
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి రెంటికి చెడ్డ రేవడి అయ్యారా అంటే అవుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి సయయంలో వైయస్ వివేకా కడప జిల్లా పార్టీ కార్యకలాపాలు చూసుకునే వారు. వైయస్ మృతి తర్వాత ఆయన తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు.
జగన్ పార్టీ వీడినప్పుడు కానీ పార్టీ పెట్టినప్పుడు కానీ వైయస్ వివేకా దూరంగా ఉన్నారు. అంతేకాదు తన అన్న కాంగ్రెసు కోసం పాటుపడ్డాడని, తాను కూడా ఆయన దారిలోనే నడుస్తానని కాంగ్రెసులోనే కొనసాగారు. ఆ తర్వత వచ్చిన ఉప ఎన్నికలలో వదిన, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత చాలా రోజులు కాంగ్రెసులోనే కొనసాగారు. అయితే గత నెలలో ఆయన కాంగ్రెసును వీడారు.
తన సోదరుడిపై కాంగ్రెసు పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని, జగన్ను ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెసును వీడారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పులివెందులలో ఓటమి తర్వాత కాంగ్రెసు పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించలేదు. ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిశారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. ఆయనను పక్కకు పెట్టారు.
అప్పటి నుండే ఆయన అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఆ తర్వాత సమయం కోసం వేచి చూసిన వివేకా వైయస్ పైన విమర్శలు, జగన్ అరెస్టు బూచీతో కాంగ్రెసును వీడారని చెబుతున్నారు. అయితే జగన్ పార్టీలోకి వెళ్లిన ఆయనకు అక్కడా చుక్కెదురవుతోందని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉప ఎన్నికలకు ముందే ఆయన జగన్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన చేరికను ఘనంగా ఆహ్వానించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. జిల్లా స్థాయి నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నప్పుడు ఘనంగా ఆహ్వానిస్తున్నారని.. కానీ జగన్ బాబాయి అయిన వైయస్ వివేకాకు మాత్రం ఆ స్థాయిలో పార్టీలోకి ఆహ్వానం పలకలేదని చెబుతున్నారు.
ఉప ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు లేవని చెబుతున్నారు. కేవలం అప్పుడప్పుడు జగన్కు అనుకూలంగా, కాంగ్రెసుకు వ్యతిరేంగా మాత్రమే వివేకా విలేకరులతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల జైలులో జగన్ బాబాయిని మందలించలేదనే ప్రచారం కూడా జరిగింది. తనను కలిసేందుకు వచ్చిన వివేకాను చూసి జగన్ మొహం అటు వైపు తిప్పుకున్నారట.
కాసేపు వివేకా అక్కడే నిలబడి చూసినా జగన్ మాట్లాడక పోవడంతో వెనుదిరిగారు. అప్పటి నుండి వివేకా స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా దాదాపు లేవనే చెప్పవచ్చు. అయితే పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు కానీ, పార్టీ పెట్టినప్పుడు కానీ రాకుండా కాంగ్రెసు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు బాబాయి వైయస్ వివేకా బయటకు వచ్చినందు వల్లే జగన్ ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వైయస్ వివేకాకు ప్రాధాన్యత లేదనడంలో వాస్తవం లేదని మరికొందరు చెబుతున్నారు
No comments:
Post a Comment