
తెలంగాణపై కేంద్రం నుంచి తెలంగాణపై సానుకూల ప్రకటన వస్తుందని తనకు సంకేతాలు అందినట్లు చెప్పిన మాటలను పార్టీలు గానీ ప్రజా సంఘాలు గానీ విశ్వసించడం లేదు. కెసిఆర్ విశ్వసనీయత కోల్పోయారని, కెసిఆర్ మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ఒకవేళ కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వస్తే తాను కెసిఆర్కు స్వీటు తినిపిస్తానని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రకటనపై ఏ మాత్రం విశ్వాసం లేని సిపిఐ తెలంగాణ పోరు యాత్రకు శ్రీకారం చుడుతోంది.
సిపిఐ, బిజెపి, తెలంగాణ జెఎసిలు కెసిఆర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసేందుకు సిద్ధపడుతున్నాయి. అయితే, ఈ పార్టీల ప్రయత్నాలను దెబ్బ తీసి, తన ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమం కోసం కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు. నిజానికి, రాజకీయ పార్టీలు ఏకమై పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడుతుందనే భావన పార్టీల నాయకులు నుంచి కూడా వ్యక్తమవుతోంది. కానీ ఆ పార్టీలు అందుకు సిద్ధంగా లేవు. రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు విడివిడిగానే ఉద్యమాలు చేపట్టేందుకు సిద్ధపడుతున్నాయి.
తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో తెలంగాణ జెఎసి సెప్టెంబర్ 30వ తేదీన తెలంగాణ మార్చ్కు పిలుపునిచ్చి, హైదరాబాదును దిగ్బంధం చేయాలనే ఉద్దేశంతో ఉంది. సిపిఐ ఈ నెల 25 తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు తెలంగాణ పోరు యాత్ర నిర్వహిస్తోంది. తెలంగాణపై ప్రజల్లో గందరగోళం సృష్టించడమే ఉద్దేశంగా కెసిఆర్ పనిచేస్తున్నారని సిపిఐ విమర్శిస్తోంది. ఆ విషయం కెసిఆర్కు స్పష్టంగా తెలుసునని అంటోంది.
తెలంగాణలో బలోపేతం కావడానికి బిజెపి తన ఎత్తులు తాను వేస్తోంది. ఇతర పార్టీలతో కలవకుండా ఒంటరిగా ఆందోళనలు చేపట్టే ఉద్దేశంతో ఉంది. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సెప్టెంబర్ 3వ తేదీ నుంచి డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహానికి దిగుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో బిజెపి పలు ఆందోళనలకు కార్యాచరణ రూపొందించుకుంది. ఈ స్థితిలో కెసిఆర్ మౌనంగా ఉండదలుచుకోలేదని అంటున్నారు. తాము చేపట్టబోయే ఆందోళనల రూపకల్పనకు ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మేధోమథనం జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment