Read In Tollywood Latest News

Friday, August 17, 2012

కాంగ్రెసును భూస్థాపితం చేస్తాం: హరీష్ రావు....

 We Will Target Congress Harish Rao
తెలంగాణకు అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం అడ్డంకి అనే విషయం తేలిపోయిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష ఉప నేత తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాజ్యసభలో శుక్రవారం తెలంగాణపై బీజేపీ ప్రైవేట్ బిల్లుపై చర్చ జరిగిన తీరుపై ఆయన స్పందించారు. కాంగ్రెసు పార్టీని భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు పార్టీని వీడాలని ఆయన సూచించారు.

దేశంలోని అనేక పార్టీలు రాజ్యసభలో తెలంగాణకు అనుకూలంగా గళం విప్పాయని, దీంతో తెలంగాణకు జాతీయ స్థాయిలో ఆమోదం ఉందని స్పష్టమైందని ఆయన అన్నారు. అయితే అధికార కాంగ్రెస్ సాచివేత ధోరణి ప్రదర్శించిందని, రాజ్యసభలో తెలంగాణపై జరిగిన చర్చకు కూడా ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అర్థమైందని ఆయన అన్నారు.
ప్రైవేట్ బిల్లుతో నిర్ణయాలు జరగవు గానీ కాంగ్రెస్ మోసపూరిత వైఖరి మరోసారి రుజువైందని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మా పోరాటం కాంగ్రెస్‌పైనే ఉంటుందని ఆయన చెప్పారు. ఆ పార్టీని తెలంగాణలో భూ స్థాపితం చేస్తామని, కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

తెలంగాణపై కాంగ్రెస్‌కు, యుపిఎ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రధాని లేదా హోం మంత్రి సమాధానం చెప్పేవారని, ఈ రకంగా బుల్డోజ్ చేసే వారు కాదని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలు తెలంగాణ వాదులా ? కాంగ్రెస్ వాదులా ? తేల్చుకోవాలని ఆయన సూచించారు. వారు నిజమైన తెలంగాణ వాదులైతే ఆ పార్టీతో చావో రేవో తేల్చుకోవాలని, కాంగ్రెస్ నుంచి బయటికి రావాలని ఆయన అన్నారు.
ప్రజలు సమస్యలపై రోడ్డు బాట పడితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇందిరమ్మ బాట పట్టారని తెరాస నాయకుడు నాయని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి కుర్చీలో కూర్చునే హక్కు లేదని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రధానమైన తెలంగాణ సమస్యను పక్కన పెట్టి ముఖ్యమంత్రి కాకమ్మ కథలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజాసమస్యలపై చర్చించేందుకు శాసనసభా సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment