Read In Tollywood Latest News

Friday, June 29, 2012

ఎంసెట్ ఫలితాలు విడుదల: టాప్ ర్యాంకర్లు వీరే.........


 Eamcet Results Released
హైదరాబాద్: ఎంసెట్ - 2012 ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఫలితాల సిడిని ఆయన విడుదల చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్, మెడిసిన్ విభాగాల్లో తొలి పది టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను కూడా వెల్లడించారు. ఇంజనీర్ విభాగంలో 73.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించగా, మెడిసిన్ విభాగంలో 88.57 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు.
ఎంసెట్‌కు సంబందించి మార్కులతో పాటు ర్యాంకుల వివరాలను కూడా అందించారు. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశానికి జులైలో కౌన్సెలింగ్ జరుగుతుందని, ఆగస్టులో తరగతులు ప్రారంభమవుతాయని దామోదర రాజనర్సింహ చెప్పారు. మెడిసిన్ విభాగం టాప్ పది ర్యాంకర్లలో బాలురు పది మంది ఉన్నారు. ఇంజనీరింగ్‌లో రంగారెడ్డి జిల్లాకు చెందిన నితీష్ చంద్ర ఫస్ట్ ర్యాంకు సాధించాడు. అతను 149 మార్కులు సాధించాడు. మెడిసిన్ విభాగంలో హైదరాబాదుకు చెందిన రెడ్డి విజయకేతన్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
ఇంజనీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకర్లు, సాధించిన మార్కులు
1. చింతా నితీష్ చంద్ర - 149 (రంగారెడ్డి జిల్లా)
2. ఎవిబి మనోజ్ కుమార్ - 148 (విశాఖపట్నం)
3. నల్లమిల్లి రూపేష్ - 147 (విజయవాడ)
4. ధీరజ్ రెడ్డి - 146 (హైదరాబాద్)
5. సాయికుమార్ రెడ్డి - 146 (విజయవాడ)
6. మంద మకరందు - 146 (విజయవాడ)
7. ప్రభాకర్ వరణ్ - 146 (విజయవాడ)
8. ఆకుల శ్రీనితీష్ - 144 (విజయవాడ)
9. అనీలా యాదవ్ - 144 (నిజామాబాద్)
10. సుష్మ - 143 (విశాఖపట్నం
మెడిసిన్ విభాగంలో టాప్ ర్యాంకర్లు
1. రెడ్డి విజయకేతన్ - 155 మార్కులు (హైదరాబాద్)
2. సుంకర లోకేంద్ర పవన్ కుమార్ - 154 (విజయవాడ)
3. డివిఆర్ సాయి - 153 (ప్రకాశం జిల్లా)
4. కె. నరేష్ బాబు - 152 (వరంగల్)
5. దాసరి ఉత్తేజ్ - 152 (విజయవాడ)
6. బొబ్బిలి సవ్యసాచి - 152 (విజయవాడ)
7. భరద్వాజ - 152 (నెల్లూరు)
9. కె అక్షయ్ - 152 (హైదరాబాద్)
10. గడ్డం వినూత్న - 152 (రంగారెడ్డి జిల్లా)

మోసానికే రాయల తెలంగాణ ప్రతిపాదన: మోత్కుపల్లి..........


 Mothkupalli Opposes Rayala Telangana


హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెసు నిర్ణయించుకుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని ఆయన అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిని దించేసి తెలంగాణ నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే ఒరిగేదేమీ ఉండదని ఆయన అన్నారు. కాంగ్రెసు మోసాన్ని సహించే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాన్చుడు ధోరణి సరైంది కాదని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన అంశాన్ని ప్రభుత్వం వెంటనే తేల్చాలని బిజెపి శానససభ్యుడు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణకు చెందిన పది జిల్లాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. తమ పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ ఇంకా కేంద్రం తెలంగాణపై నాన్చడం, దాటవేసే ధోరణిని అవలంబించడం సరి కాదని ఆయన అన్నారు.
రెండు నెలల్లో తెలంగాణ ఏర్పాటు తథ్యమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం నల్లగొండలో అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మంత్రి కె. జానా రెడ్డి కీలక నేతగా వ్యవహరిస్తారని ఆయన అన్నారు.

Thursday, June 28, 2012

జగన్‌ను జైల్లో కలిసిన రాం జెత్మలానీ.........


 Ram Jethmalani Meets Ys Jagan

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ప్రముఖ న్యాయవాది రాం జెత్మలానీ గురువారం ఉదయం హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో కలిశారు. ఆయన వెంట జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. రాం జెత్మలానీ వైయస్ జగన్ తరఫున కోర్టులో వాదిస్తున్న విషయం తెలిసిందే. జగన్‌తో కేసు విషయాలు మాట్లాడినట్లు రాంజెత్మలానీ భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
శిక్షపడిన ఖైదీకి కూడా రాజ్యాంగబద్దమైన హక్కులుంటాయని ఆయన అన్నారు. రిమాండ్‌లో వైయస్ జగన్ హక్కులను ప్రభుత్వం హరించిందని ఆయన విమర్శించారు. వైయస్ జగన్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేశారని ఆయన అన్నారు. ఈ విషయాన్ని మీడియా, ప్రభుత్వం, అన్ని వర్గాలూ గమనించాలని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, వైయస్ జగన్‌ను విచారించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైదరాబాదులోని నాంపల్లి కోర్టు జులై 2వ తేదీకి వాయిదా వేసింది. ఎమ్మార్, గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ ఆస్తుల కేసుల్లో జైలులో ఉన్న నిందితులను ఈడి ఇప్పటికే విచారిస్తోంది.
కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేసింది. నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై వచ్చే నెల 4వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిబిఐని ఆదేశించింది.

Wednesday, June 27, 2012

జై చిరంజీవ అని అడ్డంగా బుక్కుయిన MLA జోగి రమేష్.........

క్యాస్ట్ రాజకీయాలకు పోతే తగిన కాస్ట్ చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే జోగి రమేష్ ఎపిసోడ్ మరోమారు రుజువుచేసింది. ఓ సామాజిక వర్గం తనకు ‘కాపు’ కాసేలా చేసుకునేందుకు అమితోత్సాహంతో ఆయన చేసిన ప్రసంగం బూమ్‌‘రాంగ్’ అయింది. రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. బహుశా అదే ఆయన రాజకీయ భవిష్యత్తుకు రాంగ్‌రూటుగా మారే ప్రమాదం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

 ఏ రోటికాడ ఆ పాట పాడాలనే సామెత రాజకీయాలలో అంత నప్పదేమో! పార్టీ విధానాలు, నాయకత్వంపై నమ్మకం, కార్యాచరణపై నిబద్ధతకు బదులు ఏ కులం వారి వద్ద ఆ పాట పడుతూ సామాజిక సమీకరణలతో నెట్టుకురావాలనే రాజకీయ నేతలకు శృంగభంగం కలగకతప్పదని చరిత్రలో అనేకమార్లు రుజువైంది. ఇప్పుడు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌కు ఆ విషమ పరిస్థితే ఎదురైంది. తన నియోజకవర్గంలోని గూడూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన తర్వాత పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఓ సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసి తనకు అండగా నిలుపుకునేందుకు ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారు.

