Read In Tollywood Latest News

Thursday, June 21, 2012

మరోసారి బెయిల్‌కు వైయస్ జగన్ ప్రయత్నాలు....................

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మరోసారి బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన గురువారంనాడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం గతంలో వైయస్ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టులో ఆయన మొదటిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పలు విషయాలను క్రోడకరిస్తూ ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
తాను లోకసభ సభ్యుడ్నని, ఓ పార్టీకి అధ్యక్షుడినని, తనపై అకారణంగా కేసులు పెట్టారని, రాజకీయ కారణాలతోనే సిబిఐ తనను అరెస్టు చేసి తనపై అభియోగాలు మోపిందని ఆయన అన్నారు. ఓ కాంగ్రెసు శాసనసభ్యుడు చేసిన ఫిర్యాదు మేరకు హైకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేపట్టిందని, తొమ్మిది నెలల పాటు దర్యాప్తు సాగించినా తనకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించలేకపోయిందని ఆయన అన్నారు.
చివరకు ఉప ఎన్నికలకు ముందు తనను సిబిఐ అరెస్టు చేసిందని, మూడు రోజుల పాటు సిబిఐ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని, అయితే సరైన సమాధానాలు ఇవ్వలేదనే కారణంతో సిబిఐ తనను అరెస్టు చేసిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకే సిబిఐ తనను అరెస్టు చేసిందని ఆయన ఆరోపించారు. తన కేసులో సిబిఐ మూడు చార్జిషీట్లు దాఖలు చేసిందని, ఎందులో కూడా తనపై అభియోగాలు మోపలేదని ఆయన అన్నారు.
అక్రమాస్తుల కేసులో నిందితులు జగన్, విజయసాయిరెడ్డికి నార్కో టెస్టులు జరపాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ కేసును వచ్చే నెల 4కి వాయిదా వేశారు.
ఓఎంసీ, జగన్, ఎమ్మార్ కేసుల్లో ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. గురువారం ఉదయం చంచల్‌గూడా జైలుకు అధికారులు చేరుకున్నారు. ఈ కేసుల్లో జైలులో ఉన్న జగన్, విజయరాఘవ, శ్రీలక్ష్మి తదితరులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు ఎమ్మార్ కేసులో విజయరాఘవ బెయిల్ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు 28కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను సీబీఐ కోర్టు వచ్చే నెల 6కు పొడిగించింది. నేటితో ముగ్గురి రిమాండ్ ముగియడంతో పోలీసులు వీరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.

No comments:

Post a Comment