Read In Tollywood Latest News

Sunday, July 15, 2012

ఐఏఎస్‌లపై మళ్లీ టిజి వెంకటేష్ ఫైర్........


 Tg Venkatesh Lashes At Ias Officers
ఐఏఎస్‌లపై చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ శనివారం మరోసారి చెలరేగి పోయారు. శుక్రవారం కర్నూలు జిల్లాలో చిన్న నీటి పారుదల శాఖ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పని చేయని అధికారులను నడిరోడ్డుపై కాల్చి పారేయాలని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శనివారం కూడా హైదరాబాదులోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న టిజి వారిపై మండిపడ్డారు.

రాజకీయ నేతల మాదిరిగానే రాష్ట్రంలో ఉన్నతాధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీరు అనుసరించే విధానాలతోనే వ్యవస్థ కుప్ప కూలిపోవడంతో పాటు, అభివృద్ధి కుంటుపడుతోందని చెప్పారు. రాజకీయ నేతలను, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాదులోని వైశ్య హాస్టల్ ఆడిటోరియంలో జరిగిన ఆర్య వైశ్య సంఘం పట్టణ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.

కొంతమంది అధికారులు తమ విధులను సరిగా నిర్వర్తించడం లేదని, వ్యాపారస్తులు, ఆర్యవైశ్యులు పనుల మీద కార్యాలయానికి వెళ్తే చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. నాటి గుప్తుల కాలం నుంచి నేటి మన్మోహన్ సింగ్ హయాం వరకు ఆర్య వైశ్యులు అనేక రంగాలలో ప్రాధాన్యత సాధించినప్పటికీ నేడు ఆ వైభవాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సేవా రంగంలో ముందంజలో ఉన్న వైద్యులు రాజకీయ, ఆర్థిక రంగాలలో పూర్తిగా వెనుకబడ్డారన్నారు.

మరోవైపు ఐఏఎస్ అధికారులను నడిరోడ్డుపై కాల్చి పారేయాలన్న మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘం మండిపడింది. మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఐఏఎస్ అధికారుల సంఘం అత్యవసరంగా సమావేశమై టీజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆయన వ్యాఖ్యలను ఖండించాయి.

No comments:

Post a Comment