Read In Tollywood Latest News

Monday, August 20, 2012

తెలంగాణపై లేఖ ఇవ్వబోతున్నా : నేతలతో చంద్రబాబు!...


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలంగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సొంత పార్టీ నేతలకు తేటతెల్లం చేశారు. ఈ లేఖ ఇవ్వడం ద్వారా తాను మచ్చలేని చంద్రుడిగా రాజకీయాల్లో కొనసాగాలన్నదే తన అభిప్రాయంగా ఉందని ఆయన తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరినట్టు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణ అంశంపై సీమాంధ్ర నేతలు, పార్టీకి అండగావున్న సామాజిక వర్గ నేతలతో చంద్రబాబు విడివిడిగా ముఖాముఖి చర్చించారు. ఇందులో తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందో లేదో తెలియదు కానీ, కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయం ఎత్తుగడతో మనం తీవ్రంగా నష్టపోతున్నాం. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించి ప్రజల్లోకి వెళ్తాను.

ఇది నా నిర్ణయం. ఇక మీ ఇష్టం అంటూ వారికి తేటతెల్లం చేసినట్టు సమాచారం. తెలంగాణకు తెలుగుదేశం పార్టీయే అడ్డంకి అనే భావన తెలంగాణ ప్రజల్లో బలంగా ఏర్పడిందని, తెలంగాణలో పార్టీకి ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, ఈ ప్రచారం వల్ల పార్టీకి తీరని నష్టం కలిగిందని వివరించారు.

ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బతికిబట్టకట్టాలంటే తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదన్నారు. తెలంగాణకు అనుకూలంగా గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చాను. పార్టీ కోసం ఇది చేస్తున్నా, తరువాత మీ ఇష్టమంటూ ఆయన తన వర్గానికి చెందిన సీమాంధ్ర నేతలకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పటికే... బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణలపై ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నా.. ఇక తెలంగాణపై కూడా తన నిర్ణయాన్ని వెల్లడించి ప్రజల్లోకి వెళతానని వారికి తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై సీమాంధ్ర నేతలు ప్రస్తుతానికి నోరు మెదపక పోయినప్పటికీ లేఖ ఇచ్చిన తర్వాత మాత్రం ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

No comments:

Post a Comment