen

ముంబయి 26/11 దాడుల వెనుక కుట్ర బయట పడకపోతే ఇది భారతీయ ముస్లిం ఉగ్రవాదుల ఖాతాలో ప్రత్యేకంగా హైదరాబాదు ఖాతాలో పడేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. ముంబయి కాల్పుల నిందితుడు, ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం ఉరిశిక్షను సమర్థించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీం సంచలన వ్యాఖ్యలు చేసింది. కసబ్‌కు ఉరిశిక్షను సమర్థించిన సుప్రీం కోర్టు ధర్మాసనం తన తీర్పులో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కసబ్ పట్టుబడకపోతే దీని వెనుక కుట్ర బయటపడేది కాదని పేర్కొంది.

ఉగ్రవాదులంతా భారతీయులేనని, హైదరాబాద్ నుంచే వచ్చారనే తప్పుడు ప్రచారం జరిగేదని, ముజాహిదీన్ అనో, హైదరాబాద్ దక్కన్ అనో కల్పిత సంస్థలను సృష్టించి, వాటికి బాధ్యత అంటగట్టేవారని, ముంబై ముట్టడి కుట్రలో ఉన్న అత్యంత దారుణమైన కోణమిదని జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ సికె ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. కసబ్ సజీవంగా దొరక్కపోతే దర్యాప్తు అధికారులకు అసలు విషయాలు తెలిసేవి కావని తెలిపింది.

ఇది స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా అనేక విపరిణామాలకు దారి తీసేదని, రెండు వర్గాల మధ్య అపనమ్మకానికి కారణమయ్యేదని, దేశంలో మతసామరస్యం దెబ్బతినేదని సుప్రీం ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ముంబై ముట్టడిలో భాగంగా ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సిఎస్‌టీ) రైల్వే స్టేషన్‌ను కూడా ఎన్నుకోవడం కూడా వ్యూహాత్మకమే అని తెలిపింది. సిఎస్‌టీ నుంచి నలుమూలలకు రైళ్లు నడుస్తాయని, దాడుల గురించి తెలియగానే పెద్దసంఖ్యలో జనం సిఎస్‌టీకి తరలి వస్తారని, బాధితులు, బాధితుల బంధువులు మీడియా ప్రత్యక్ష ప్రసారంలో ఆవేశంతో, ఆక్రోశంతో, తీవ్ర పదజాలంతో చేసే వ్యాఖ్యలు ఒకేసారి దేశంలోని నలుమూలల ప్రతిధ్వనిస్తాయన్నారు.
దీనివల్ల భారీ స్థాయిలో మత ఘర్షణలు చెలరేగేవని, భారతీయ సమాజంలో, ప్రభుత్వాల్లో అస్థిరతను సృష్టించాలనే ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరేదని ధర్మాసనం పేర్కొంది. 2008 నవంబర్ 26వ తేదీ రాత్రి ముట్టడి మొదలుకాగా... మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు కసబ్ దొరికిపోయాడని, కొన్ని గంటల్లోనే అతని మూలాలు కూడా తెలిసిపోయాయని, దీంతో... ఉగ్రవాదులంతా పాకిస్థాన్‌కు చెందిన వారే అని స్పష్టమైందని, అదే సమయంలో... ప్రభుత్వ యంత్రాంగం నుంచి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై భారతీయ ముస్లింలలో అనేక ఫిర్యాదులు ఉండటమూ నిజమే అని తెలిపారు.

ఈ ఫిర్యాదుల్లో కొన్ని అపోహలు ఉండవచ్చునని, మరికొన్నింటికి సంబంధిత వ్యక్తులే కారణం కావొచ్చునని, మరికొన్ని మాత్రం నిజమై ఉండవచ్చునని, ఏదిఏమైనా... భారతీయ ముస్లిం ఎవరూ అమాయకులను, తోటి భారతీయులను నిర్దయగా, రాక్షసంగా చంపాలని కలలోనైనా అనుకోరని, ఎందుకంటే... భారతీయ ముస్లింలు తమ దేశాన్ని, తమ దేశీయులను ప్రేమిస్తారని న్యాయమూర్తులు పేర్కొన్నారు. పాకిస్థాన్ ఏర్పాటుకు కారణమైన మహమ్మదాలీ జిన్నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నగరం ముంబై అని, మరీ ప్రత్యేకించి తాజ్ హోటల్‌తో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధముందని, అలాంటి చోట అల్ కాయిదా బాంబులు ఎలా పెట్టగలిగిందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

No comments:

Post a Comment