Read In Tollywood Latest News

Sunday, June 24, 2012

సియం కుర్చీ మీద కన్ను !


 రాష్టప్రతి ఎన్నికల తరువాత పార్టీ, పభుత్వంలో అధిష్ఠానం మార్పులు చేపట్టనుందా? అటు ఢిల్లీ, ఇటు రాష్టన్రేతల్లోనూ చర్చనీయాంశంగా మారిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించకముందే, కిరణ్ మార్పుతో ఖాళీ అయ్యే గద్దెను అందుకోవడానికి పార్టీలోని పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి వీలుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో హైకమాండ్ తలపెట్టే మార్పులెలా ఉంటాయన్నది కచ్చితంగా తెలియనప్పటికీ, కొంతమంది నేతలు మాత్రం సిఎం పదవి కోసం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. సిఎం గద్దెను ఆశిస్తున్న నేతలంతా తెలంగాణకు చెందిన వారే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి మార్పు అంటూ జరిగితే ఈసారి తప్పని సరిగా తెలంగాణ వారికే దక్కవచ్చన్న అభిప్రాయంతో సీమాంధ్రకు చెందిన నేతలు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న తెలంగాణ ప్రాంత నేతల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీ రాజ్ మంత్రి కె జానారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్, కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి ఉన్నారు. వీరిలో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ముందు వరసలో, తరువాతి స్థానంలో శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ల మధ్యే పోటీ గట్టిగా సాగుతోంది.

ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారైనందున, ఈసారి మార్పు జరిగితే తెలంగాణకే ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌కు అవకాశం కల్పించే సమయంలోనే, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి పేరు సైతం అప్పట్లో ప్రముఖంగానే వినిపించింది. అయితే ముఖ్యమంత్రిగా రావడం తనకు ఇష్టంలేదని అప్పటి పరిస్థితుల్లో సన్నిహితుల వద్ద జైపాల్ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో హైకమాండ్ దృష్టిలో జైపాల్‌రెడ్డి నిజంగా ఉన్నారో లేదో తెలీదుకానీ, ఆయన ఆసక్తి కనబర్చక పోవడంవల్లే కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ పదవి లభించిందని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ప్రచారం చేసింది.
తాజాగా నాయకత్వం మార్పు ఉండొచ్చని గట్టిగా భావిస్తున్న నేతల్లో జైపాల్‌రెడ్డి కూడా ఉన్నారు. కిందటిసారి ఆసక్తి కనబర్చలేదని చెబుతున్న జైపాల్‌రెడ్డి, ఈసారి మాత్రం పెద్దఎత్తునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మద్దతు ఒకరిద్దరిది మినహాయిస్తే జైపాల్‌కే ఉన్నట్టు సమాచారం. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీల మద్దతునూ కూడగట్టే పనిలో జైపాల్ బిజీగా ఉన్నారు. తనకు సన్నిహితంగా ఉండే సీమాంధ్ర ప్రాంత ఎంపీలను పిలిపించుకుని మద్దతు ఇవ్వాలని, ముఖ్యమంత్రి పదవికి తన పేరును అధిష్ఠానం పెద్దలవద్ద చెప్పాలని వారికి జైపాల్‌రెడ్డి చెబుతున్నారు. ఈ విషయాన్ని కొందరు ఎంపీలు ధృవీకరించారు. ‘ముఖ్యమంత్రి పదవికి నా పేరు దాదాపు ఖరారైనట్టే. మీరు కూడా అధిష్ఠానవర్గానికి నా గురించి ఒక మాట చెప్పండి’ అని ఎంపీలతో జైపాల్‌రెడ్డి చెబుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అధిష్ఠానం పెద్దల్ని ఎవరెవరు కలుసుకుంటున్నారన్నది జైపాల్‌రెడ్డి ముందుగానే పసిగట్టి, వారిలో తనకు అనుకూలంగా ఉండే వారిని పిలిపించుకుని అధిష్ఠానం పెద్దల్ని కలిసినపుడు తన గురించి ఒకమాట చెప్పాలని కోరుతున్నట్లు తెలిసింది.
జైపాల్‌రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న నాయకుల్లో పిసిసి మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినపుడే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినట్లు కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. రెండు సార్లు పిసిసి అధ్యక్షునిగా పని చేయడం, ఆ రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల శ్రీనివాస్ పట్ల అధిష్ఠానవర్గానికి కూడా కొంత సానుకూల దృక్పథం ఉంది. అధిష్ఠానంలోని పలువురు పెద్దలతో శ్రీనివాస్‌కు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఎటువంటి వివాదాల్లో తల దూర్చకపోవడం పార్టీ వ్యవహారాలపై ఎన్నడూ బహిరంగ వ్యాఖ్యలు చేయక పోవడం వంటివి శ్రీనివాస్‌కు కలసి వచ్చే అంశాలని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజా నర్సింహ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నప్పటికీ వారు అధిష్ఠానం మీదనే ఆశలు పెట్టుకున్నారు.

No comments:

Post a Comment