Read In Tollywood Latest News

Friday, August 17, 2012

రాజ్యసభలో తెలంగాణ......

 Telangana Rajya Sabha
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరగని అన్యాయం లేదని రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, గుండు సుధారాణిలు శుక్రవారం అన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభలో తెలంగాణపై తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ గుండు సుధారాణి మాట్లాడారు. సమైక్యాంధ్రలో దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ను ఏలిన ప్రభుత్వాలు తెలంగాణ కోసం జరిగిన ఒప్పందాలను, ఫార్ములాలను ఉల్లంఘించాయన్నారు.

తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రం గుర్తించడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తామని కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఎన్డీయే ప్రకటించిందని, బిల్లు పెడితే మద్దతివ్వడానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ అన్ని రంగాలలో వెనుకబడిందన్నారు.
తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం మినహా మరో మార్గం లేదన్నారు. ఒప్పందాలు, చట్టాలు అన్ని ప్రయోగాలు అయిపోయాయని, వాటిని సీమాంధ్ర నేతలు ఉల్లంఘించారన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 60 శాతం తెలంగాణ ప్రాంతం నుండే వస్తుందన్నారు. రాష్ట్రంలో వెంటనే 610 జివోను అమలు చేయాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అరవయ్యేళ్లుగా తెలంగాణ సీమాంధ్రుల చేతిలో మోసపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణకు జరగని అన్యాయం ఏదీ లేదని కాంగ్రెసు ఎంపి రాపోలు ఆనంద్ భాస్కర్ అన్నారు. స్మాల్ ఈజ్ బ్యూటీఫుల్ అని.. చన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో అవమానాలు భరించారని, ఇంకా భరించే ఓపిక లేదన్నారు. సీమాంధ్ర నుండి విడిపోతేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవాన్ని కోరుకుంటున్నారని అన్నారు. రెండు రోజుల క్రితమే స్వతంత్ర్యం వచ్చిందని జాతీయ పతాకానికి వందనం చేశామని, కానీ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రం రావడం లేదన్నారు.
అరవయ్యేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని, అయినా ఆ ప్రాంతానికి న్యాయం జరగలేదని, విడిపోవడమే సమస్యకు పరిష్కారమన్నారు. 1948 సెప్టెంబర్ 17వ తారీఖున నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌లో చొరవతో నిజాం ఆదీనంలో ఉన్న హైదరాబాద్ స్వతంత్ర భారత దేశంలో కలిసిందన్నారు. దాంతో తమకు విముక్తి దొరికిందని ప్రజలు భావించారని, కానీ మళ్లీ ఆంధ్ర ప్రదేశ్‌లో కలపడం వలన తాము అన్యాయానికి గురయ్యామన్నారు. హైదరాబాదు రాష్ట్రంలో ఎన్నో భాషలు మాట్లాడే వారు నాటి నుండి ఉంటున్నారన్నారు.

No comments:

Post a Comment