పరిధి, పరిమితి మరచి వ్యాఖ్యలు చేశారు. సమావేశాన్ని కవర్‌చేయడానికి మీడియా వచ్చిందన్న విషయం కూడా మరచి ఆయన విజృంభించారు. అదే ఆయనను చిక్కుల్లో పడేసింది. ‘చిరంజీవే.. 2014లో మన నాయకుడు, ఆయనే మన ముఖ్యమంత్రి అవుతాడు’ అంటూ మాట్లాడడం ద్వారా అక్కడ ఉన్నవారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పాపం ఆయన వ్యూహం అక్కడ ఎలా పారిందో తెలియదుకానీ.. రాష్ట్ర నాయకత్వం వద్ద బూమ్‌రాంగ్ అయింది. ఆయన వ్యాఖ్యలపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. 2009 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం సీటు ఆశించి భంగపడిన జోగి రమేష్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పెడన సీటు ఇప్పించి గెలిపించారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత జోగి రమేష్ ఆయన వెంట నడుస్తారని అంతా భావించారు. నియోజకవర్గంలోని కార్యకర్తలూ ఆ మేరకు ఒత్తిడి తెచ్చారు. అయితే జోగి దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటూ తనకు కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో చిరంజీవి పక్కన జోగి రమేష్ తిరిగారు. చిరంజీవి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న రామచంద్రపురం, నర్సాపురంలో కాంగ్రెస్ విజయం సాధించడంతో తన నియోజకవర్గంలోనూ ఆ సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఆ వ్యాఖ్యలు చేసినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి ఒక సామాజికవర్గం, వైఎస్‌ఆర్ పార్టీకి మరో సామాజికవర్గం మద్దతు పలుకుతున్నాయని, చిరంజీవిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మీరంతా కాంగ్రెస్‌కు అండగా ఉంటేనే సాధ్యమవుతుందని ఆయన ఊదరగొట్టారు. ఇదంతా తన నియోజకవర్గంలోని చిరంజీవి సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునేందుకే ఇలా చేశాడని, అదే కాంగ్రెస్‌లోని మిగిలిన వర్గాలు ఆయనపై ఆగ్ర హం కలగడానికి కారణమైందని సమాచారం.

జోగి రమేష్ అడిగిన పనులన్నీ చేసిపెడుతున్న తనను కాకుండా చిరంజీవికి మద్దతు పలకడంపై ముఖ్యమంత్రి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. దీంతో కంగుతిన్న జోగి రమేష్ నష్ట నివారణ ప్రయత్నాలు ప్రారంభించారు. తాను ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదని, తప్పనిసరి సందర్భలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఆయన ఫోన్ స్వీచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లా

గవర్నర్ అభిప్రాయమే కీలకం..!!....

రాష్టప్రతి ఎన్నికల తర్వాత హైకమాండ్ తలపెట్టిన మార్పుల్లో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన నివేదిక కీలకం కానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని మంగళవారం మర్యాద పూర్వకంగానే కలిసినట్టు గవర్నర్ నరసింహన్ చెబుతున్నా, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై హైకమాండ్‌కు గవర్నర్ సమగ్ర నివేదిక అందజేసినట్టు తెలుస్తోంది. ‘అధిష్ఠాన వర్గాన్ని కలిసిన సందర్భంగా గవర్నర్ నివేదికను ఇచ్చి ఉంటారనే విశ్వసిస్తున్నా. ఒకవేళ గవర్నర్ చెప్పినట్టు ఎటువంటి నివేదిక ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సోనియాకు ఆయన అభిప్రాయాన్ని కచ్చితంగా వివరించి ఉంటారు. హైకమాండ్ తలపెట్టిన మార్పుల్లో గవర్నర్ అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరెన్ని నివేదికలు ఇచ్చినా వాటిని అధిష్ఠానం పెద్దగా పట్టించుకోదు’ అని రాష్ట్ర మంత్రి ఒకరు   చెప్పారు. గవర్నర్ వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అధిష్ఠానం మార్పులు తలపెట్టవచ్చు అని ఆయన అన్నారు.
గవర్నర్ బిజీబిజీ
ఇదిలావుంటే, రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం బిజీబిజీగా గడిపారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, హోమ్‌మంత్రి చిదంబరం రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. దీంతో గవర్నర్ జరిపిన సమావేశాల పర్యవసానంపై పలు ఊహాగానాలు తలెత్తాయి. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మొదటిసారి ఢిల్లీకి వచ్చిన గవర్నర్ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక అందచేశారన్న ప్రచారం జరుగుతోంది. గవర్నర్ నరసింహన్ నెలలో ఒకటి రెండుసార్లు ఢిల్లీకి వచ్చి ప్రభుత్వంలో కీలక నిర్ణయ పాత్రధారులను కలవటం పరిపాటి. అయితే తాను ఎవరికీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదనీ, మర్యాద పూర్వకంగానే అందరినీ కలిసినట్టు నరసింహన్ చెప్పుకొచ్చారు.
అయితే, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి, మంత్రుల పని తీరు గురించి హైకమాండ్‌కు గవర్నర్ వివరించినట్టు తెలిసింది. ప్రభుత్వ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఉప ఎన్నికల ఫలితాలపై కిరణ్, బొత్స, మరికొందరు ప్రముఖులు ఇప్పటికే హైకమాండ్‌కు నివేదికలు అందించారు. అయితే వారిచ్చిన నివేదికల కంటే గవర్నర్ నివేదికకే అధిష్ఠానం ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిసింది.
కాగా, రాష్టప్రతి ఎన్నికల తర్వాత మార్పులు ఖాయమని అనుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. అధిష్ఠానాన్ని కలిసి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, రెవిన్యూ మంత్రి రఘువీరారెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. వారు కూడా అధిష్ఠానాన్ని కలుసుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో మూడు రోజులపాటు మకాం వేసి సోనియాను, ఇతర కాంగ్రెస్ పెద్దల్ని కలిసిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ నగరానికి తిరిగి వచ్చారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నాయకులు, తమ పదవుల్ని కాపాడుకునేందుకు మంత్రులు, మార్పులు తలపెడితే మంత్రి పదవుల కోసం కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని కలుసుకుంటున్నారు. రాష్టప్రతి అభ్యర్థిగా యూపీఏ తరఫున ఎంపికైన ప్రణబ్‌ముఖర్జీకి అభినందనలు తెలిపే సాకుతో ఢిల్లీ వెళుతున్న నేతల ప్రధాన అజెండా మాత్రం అధిష్ఠానాన్ని కలవడమేనని తెలిసింది.

Sunday, June 24, 2012

సియం కుర్చీ మీద కన్ను !


