Read In Tollywood Latest News

Friday, June 22, 2012

ప్రభుత్వం పడిపోదు . కాంగ్రెస్ బతికి బట్ట కట్టేది లేదు...............

రానున్న సాధారణ ఎన్నికలకు ప్రీ ఫైనల్స్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాయా? కొత్త రాజకీయ సమీకరణలకు అవకాశం ఉందా? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించనున్నట్లు ఉపఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. పిల్లి శాపనార్థాల తరహాలో ఇవి కేవలం సానుభూతి ఓట్లు, ఈ సానుభూతి తాత్కాలికంగానే ఉంటుంది, వచ్చే ఎన్నికల నాటికి ఉండదు అంటూ వివిధ పార్టీల నాయకులు పైకి మాట్లాడుతున్నా లోలోన మాత్రం జగన్ రాజకీయ బలం వారిని కలవరపరుస్తోంది. 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఒక లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీని సాధించింది. అంటే ఉప ఎన్నిక జరిగిన నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఉదయగిరి అసెంబ్లీ స్థానాన్ని మినహాయిస్తే మొత్తం 24 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 21 నియోజకవర్గాల్లో మెజారిటీ అది కూడా భారీగా వచ్చింది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో దాదాపుగా పది శాతం ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు అయింది.
తెలంగాణలోని ఒక నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగిలిన 23 అసెంబ్లీ నియోజక వర్గాలు సీమాంధ్రలోనివే. అంటే సీమాంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, 23 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు చెప్పారు. దాదాపు 15 శాతం ఓటర్లు అంటే ఇది పెద్ద శాంపిలే. అయితే వారంతా జగన్ వర్గీయులు, మళ్లీ వాళ్లే ఎన్నికయ్యారు.  మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా సాధారణ ఎన్నికల్లో సైతం ఈ స్థాయి విజయం ఉంటుందని గట్టిగా చెప్పలేం కానీ రాష్ట్రంలో ప్రబలమైన రాజకీయ శక్తిగా జగన్ ఎదిగాడని మాత్రం ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. చివరకు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను సైతం సవాల్ చేసే స్థితిలో ఆ పార్టీ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలతో  ప్రభుత్వం పడిపోకపోవచ్చు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎన్నికలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వ పరిస్థితి మరోలా ఉండేది, కానీ అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం సైతం డీలా పడిపోయింది. 2009 సాధారణ ఎన్నికలు, వైఎస్‌ఆర్ మరణం తరువాత రాష్ట్రంలో అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండింటి బలం తరుగుతూ వస్తోంది. అధికార పక్షం బలహీనపడితే ఆ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం బలపడాలి కానీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం బలహీనపడుతూ వస్తుంటే కొత్త పక్షం క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ పోతోంది.
1983లో టిడిపి ఒకేసారి తన బలాన్ని ప్రదర్శించి అధికారంలోకి వచ్చింది. కానీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అలా కాకుండా పలు ఉప ఎన్నికల్లో తన బలాన్ని చాటిచెబుతూ అధికారపక్షం, ప్రతిపక్షాన్ని వణికిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి వాతావరణం గతంలో ఎప్పుడూ లేదు. రానున్న సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారాన్ని నిలుపుకుంటామన్న నమ్మకం అధికారపక్షానికి లేదు, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే నమ్మకం అటు ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిలోనూ లేదు. ఈ పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి అవిశ్వాస తీర్మానం వంటి సవాల్ ఎదురుకాక పోవచ్చు. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వారు ఎంతమంది ఉంటారు, వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మేం జగన్ పార్టీలో చేరుతున్నాం, ఇదిగో రాజీనామా అని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వాటిని స్పీకర్ ఆమోదిస్తారా అన్న అనుమానాలు కలగడం సహజం. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటిస్తే గవర్నర్ జోక్యం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ మనుగడ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు మాదిరి 2014 వరకు కొనసాగుతుందా?

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కూడా ప్రభుత్వానికి కత్తిమీద సాములాంటిదే. ప్రతిపక్షం దయాదాక్షిణ్యాలపై ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితి ఉండడం రాష్ట్ర రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి. రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు, సమీకరణలు జరుగుతాయన్నది ఆసక్తిగా మారింది.

No comments:

Post a Comment