Read In Tollywood Latest News

Wednesday, August 29, 2012

కసబ్‌‌కు ఉరిశిక్షే, అదే సరైనది: సుప్రీం వ్యాఖ్య....

 Supreme Court Give Verdict On Kasab Today

2008 నవంబర్ 26న ముంబై దాడుల ఘటన కేసులో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు ఉరిశిక్షే సరైనదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. కసబ్ పెట్టుకున్న పిటిషన్ పైన సుప్రీం కోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. కసబ్ వంటి ఉగ్రవాదులకు ఒక్క ఉరి తప్ప మరో శిక్ష లేదని చెబుతూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. న్యాయావాదిని నియమించలేదన్న సాకుతో కసబ్ మినహాయింపు పొందలేడని, భారతదేశంపైకి దాడికి తెగబడటం కసబ్ చేసిన పెద్ద తప్పు అని సుప్రీం పేర్కొంది. రెండేళ్ల క్రితం కసబ్‌కు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది.

కసబ్ దీనిని సవాల్ చేస్తూ బాంబే కోర్టుకు వెళ్లారు. బాంబే కోర్టులో కూడా అతనికి చుక్కెదురైంది. ప్రత్యేక కోర్టు తీర్పును ఆ కోర్టు సమర్థించింది. దీంతో కసబ్ సుప్రీంకోర్టులో తనకు ఉరిశిక్ష నుండి మినహాయించాలని, యావజ్జీవ శిక్ష వేయాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కసబ్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉరిశిక్ష విధించాలని ఈ రోజు తీర్పు చెప్పింది. 2008లో ముంబయి ఉగ్రవాదుల దాడి ఘటనలో కసబ్ తప్ప మిగిలిన ఉగ్రవాదులు అందరూ మరణించారు.

తాజ్ హోటల్లో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక ఉగ్రవాది కసబ్. కసబ్ కేసు విషయంలో 11వేల పేజీలతో దర్యాఫ్తు సంస్థ ఛార్జీషీట్ దాఖలు చేసింది. 13 నెలల పాటు దర్యాఫ్తు సంస్థ ఈ కేసును విచారించింది. 3192 సాక్ష్యాధారాలను పరిశీలించింది. 2009 ఏప్రిల్ 15వ తేదిన కసబ్ కేసు ప్రారంభమైంది. ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటైంది. దేశంలోని ఉగ్రవాదుల కేసులలో అత్యంత వేగంగా పూర్తయిన కేసు కసబ్‌దే. తనపై కసబ్ దాడి చేశాడని పదేళ్ల బాలిక కూడా ఫిర్యాదు చేసింది. ముంబయి దాడుల ఘటనలో 166 మంది మృతి చెందారు.

ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ.. కసబ్ దాఖలు చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించిందని, ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిందని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు సరైనదని, కసబ్ దోషి అని నిరూపించగలిగామని, కేసు అత్యంత వేగంగా విచారణ జరిగిందని న్యాయవాది చెప్పారు.

No comments:

Post a Comment