 రాష్టప్రతి ఎన్నికల తరువాత పార్టీ, పభుత్వంలో అధిష్ఠానం మార్పులు చేపట్టనుందా? అటు ఢిల్లీ, ఇటు రాష్టన్రేతల్లోనూ చర్చనీయాంశంగా మారిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం లభించకముందే, కిరణ్ మార్పుతో ఖాళీ అయ్యే గద్దెను అందుకోవడానికి పార్టీలోని పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయానికి వీలుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో హైకమాండ్ తలపెట్టే మార్పులెలా ఉంటాయన్నది కచ్చితంగా తెలియనప్పటికీ, కొంతమంది నేతలు మాత్రం సిఎం పదవి కోసం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నారు. సిఎం గద్దెను ఆశిస్తున్న నేతలంతా తెలంగాణకు చెందిన వారే కావడం గమనార్హం. ముఖ్యమంత్రి మార్పు అంటూ జరిగితే ఈసారి తప్పని సరిగా తెలంగాణ వారికే దక్కవచ్చన్న అభిప్రాయంతో సీమాంధ్రకు చెందిన నేతలు పెద్దగా ప్రయత్నాలు చేయడం లేదు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న తెలంగాణ ప్రాంత నేతల్లో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీ రాజ్ మంత్రి కె జానారెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి శ్రీనివాస్, కేంద్రమంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి ఉన్నారు. వీరిలో కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ముందు వరసలో, తరువాతి స్థానంలో శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతం జైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ల మధ్యే పోటీ గట్టిగా సాగుతోంది.

ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారైనందున, ఈసారి మార్పు జరిగితే తెలంగాణకే ముఖ్యమంత్రి పదవి దక్కవచ్చని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌కు అవకాశం కల్పించే సమయంలోనే, కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి పేరు సైతం అప్పట్లో ప్రముఖంగానే వినిపించింది. అయితే ముఖ్యమంత్రిగా రావడం తనకు ఇష్టంలేదని అప్పటి పరిస్థితుల్లో సన్నిహితుల వద్ద జైపాల్ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. అప్పట్లో హైకమాండ్ దృష్టిలో జైపాల్‌రెడ్డి నిజంగా ఉన్నారో లేదో తెలీదుకానీ, ఆయన ఆసక్తి కనబర్చక పోవడంవల్లే కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ పదవి లభించిందని కాంగ్రెస్‌లోని ఒక వర్గం ప్రచారం చేసింది.
తాజాగా నాయకత్వం మార్పు ఉండొచ్చని గట్టిగా భావిస్తున్న నేతల్లో జైపాల్‌రెడ్డి కూడా ఉన్నారు. కిందటిసారి ఆసక్తి కనబర్చలేదని చెబుతున్న జైపాల్‌రెడ్డి, ఈసారి మాత్రం పెద్దఎత్తునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మద్దతు ఒకరిద్దరిది మినహాయిస్తే జైపాల్‌కే ఉన్నట్టు సమాచారం. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీల మద్దతునూ కూడగట్టే పనిలో జైపాల్ బిజీగా ఉన్నారు. తనకు సన్నిహితంగా ఉండే సీమాంధ్ర ప్రాంత ఎంపీలను పిలిపించుకుని మద్దతు ఇవ్వాలని, ముఖ్యమంత్రి పదవికి తన పేరును అధిష్ఠానం పెద్దలవద్ద చెప్పాలని వారికి జైపాల్‌రెడ్డి చెబుతున్నారు. ఈ విషయాన్ని కొందరు ఎంపీలు ధృవీకరించారు. ‘ముఖ్యమంత్రి పదవికి నా పేరు దాదాపు ఖరారైనట్టే. మీరు కూడా అధిష్ఠానవర్గానికి నా గురించి ఒక మాట చెప్పండి’ అని ఎంపీలతో జైపాల్‌రెడ్డి చెబుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అధిష్ఠానం పెద్దల్ని ఎవరెవరు కలుసుకుంటున్నారన్నది జైపాల్‌రెడ్డి ముందుగానే పసిగట్టి, వారిలో తనకు అనుకూలంగా ఉండే వారిని పిలిపించుకుని అధిష్ఠానం పెద్దల్ని కలిసినపుడు తన గురించి ఒకమాట చెప్పాలని కోరుతున్నట్లు తెలిసింది.
జైపాల్‌రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న నాయకుల్లో పిసిసి మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినపుడే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినట్లు కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. రెండు సార్లు పిసిసి అధ్యక్షునిగా పని చేయడం, ఆ రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల శ్రీనివాస్ పట్ల అధిష్ఠానవర్గానికి కూడా కొంత సానుకూల దృక్పథం ఉంది. అధిష్ఠానంలోని పలువురు పెద్దలతో శ్రీనివాస్‌కు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఎటువంటి వివాదాల్లో తల దూర్చకపోవడం పార్టీ వ్యవహారాలపై ఎన్నడూ బహిరంగ వ్యాఖ్యలు చేయక పోవడం వంటివి శ్రీనివాస్‌కు కలసి వచ్చే అంశాలని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజా నర్సింహ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నప్పటికీ వారు అధిష్ఠానం మీదనే ఆశలు పెట్టుకున్నారు.

అబ్బాయి పలకలేదు..: వైయస్ వివేకా రెంటికి చెడ్డారా?


 Is Jagan Not Giving Importance Ys Viveka

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి రెంటికి చెడ్డ రేవడి అయ్యారా అంటే అవుననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి సయయంలో వైయస్ వివేకా కడప జిల్లా పార్టీ కార్యకలాపాలు చూసుకునే వారు. వైయస్ మృతి తర్వాత ఆయన తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు.
జగన్ పార్టీ వీడినప్పుడు కానీ పార్టీ పెట్టినప్పుడు కానీ వైయస్ వివేకా దూరంగా ఉన్నారు. అంతేకాదు తన అన్న కాంగ్రెసు కోసం పాటుపడ్డాడని, తాను కూడా ఆయన దారిలోనే నడుస్తానని కాంగ్రెసులోనే కొనసాగారు. ఆ తర్వత వచ్చిన ఉప ఎన్నికలలో వదిన, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మపై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత చాలా రోజులు కాంగ్రెసులోనే కొనసాగారు. అయితే గత నెలలో ఆయన కాంగ్రెసును వీడారు.
తన సోదరుడిపై కాంగ్రెసు పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారని, జగన్‌ను ఉద్దేశ్య పూర్వకంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెసును వీడారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పులివెందులలో ఓటమి తర్వాత కాంగ్రెసు పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించలేదు. ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిశారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. ఆయనను పక్కకు పెట్టారు.
అప్పటి నుండే ఆయన అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఆ తర్వాత సమయం కోసం వేచి చూసిన వివేకా వైయస్ పైన విమర్శలు, జగన్ అరెస్టు బూచీతో కాంగ్రెసును వీడారని చెబుతున్నారు. అయితే జగన్ పార్టీలోకి వెళ్లిన ఆయనకు అక్కడా చుక్కెదురవుతోందని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఉప ఎన్నికలకు ముందే ఆయన జగన్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కానీ ఆయన చేరికను ఘనంగా ఆహ్వానించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. జిల్లా స్థాయి నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నప్పుడు ఘనంగా ఆహ్వానిస్తున్నారని.. కానీ జగన్ బాబాయి అయిన వైయస్ వివేకాకు మాత్రం ఆ స్థాయిలో పార్టీలోకి ఆహ్వానం పలకలేదని చెబుతున్నారు.
ఉప ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు లేవని చెబుతున్నారు. కేవలం అప్పుడప్పుడు జగన్‌కు అనుకూలంగా, కాంగ్రెసుకు వ్యతిరేంగా మాత్రమే వివేకా విలేకరులతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల జైలులో జగన్ బాబాయిని మందలించలేదనే ప్రచారం కూడా జరిగింది. తనను కలిసేందుకు వచ్చిన వివేకాను చూసి జగన్ మొహం అటు వైపు తిప్పుకున్నారట.
కాసేపు వివేకా అక్కడే నిలబడి చూసినా జగన్ మాట్లాడక పోవడంతో వెనుదిరిగారు. అప్పటి నుండి వివేకా స్టేట్‌మెంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా దాదాపు లేవనే చెప్పవచ్చు. అయితే పార్టీ నుండి బయటకు వచ్చినప్పుడు కానీ, పార్టీ పెట్టినప్పుడు కానీ రాకుండా కాంగ్రెసు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు బాబాయి వైయస్ వివేకా బయటకు వచ్చినందు వల్లే జగన్ ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వైయస్ వివేకాకు ప్రాధాన్యత లేదనడంలో వాస్తవం లేదని మరికొందరు చెబుతున్నారు

