Read In Tollywood Latest News

Thursday, August 2, 2012

పథకం ప్రకారమే పూణే వరుస బాంబు పేలుళ్లు....

 Pune Blasts Planned Coordinated Act Union Home
పథకం ప్రకారమే పూణే వరుస బాంబు పేలుళ్లు సంభవించాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫోరెన్సిక్ నిపుణలు పేలని రెండు ఐఇడిలను, నాలుగు పేలుళ్ల స్వభావాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర హోం కార్యదర్శి ఆర్‌కె సింగ్ చెప్పారు. పేలుళ్లు 500 మీటర్ల పరిధిలో సంభవించడాన్ని, 45 నిమిషాల వ్యవధిలో జరగడాన్ని బట్టి సమన్వయంతోనే ఈ సంఘటనకు పాల్పడినట్లు అర్థమవుతోందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
జాతీయ దర్యాప్తు సంస్థ, జాతీయ భద్రతా గార్డ్స్, కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు పూణేకు గురువారం ఉదయం చేరుకుని పేలుడు పదార్థాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేలని రెండు ఐఇడిలను పరీక్షించారని, ప్రతి దాంట్లో డెటొనేటర్లు, ఇతరాలు ఉన్నాయని, దర్యాప్తు సాగుతోందని, తాము ప్రగతి సాధిస్తున్నామని ఆయన వివరించారు.

ఇప్పటి వరకు ఇతర వివరాలు ఏవీ అందలేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్ చెప్పారు. పేలుళ్ల వెనక ఉగ్రవాద సంస్థలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని ఆయన అన్నారు.

మహారాష్ట్ర ఎటిఎస్, నగర నేరపరిశోధక విభాగం, కేంద్ర సంస్థలు సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాతనే పేలుళ్లకు ఉగ్రవాద సంస్థలు పాల్పడ్డాయా, మరే కారణం వల్లనైనా పేలుళ్లు సంభవించాయా అనే విషయం తేలుతుందని ఆయన అన్నారు. పేలుళ్ల జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.

కాషాయ ఉగ్రవాదం దీని వెనక ఉందని భావిస్తున్నారా అడిగితే అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, ఈ సమయంలో ఏ విధమైన వ్యాఖ్య చేయడం కూడా సరి కాదని ఆయన సమాధానమిచ్చారు. బాల గంధర్వ థియేటర్ వద్ద గాయపడిన వ్యక్తికి చికిత్స జరుగుతోందని ఆయన చెప్పారు.

పేలుళ్లలో గాయపడిన దయానంద్ పాటిల్ సమీపంలోని ఉరులి కాంచన్ గ్రామానికి చెందినవాడు. ఇండియా అగెనెస్ట్ కరప్షన్ థియేటర్‌కు ఎదురుగా నిర్వహించిన ధర్నాకు అతను వచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరిన అతను క్యారీ బ్యాగులో ఉన్న బాంబు పేలడం వల్ల గాయపడినట్లు చెబుతున్నారు.

No comments:

Post a Comment