
వచ్చే నెల నుంచి డీజిల్, పెట్రోల్ ధరలు పెరగనున్నాయి. గడచిన వారంలో క్రూడ్ ఆయిల్ ధరలు 3 నెలల గరిష్టానికి పెరగడంతో చమురు మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇంధన ధరలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దీనికితోడు బలహీన వర్షపాతం, విద్యుత్ సరఫరా అంతరాయాల కారణంగా డీజిల్ వినియోగం గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల నుంచి ఇంధన ధరలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి) ఇదివరకెన్నడూ లేనివిధంగా గరిష్ట త్రైమాసిక నష్టాలను ప్రకటించడంతో, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరల పెంపు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా చమురు మంత్రిత్వ శాఖపై వత్తిడి తీసుకువస్తున్నాయి. గడచిన త్రైమాసికంలో చమురు కంపెనీలు మొత్తం రూ.40,000 కోట్లకు పైగా నష్టాలను ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఇంధన ధరలు భగ్గుమనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే ప్రతి లీటర్ డీజిల్పై రూ.4-5 చొప్పున అలాగే లీటర్ పెట్రోల్పై రూ.3 చొప్పును పెరగవచ్చని అంచనా. ధరల పెంపు ఆహ్వానించబడినదే అయితే ఎప్పుడు, ఎంతమేర పెంచాలనే విషయాన్ని మాన్సూన్ సీజన్ ముగిసిన తర్వాత నిర్ణయించడం జరుగుతుందని ఓ అధికారి చెప్పారు.
వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీన ముగియనున్నాయి. ఈ సమావేశాలు ముగిసన వెంటనే మరోసారి వినియోగదారుల నడ్డి విరగటం ఖాయమని తెలుస్తోంది.
No comments:
Post a Comment