నారా లోకేష్: జూ.ఎన్టీఆర్‌కు బదులు, జగన్‌కు కౌంటర్?

తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్‌ను రాజకీయాల్లోకి రమ్మనడం వెనుక వారికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై విశ్వాసం సడలడమా మరేదైనా కారణం ఉందా అనే చర్చ రాజకీయా వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల పలువురు దేశం నేతలు నారా లోకేష్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. బాబుపై విశ్వాసం సడలడంతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవాలంటే పార్టీకి ఓ యువనేత కావాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవలి కాలంలో రాజకీయాల్లో యువత ప్రధాన పాత్ర పోషిస్తోంది. రాజకీయాలతో సంబంధం లేని యంగ్ తరంగ్ కూడా వీటి పైన ప్రధానంగా దృష్టి సారిస్తోంది. వీరంతా పాత తరం రాజకీయ నాయకుల కంటే కొత్త తరంపై ఆసక్తి కనబరుస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఇటీవలి కాలంలో యువత మొగ్గు చూపడమే అందుకు మంచి నిదర్శనం అని చెబుతున్నారు. యువత.. రాజకీయాలు ఎప్పుడో అవినీతిమయమై పోయాయని భావిస్తుందని, అందుకే ఆ అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారని అంటున్నారు.
జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ప్రచారం చేసినప్పటికీ ఆ అంశం ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో ఏమాత్రం ప్రభావం చూపలేదని చెబుతున్నారు. మధ్యవయస్కులు, వృద్ధులు సానుభూతితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే.. యువత మాత్రం యువనేత అనే భావనతో జగన్ వైపుకు మొగ్గారని చెబుతున్నారు. అనుభవజ్ఞులు అయినా, పరిపాలన బాగున్నా.. ఓ తరం అయిపోయిన నేతలను యువత పట్టించుకోవడం లేదని అంటున్నారు. యువ నాయకుల వైపే వారు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అందుకే యువకుడైన నారా లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకు వస్తే పార్టీకి చాలా ప్లస్ అవుతుందని భావిస్తుండవచ్చునని అంటున్నారు. మరోవైపు టిడిపిలో చంద్రబాబు మినహా ప్రత్యామ్నాయ నేత లేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. బాలయ్య వంటి వారు ఉన్నప్పటికీ సినిమాలలో బిజీగా ఉన్నందున పార్టీలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం లేదని అంటున్నారు. బాబు తర్వాత ఓ ప్రత్యామ్నాయం కావాలని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పటికీ ఆయన మద్దతు నిలకడగా లేదని చెబుతున్నారు. నందమూరి - నారా కుటుంబాల మధ్య ఉన్న విభేదాల కారణంగా కూడా జూనియర్ పేరును తెర పైకి తీసుకు వచ్చేందుకు తమ్ముళ్లు ధైర్యం చేయడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో తరుచూ లోకేష్ పేరు ప్రస్తావనకొస్తుందని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు తదితర పరిణామాల నేపథ్యంలో లోకేష్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తేనే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారని అంటున్నారు.

Friday, June 22, 2012

టీడీపీ అధ్యక్షుడిగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను చేస్తే?

