
2004 నుంచి 2009 మధ్య జరిగిన బొగ్గు కేటాయింపులపై కాగ్ శుక్రవారం నివేదిక సమర్పించింది. బొగ్గు గనుల కేటాయింపులో భారీగా అక్రమాలు జరిగాయని నిర్థారించింది. ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం వ్యవహరించదని కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. టాటా గ్రూపు సంస్థలు, జిందాల్ స్టీల్ అండ్ పవర్, అనిల్ అగర్వాల్ సంస్థలు, ఎస్సార్ గ్రూపు సంస్థలు, అదాని గ్రూపు, ఆర్సెలర్ మిట్టల్, ల్యాంకో సంస్థలకు బొగ్గు కేటాయింపుల్లో బాగా ప్రయోజనం పొందాయని కాగ్ స్పష్టం చేసింది. మొత్తం 25 కంపెనీల జాబితాను కాగ్ ఇచ్చింది.
అదే విధంగా ఢిల్లీ విమానాశ్రయంపై కూడా కాగ్ నివేదిక ఇచ్చింది. ఏడాదికి కేవలం 100 రూపాయల అద్దెతో 60 ఏళ్ల పాటు జీఎంఆర్కు భూమి కేటాయించారని కాగ్ చెప్పింది. దీనివల్ల ప్రభుత్వానికి 60 ఏళ్లలో 1,63,557 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం పోయిందని తేల్చింది.
ఇదిలావుంటే, అసోం అల్లర్లపై పార్లమెంట్ ఉభయ సభలూ దద్దరిల్లాయి. శుక్రవారం ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే పూణె, బెంగుళూరు, ఆంధ్రప్రదేశ్ల నుంచి పెద్ద సంఖ్యలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లిపోతుండడంపై లోక్సభ, రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై ప్రధానమంత్రి వివరణ ఇవ్వాలని సభ్యులు పట్టుపట్టడంతో మన్మోహన్సింగ్ వివరణ ఇచ్చారు.
పుకార్ల నేపథ్యంలో ఎవరూ సొంత స్థలాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పిస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బెదిరింపులకు పాల్పడేవారిని, పుకార్లు సృష్టిస్తోన్నవారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వం ఎవరిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుందో స్పష్టం చేయాలని జేడీయూ నేత శరద్ యాదవ్ కోరారు.
No comments:
Post a Comment