
ఈ నేపథ్యంలో అందరి చూపూ ఇద్దరు స్టార్లపైనే. ఒకరేమో హైదరాబాదీ స్టయిలిష్ బ్యాట్స్మన్ వివియస్ లక్ష్మణ్ కాగా, మరొకరు స్టార్ బ్యాట్స్మన్, పార్లమెంటు సభ్యుడు సచిన్ టెండూల్కర్. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్కు దూరంగా ఉన్న సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్కు ఎంపికయ్యాడు. వివియస్ లక్ష్మణ్ జట్టులో స్థానం పొందాడు. ఇప్పటికే 38వ పడిలో పడ్డ ఈ వెటరన్ ఆటగాడి ఫిట్నెస్, ఫామ్ను కూడా సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారని చెప్పవచ్చు.
తొలి టెస్టు హైదరాబాద్లో జరగనుంది కాబట్టి అనుభవజ్ఞుడైన లక్ష్మణ్వైపు సెలెక్టర్లు మొగ్గు చూపినట్లు అర్థమవుతోంది. అదీగాక మిడిలార్డర్లో భారత బ్యాటింగ్ లైనప్కు వెన్నెముకగా నిలిచే 'మిస్టర్ డిపెండబుల్' రాహుల్ ద్రావిడ్ లేడు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించగల ఆటగాడు లక్ష్మణే. పైగా మిడిలార్డర్లో ద్రావిడ్, సచిన్ తర్వాత అంతటి అనుభవమున్న ఆటగాడు వీవీఎస్ మాత్రమే. వీటితోపాటు సొంతగడ్డపై రికార్డు కూడా దృష్టిలో పెట్టుకుని అతడికి మరో పది టెస్టులకు అవకాశం ఇచ్చినట్లు భావించాలి.
అస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో వివియస్ లక్ష్మణ్ వైఫల్యం కావడం వల్ల అతను జట్టులోకి వస్తాడా, లేదా అనే అనుమానాలు చోటు చేసుకున్నాయి. అయితే, మిడిల్ ఆర్డర్లో రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని విరాట్ కోహ్లీ పూరిస్తాడని, దానివల్ల లక్ష్మణ్ అవసరం ఉండకపోవచ్చునని అనుకున్నారు. అలాగే, ఛతేశ్వర పూజారా బ్యాటింగు తీరులో ద్రావిడ్ నైపుణ్యం ఉంది. దానివల్ల లక్ష్మణ్ను టెస్టు సిరీస్కు దూరంగా ఉంచుతారని అనుకున్నారు. అయితే, క్లిష్టమైన దశలో పలు మ్యాచులను విజయం దిశాగా నడిపించిన చరిత్ర లక్ష్మణ్కు ఉంది. ఓడిపోతామనే మ్యాచులను డ్రా దిశగానో, గెలుపు దిశగానో సాగించడంలో లక్ష్మణ్ పేరు గడించాడు. అందువల్ల లక్ష్మణ్ను అవమానకరమైన పద్దతిలో ఇంటికి పంపించడం బాగుండదని బిసిసిఐ భావించి ఉండాలని అంటున్నారు. ఏమైనా, లక్ష్మణ్ సొంత గడ్డపై మునుపటి ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
No comments:
Post a Comment