పిల్లికి చెలగాటం ఎలుక్కి ప్రాణ సంకటం.. ఈ సూత్రాన్ని మన రాష్ట్ర మీడియా వర్శెస్ రాజకీయాలకు అనుగుణంగా రాస్తే, ‘‘రాధాకృష్ణ, రామోజీలకు చెలగాటం.. జగన్ కి ప్రాణ సంకటం..’’ అని చెప్పొచ్చు. జగన్ రాజకీయంగా ఎదిగేందుకు తీవ్రమైన కృషి చేస్తుంటే దాన్ని ఉన్నది వున్నట్టు చెప్పి తమ పని అక్కడితో ముగిసి పోయిందన్నట్టు వుండాలి రాధాకృష్ణ లాంటి మీడియా అధినేతలు. దారుణమైన విషయం ఏమిటంటే, ఆయన దాదాపు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమానంగా తన సత్తా చాటుతున్నాడు. జగన్ని దెబ్బ తీయడం చంద్రబాబు కన్నా అంత అవసరం వుందో లేదో తెలియదుకానీ, రాధాకృష్ణకు ఎక్కడా లేని అవసరం ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో రాజశేఖరరెడ్డి వర్శెస్ రాధాకృష్ణ అనే ఎపిసోడ్లో ఇద్దరి మధ్య డిష్యూం డిష్యూం నడిచింది. కాదనలేం. కక్షసాధింపులు నడిచాయి. ఓకే. దాన్ని కంటిన్యూ చేయడంలో భాగంగా జగన్ని టార్గెట్ చేశాడు రాధాకృష్ణ. జగన్ ఎదుగుదల అడ్డుకోవడమే ధ్యేయంగా జీవిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ‘‘జర్నలిజం మాని జగనలిజం’’ చేస్తున్నాడని రాధాకృష్ణ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. జగన్ వర్శెస్ జేడీ ఇష్యూనే తీసుకుందాం. నిజానికిది జగన్ పార్టీకీ జేడీ లక్ష్మీనారాయణకూ మధ్య.. అన్నట్టుగా సాగాల్సింది. ఎందుకో గాడి తప్పి.. సాక్షి వర్శెస్ క్రైమ్ జర్నలిస్టులుగా రూపాంతరం చెందింది. జగన్ పార్టీకి జేడీని రాజకీయంగా ఎదుర్కోవడం అనివార్యం. జేడీ లక్ష్మీ నారాయణను బద్నాం చెయ్యాల్సిన అవసరం రాజకీయంగా జగన్ పార్టీకి వుంది. అందులో భాగంగానే వారు జేడీ మీడియా ప్రతినిధులు ప్లస్ చంద్రబాలలతో జరిపిన మంతనాల సమాహారం.. ‘మహాకుట్ర’ అనే అంకానికి తెరతీసారు. ఇందులో ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం.. జేడీని ఇరుకున పడేయడం చెయ్యడం. అటు మీడియా ప్రతినిధులైనా ఇటు చంద్రబాలనైనా జగన్ వర్గీయులు ఇరికించింది అందుకే. కానీ అది దారి తప్పింది. రాజకీయంగా మీరు మీరు కొట్టుకోవాల్సింది పోయి అభాగ్యులైన జర్నలిస్టులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది క్రేమ్ రిపోర్టర్ల సంఘం. వీరి వాదనలో ఎలాంటి తప్పు లేదు. నిన్న మొన్న సాక్షి అకౌంట్స్ ఫ్రీజ్ చేసినప్పుడు ఇంతెత్తున ఉద్యమాలు జరిపిన జర్నలిస్టు సంఘాలు ఇప్పుడెందుకో నోరు మెదపలేదు? నిజంగా ఇక్కడ జర్నలిస్టులకు అన్యాయం జరిగింది. వారి ఫోన్ నెంబర్లు, పేర్లను అలా పర్టికులర్ గా బయట పెట్టడం తప్పు. ఎందుకంటే, అది వారి భద్రతకు ముప్పు. విధం తప్పిన ఒకానొక జగన్ అభిమాని జర్నలిస్టుల వివరాలు తెలుసుకుని అకారణంగా వారి మీద కక్ష సాధింపుకు దిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది న్యాయమైన విషయమే. వారి వృత్తిలో భాగంగా అనేకులతో మాట్లాడుతుంటారు. సమాచార సేకరణలో దొంగా, పోలీసు ఇద్దరూ వారికి సమానమే. కానీ, వారిని టార్గెట్ గా చేసుకుని సాక్షి చేసిన ప్రయత్నాన్ని అందరూ ఖండించాల్సిందే. ఇక్కడి వరకూ ఈ ఎపిసోడ్ సాఫీగా సాగింది. ఈ ఇష్యూ మధ్యలోకి రాధాకృష్ణ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. చంద్రబాలను తన పక్కన కూర్చో బెట్టుకుని మహాకుట్ర భగ్నానికి పాల్పడ్డాడు. దారుణమైన విషయం ఏమిటంటే ఈ ఎపిసోడ్లో ఫస్ట్ చంద్రబాల నిర్ధోషిగా కనిపించలేదు. సెకెండ్ థింగ్ ఏమిటంటే, ఏబీఎన్ స్టూడియోలో చంద్రబాల కూర్చుని చర్చ సాగిస్తున్నప్పుడు అటు ఆమెకు గానీ ఇటు రాధాకృష్ణకు గానీ కసి వున్నట్టు కనిపించలేదు. వారిలో తమకు అన్యాయం జరిగిందే అన్న ఫైర్ లేనే లేదు. కానీ దాదాపు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమానంగా జగన్ మీద రాజకీయ కక్ష సాధించడం మాత్రం బాగా వచ్చిన వాడిలా ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తోంది. ఆయన పోకడ చూస్తుంటే..చంద్రబాబును తీసి రాధాకృష్ణను టీడీపీ అధ్యక్షుడిగా చేస్తే బావుండు అనుకోవాల్సి వస్తోంది....................

రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్ జగన్ ఓటు చేస్తారా?


 Will Ys Jagan Cast His Vote President Election

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ అనివార్యం కావడంతో వోటింగ్ అవసరం ఏర్పడుతోంది. యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి పోటీగా పిఎ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. సంగ్మాకు బిజెపి మద్దతిస్తోంది. ఈ స్థితిలో జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓటు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు సభ్యుడిగా ఆయనకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది.
జగన్ అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్నారు. ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చేయాలని ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి జగన్‌కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు ఆయన ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి జగన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన రాష్ట్ర శానససభ ఆవరణలో ఓటు వేయడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. రాజ్యాంగబద్దంగా లోకసభకు ఎన్నికైన నాయకుడు కాబట్టి వైయస్ జగన్‌కు ఓటు వేసే హక్కు ఉంటుందని అంటున్నారు.
వైయస్ జగన్ బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు పోలింగ్ జరిగే లోగా బెయిల్ వస్తే ఫరవా లేదు. బెయిల్ రాకపోతే ఆయన చంచల్‌గుడా జైలు నుంచి శానససభకు వెళ్లి ఓటు వేసి తిరిగి చంచల్‌గుడా జైలుకు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. జైలు అధికారులు ఆయనను ఆసెంబ్లీకి తీసుకుని వెళ్లి మళ్లీ జైలుకు తీసుకుని రావాల్సి ఉంటుందని అంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో వైయస్ జగన్ ఎవరికి మద్దతిస్తారనే విషయాన్ని ఇంకా తేల్చలేదు. బిజెపి బలపరుస్తున్నందున సంగ్మాకు ఓటు చేయడం ఆయనకు కష్టంగానే ఉంటుంది. అదే సమయంలో ప్రణబ్ ముఖర్జీని బలపరిస్తే కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలకు బలం చేకూరుతుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రణబ్ ముఖర్జీకి మద్దతు కోరడానికే ఇటీవల మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ జగన్‌ను జైలులో కలుసుకున్నట్లు చెబుతున్నారు. తాత్కాలిక అవగాహనలో భాగంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

చిరంజీవి వ్యాఖ్యలు: కిరణ్ రెడ్డి మీదనా, బొత్సపైనా?


 Chiranjeevi Comments On Kiran Or Botsa

హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాల్లో మూడు ముక్కలాట రసకందాయంలో పడినట్లు కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు నియోజకకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి రెచ్చిపోవడానికి సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. ఆయన శుక్రవారం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీలో తీవ్ర చర్చను లేవనెత్తుతున్నాయి.
రామచంద్రాపురం, నర్సాపురం సీట్లలో ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చినవారే కాంగ్రెసు తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అది చిరంజీవికి కలిసి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయన పార్టీలో ఆధిపత్యంలోకి రావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాదని కాంగ్రెసు పెద్దలు డిసైడ్ అయిపోయారని, అందుకే కష్టపడి పనిచేయడం లేదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెసు అధిష్టానాన్ని ఉద్దేశించి మాత్రం ఆయన అనలేదనేది స్పష్టం. మరి, ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనేది ఇప్పుడు ప్రశ్న.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారా, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఉద్దేశించి మాట్లాడారా అనేది తెలియడం లేదు. ఇద్దరిని ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చునని కూడా అంటున్నారు. పార్టీలో సమన్వయ లోపం ఉందని కూడా ఆయన అన్నారు. సమన్వయం చేయాల్సింది కిరణ్, బొత్సలే కాబట్టి వారిద్దరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కానీ, ఆయన నిర్దిష్టంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.
ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కీలక భూమిక పోషించారు. రాజంపేట వంటి నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై, తిరుపతి వంటి స్థానాల్లో స్థానిక నాయకులు సహకరించకపోవడంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మంత్రి గల్లా అరుణ కుమారి సహకరించకపోవడాన్ని ప్రధానంగా చెబుతున్నారు. ఇదంతా ముఖ్యమంత్రికి అంటగట్టే చిరంజీవి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
తనకు బాధ్యత అప్పగిస్తే పార్టీని 2014లో పార్టీని విజయపథంలో నడిపిస్తాననే సంకేతాలను కూడా ఆయన ఇచ్చారు. తనకు అప్పగిస్తే చేసి చూపిస్తానని ఆయన అన్నారు. దీన్నిబట్టి ఆయన రాష్ట్ర కాంగ్రెసు నాయకత్వాన్ని బేషరతుగా ఆశిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పార్టీ పెద్దలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్న సమయంలో చిరంజీవి రామచంద్రాపురం కార్యకకర్తలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెసు సంప్రదాయ ఓటర్లంతా జారిపోయారని, ప్రజారాజ్యం కార్యకర్తలు, తన అభిమానులు మాత్రమే పార్టీ వెంట ఉన్నారనే విషయాన్ని కూడా ఆయన కొంత స్పష్టంగానే చెప్పారు. ఏమైనా, కాంగ్రెసు వర్గపోరు రంజుగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వం పడిపోదు . కాంగ్రెస్ బతికి బట్ట కట్టేది లేదు...............

రానున్న సాధారణ ఎన్నికలకు ప్రీ ఫైనల్స్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాయా? కొత్త రాజకీయ సమీకరణలకు అవకాశం ఉందా? వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించనున్నట్లు ఉపఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. పిల్లి శాపనార్థాల తరహాలో ఇవి కేవలం సానుభూతి ఓట్లు, ఈ సానుభూతి తాత్కాలికంగానే ఉంటుంది, వచ్చే ఎన్నికల నాటికి ఉండదు అంటూ వివిధ పార్టీల నాయకులు పైకి మాట్లాడుతున్నా లోలోన మాత్రం జగన్ రాజకీయ బలం వారిని కలవరపరుస్తోంది. 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగితే, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, ఒక లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీని సాధించింది. అంటే ఉప ఎన్నిక జరిగిన నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఉదయగిరి అసెంబ్లీ స్థానాన్ని మినహాయిస్తే మొత్తం 24 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 21 నియోజకవర్గాల్లో మెజారిటీ అది కూడా భారీగా వచ్చింది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రంలో దాదాపుగా పది శాతం ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించినట్టు అయింది.
తెలంగాణలోని ఒక నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగిలిన 23 అసెంబ్లీ నియోజక వర్గాలు సీమాంధ్రలోనివే. అంటే సీమాంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, 23 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పు చెప్పారు. దాదాపు 15 శాతం ఓటర్లు అంటే ఇది పెద్ద శాంపిలే. అయితే వారంతా జగన్ వర్గీయులు, మళ్లీ వాళ్లే ఎన్నికయ్యారు.  మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా సాధారణ ఎన్నికల్లో సైతం ఈ స్థాయి విజయం ఉంటుందని గట్టిగా చెప్పలేం కానీ రాష్ట్రంలో ప్రబలమైన రాజకీయ శక్తిగా జగన్ ఎదిగాడని మాత్రం ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. చివరకు తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను సైతం సవాల్ చేసే స్థితిలో ఆ పార్టీ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలతో  ప్రభుత్వం పడిపోకపోవచ్చు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎన్నికలకు సిద్ధంగా ఉంటే ప్రభుత్వ పరిస్థితి మరోలా ఉండేది, కానీ అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం సైతం డీలా పడిపోయింది. 2009 సాధారణ ఎన్నికలు, వైఎస్‌ఆర్ మరణం తరువాత రాష్ట్రంలో అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండింటి బలం తరుగుతూ వస్తోంది. అధికార పక్షం బలహీనపడితే ఆ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షం బలపడాలి కానీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం బలహీనపడుతూ వస్తుంటే కొత్త పక్షం క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ పోతోంది.
1983లో టిడిపి ఒకేసారి తన బలాన్ని ప్రదర్శించి అధికారంలోకి వచ్చింది. కానీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అలా కాకుండా పలు ఉప ఎన్నికల్లో తన బలాన్ని చాటిచెబుతూ అధికారపక్షం, ప్రతిపక్షాన్ని వణికిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి వాతావరణం గతంలో ఎప్పుడూ లేదు. రానున్న సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారాన్ని నిలుపుకుంటామన్న నమ్మకం అధికారపక్షానికి లేదు, రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే నమ్మకం అటు ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిలోనూ లేదు. ఈ పరిస్థితిలో ప్రధాన ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి అవిశ్వాస తీర్మానం వంటి సవాల్ ఎదురుకాక పోవచ్చు. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వారు ఎంతమంది ఉంటారు, వారి రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మేం జగన్ పార్టీలో చేరుతున్నాం, ఇదిగో రాజీనామా అని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే వాటిని స్పీకర్ ఆమోదిస్తారా అన్న అనుమానాలు కలగడం సహజం. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఒకవేళ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటిస్తే గవర్నర్ జోక్యం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ మనుగడ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు మాదిరి 2014 వరకు కొనసాగుతుందా?

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కూడా ప్రభుత్వానికి కత్తిమీద సాములాంటిదే. ప్రతిపక్షం దయాదాక్షిణ్యాలపై ప్రభుత్వం మనుగడ సాగించే పరిస్థితి ఉండడం రాష్ట్ర రాజకీయాల్లో విచిత్రమైన పరిస్థితి. రానున్న రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు, సమీకరణలు జరుగుతాయన్నది ఆసక్తిగా మారింది.

జెడితో ఫోన్‌పై పెదవి విప్పిన చంద్రబాల................

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణతో అత్యధిక ఫోన్లు మాట్లాడారని, ఆంధ్రజ్యోతి ఎండితోనూ ఫోన్లు మాట్లాడారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ఆరోపించిన వాసిరెడ్డి చంద్రబాల శుక్రవారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల ఆరోపణలను తిప్పి కొట్టారు.
తాను ఐబిఎం ఉద్యోగిని అని ఆమె చెప్పారు. తాను ఎంపవరింగ్ యూత్ ప్రోగ్రాం లీడ్ ఇండియాలో ఆరు నెలలుగా పని చేస్తున్నానని చెప్పారు. లీడ్ ఇండియా కార్యక్రమాల కవరేజ్ కోసమే తాను ఎబిఎన్ ఛానల్‌కు ఫోన్ చేశానని చెప్పారు. లీడ్ ఇండియా కార్యక్రమాల కవరేజ్ కోసం తాను సాక్షి ప్రతినిధులతోనూ మాట్లాడానని చెప్పారు. ఈ ప్రోగ్రాంను ప్రమోట్ చేయాలన్నదే తన ఉద్దేశ్యమని చెప్పారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ తన క్లాస్ మేట్ అని చెప్పారు.
స్నేహితులుగా మేం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, పలు కార్యక్రమాలకు లక్ష్మీ నారాయణ సహకరించారని చెప్పారు. తాను గురువారం అంతా శ్రీశైలంలో ఉన్నానని చెప్పారు. తనకు అప్పుడు బెదిరింపు కాల్సు వచ్చినట్లు చెప్పారు. తమ ప్రోగ్రాం కోసం ఎంతోమందికి ఫోన్ చేస్తుంటామని తెలిపారు. తనకు ఇద్దరు కుమార్తెలని, వారిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయని చెప్పారు. 2009 వరకు తాను యుకెలో ఉన్నానని తెలిపారు.
లీడ్ ఇండియా ప్రోగ్రాంను స్వచ్చంధంగా తాను చేస్తున్నట్లు చెప్పారు. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని, తాను చేస్తున్న కృషిలో అంకిత భావముందని చెప్పారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆంధ్రజ్యోతి ఎండితో మాట్లాడినందుకే తన ఫోన్ కాల్ లిస్టును టార్గెట్ చేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఉద్యోగం, సేవా కార్యక్రమాలు తప్ప తనకు మరో వ్యాపకం లేదన్నారు.
తన తండ్రి ఇరిగేషన్ శాఖ ఉద్యోగి అని చెప్పారు. జెడి లక్ష్మీ నారాయణ తండ్రి కూడా ఇరిగేషన్ శాఖ ఉద్యోగే అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులలో పని చేసేప్పుడు అందరం ఒకేచోట ఉండేవారమని తెలిపారు. కాగా చంద్రబాల లీడ్ ఇండియాలో చురుగ్గా పని చేస్తున్నారని లీడ్ ఇండియా ఎపి కో-ఆర్డినేటర్ చూడామణి చెప్పారు. కాగా సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ నిజాయితీ కలిగిన అధికారి అని, కేసు నీరుగార్చేందుకే సాక్షి దుష్ర్పచారం చేస్తోందని టిడిపి నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. వార్తా సేకరణలో భాగంగా ఎవరు ఎవరితోనైనా మాట్లాడటం సహజమేనన్నారు.

Thursday, June 21, 2012

పూరి రథయాత్ర తొక్కిసలాట.................

పూరి రథయాత్ర విషాద సంఘటనతో ప్రారంభమైంది. పూరి రథయాత్రలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు భక్తులు మరణించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మహిళ ఉంది. పూరి రథయాత్ర గురువారం ప్రారంభం కావడానికి కొద్ది ముందు తొక్కిసలాట చోటు చేసుకుంది. రథంపై ఉన్న జగన్నాథ, బలభద్ర, సుభద్ర మూర్తులను చూడడానికి భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.
మరణించిన ఇద్దరు భక్తుల్లో ఒకర్ని విశాఖపట్నానికి చెందిన రవణమ్మ (30)గా గుర్తించారు. మరో వ్యక్తి పురుషుడు. అతను ఎవరనేది గుర్తించాల్సి ఉంది. ఇద్దరి మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. రథయాత్ర గుంపులో ఆ మహిళ ఉందా, లేదా అనేది తెలియాల్సి ఉందని పూరి జిల్లా కలెక్టర్ అర్వింద్ అగర్వాల్ అన్నారు. అసలు తొక్కిసలాట జరిగిందా, లేదా అనేది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు.
వాతావరణం చల్లగానే ఉన్నప్పటికీ పలువురు యాత్రికులు స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యారు. తల తిప్పుతోందనే కారణంతో చాలా మంది ఆస్పత్రిలో చేరారు. చికిత్స చేసి వారిని డిశ్చార్జి చేశారు. తొమ్మిది రోజుల మహోత్సవంలో పోలీసులు యాత్రికులను నియంత్రించడంలో విఫలమయ్యారనే విషయాన్ని ఇద్దరు భక్తుల మృతి అద్దం పడుతోందని అంటున్నారు.
గుంపులను అదుపు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో 2008, 2010, 2011ల్లో కూడా తొక్కిసలాటలు చోటు చేసుకున్నాయి.

ప్రణబ్ కు టి.కాంగ్రెస్ ఎమ్.పిల మద్దతు .....................

తెలంగాణ అంశానికి , రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి సంబందం పెట్టవద్దని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు కోరారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు వివేక్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ,తాము తెలంగాణ ఉద్యమానికి కట్టుబడి ఉన్నామని, కాని దానికి, రాష్ట్రపతి ఎన్నికకు సంబంధం లేదని అన్నారు. తెలంగాణ జెఎసి తమకు రాష్ట్రపతి ఎన్నికలో వ్యతిరేకంగా చేయాలని చెప్పడంపై వారు స్పందించారు.జైలులో ఉన్న జగన్ , తెలుగుదేశం, శివసేన వంటి పార్టీలు కూడా ప్రణబ్ అభ్యర్దిత్వానికి మద్దతు ఇస్తుంటే తాము ఎలా వ్యతిరేకిస్తామని వారు ప్రశ్నించారు. ప్రణబ్ రాష్ట్రపతి అయ్యాక ఆయనపై కూడా తెలంగాణ అంశంపై ఒత్తిడి తెస్తామని వారు అన్నారు.ప్రణబ్ అభ్యర్ధిత్వ ప్రతిపాదనపై తాము కూడా సంతకాలు చేస్తామని వారు ప్రకటించారు.........................

విష్ణు ఆశలపై నీళ్లు: ఒలింపిక్స్ నుంచి పేస్ అవుట్....................

హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారుడు విష్ణువర్దన్ ఆశలపై భారత నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ నీళ్లు చల్లారు. లండన్ ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు టీవీ చానెల్ వార్తలు తెలియజేస్తున్నాయి. చాలా తక్కువ ర్యాంక్ ఉన్న విష్ణువర్ధన్‌తో జోడీ కట్టాలని అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) నిర్ణయించడాన్ని నిరసిస్తూ లియాండర్ పేస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
లండన్‌కు రెండు జట్లను పంపుతున్నట్లు ఎఐటిఎ బుధవారం ఉదయం ప్రకటించింది. మహేష్ భూపతి, రోహన్ బోపన్న ఒక జోడీగా, లియాండర్ పేస్, విష్ణువర్ధన్ మరో జోడీగా లండన్ వెళ్తారని సంఘం ప్రకటించింది. అయితే జూనియర్ ఆటగాడిని తనకు జతగాడిగా నిర్ణయిస్తే ఒలింపిక్స్ నుంచి తప్పుకుంటానని పేస్ బుధవారంనాడు హెచ్చరించారు.
లియాండర్ తండ్రి, ఒపింపియన్ వేసే పేస్ కూడా ఎఐటిఎ నిర్ణయంపై ధ్వజమెత్తారు. ప్రపంచ నెంబర్ 328 క్రీడాకారుడు విష్ణు వర్ధన్‌ను తన కుమారుడికి జోడీగా నిర్ణయించడం సరి కాదని ఆయన అన్నారు. దేశ అత్యున్నత స్థాయి ర్యాంక్ ఆటగాడి పట్ల అది అన్యాయమేనని ఆయన అన్నారు.
విష్ణువర్ధన్ పేస్‌తో ఆడడానికి చాలా ఉత్సాహం ప్రదర్శించాడు. ఈ అవకాశం వచ్చినందుకు అతను ఆనందించాడు. అయితే, పేస్ నిర్ణయం మరో విధంగా ఉండడం విష్ణువర్ధన్‌కు నిరాశ మిగిల్చిందనే చెప్పాలి. పేస్ తాజా నిర్ణయంతో భారత టెన్నిస్ క్రీడలో వివాదం మరింత ముదిరింది......................................

జగన్ కేసు: లక్ష్మినారాయణే వైయస్సార్సిపి టార్గెట్...................

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ జాయింట్ డైరెక్టర్ (జెడి) లక్ష్మినారాయణను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కాస్తా మెతగ్గా సిబిఐ తీరును తప్పు పడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గురువారం తమ దూకుడు పెంచారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వడాన్ని పక్కన పెట్టేసి, దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న లక్ష్మినారాయణను లక్ష్యం చేసుకుని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
లక్ష్మినారాయణ పలు హై ప్రొపైల్ కేసులకు నేతృత్వం వహిస్తున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం, వైయస్ జగన్ ఆస్తులు, సోహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్, ఆజాద్ ఎన్‌కౌంటర్ తదితర కేసుల దర్యాప్తునకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఆయన దర్యాప్తు పట్ల ఓ వర్గం అమితమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆయన విశ్వసనీయతనే ప్రశ్నిస్తున్నారు.
జెడి లక్ష్మినారాయణ ఏయే నెంబర్లకు కాల్స్ చేశారనే వివరాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విడుదల చేశారు. తమ వ్యతిరేకులతో జత కట్టి లక్ష్మినారాయణ దర్యాప్తు వివరాలను లీక్ చేస్తున్నారని వారు ఆరోపిస్తూ అసెంబ్లీ వద్ద ధర్నాకు కూడా దిగారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను భౌతికంగా అంతం చేయడానికి కుట్ర జరుగుతుందనే అనుమానాలు కలుగుతున్నాయని వారన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఆరోపణలను తిప్పకొట్టడానికి కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, వారి మీడియా సమావేశం తీరును చూసిన వైయస్సార్ కాంగ్రెసు నాయకులు వివరణ ఇచ్చుకున్నారు. అయితే, జెడి లక్ష్మినారాయణపై చేసిన ఆరోపణల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు.
వాసిరెడ్డి చంద్రబాల అనే మహిళ జెడి లక్ష్మినారాయణతో, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో, గ్రేహౌండ్స్ ఐజితో మాట్లాడడంలోని రహస్యమేమిటని వారు అడుగుతున్నారు. చంద్రబాల ఎవరో బయటకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే తమ వ్యతిరేకులతో కలిసి లక్ష్మినారాయణ పనిచేస్తున్నారనే అనుమానాలను వ్యక్తం చేశారు.
కాగా, ఇంతలోనే సాక్షి మీడియాలో మరో వార్త కూడా వచ్చింది. ఎల్లో మీడియా ప్రతినిధులతో జెడి లక్ష్మినారాయణ మాట్లాడారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల ఆరోపణల తర్వాత ఆయన వారితో మంతనాలు జరిపారని, ఆ తర్వాతనే మీడియా ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైయస్సార్ కాంగ్రెసు నాయకులపై విమర్శలు చేశారని సాక్షి మీడియా కథనం వ్యాఖ్యానించింది...............................

మరోసారి బెయిల్‌కు వైయస్ జగన్ ప్రయత్నాలు....................

అక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మరోసారి బెయిల్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన గురువారంనాడు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం గతంలో వైయస్ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టులో ఆయన మొదటిసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పలు విషయాలను క్రోడకరిస్తూ ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
తాను లోకసభ సభ్యుడ్నని, ఓ పార్టీకి అధ్యక్షుడినని, తనపై అకారణంగా కేసులు పెట్టారని, రాజకీయ కారణాలతోనే సిబిఐ తనను అరెస్టు చేసి తనపై అభియోగాలు మోపిందని ఆయన అన్నారు. ఓ కాంగ్రెసు శాసనసభ్యుడు చేసిన ఫిర్యాదు మేరకు హైకోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేపట్టిందని, తొమ్మిది నెలల పాటు దర్యాప్తు సాగించినా తనకు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించలేకపోయిందని ఆయన అన్నారు.
చివరకు ఉప ఎన్నికలకు ముందు తనను సిబిఐ అరెస్టు చేసిందని, మూడు రోజుల పాటు సిబిఐ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని, అయితే సరైన సమాధానాలు ఇవ్వలేదనే కారణంతో సిబిఐ తనను అరెస్టు చేసిందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి మేరకే సిబిఐ తనను అరెస్టు చేసిందని ఆయన ఆరోపించారు. తన కేసులో సిబిఐ మూడు చార్జిషీట్లు దాఖలు చేసిందని, ఎందులో కూడా తనపై అభియోగాలు మోపలేదని ఆయన అన్నారు.
అక్రమాస్తుల కేసులో నిందితులు జగన్, విజయసాయిరెడ్డికి నార్కో టెస్టులు జరపాలన్న సీబీఐ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ కేసును వచ్చే నెల 4కి వాయిదా వేశారు.
ఓఎంసీ, జగన్, ఎమ్మార్ కేసుల్లో ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. గురువారం ఉదయం చంచల్‌గూడా జైలుకు అధికారులు చేరుకున్నారు. ఈ కేసుల్లో జైలులో ఉన్న జగన్, విజయరాఘవ, శ్రీలక్ష్మి తదితరులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. మరోవైపు ఎమ్మార్ కేసులో విజయరాఘవ బెయిల్ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు 28కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను సీబీఐ కోర్టు వచ్చే నెల 6కు పొడిగించింది. నేటితో ముగ్గురి రిమాండ్ ముగియడంతో పోలీసులు వీరిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.

రాష్ట్రపతి ఎన్నిక తరువాత రాష్ట్ర నాయకత్వంలో బారీ మార్పులు …?

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జోడీ తాము ఆశించిన, అనుకున్న స్థాయిలో సంతృప్తికరంగా లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్‌ల జోడీ నాయకత్వంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వీరిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నప్పటికీ వారిలో ఎవరూ బహిరంగంగా బయటపడలేదని, ఏదైనా ఉంటే అధిష్ఠానవర్గం దృష్టికి మాత్రమే తీసుకువచ్చే వారని ఎఐసిసి నాయకులు అభిప్రాయపడుతున్నారు. చాలామంది మంత్రుల పని తీరు కూడా సంతృప్తికరంగా లేదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఇప్పుడున్న ‘టీం’తో 2014లో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవడం కష్టమేనన్న అభిప్రాయంతో అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న ఆశ లేదని, కనీసం మెరుగైన ఫలితాలు సాధించేలా అయినా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానం అనుకుంటున్నట్లు తెలిసింది.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అధిష్ఠానం కూడా ఆశించలేదని, కనీసం గట్టి పోటీ అయినా ఇస్తుందని అనుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఎనిమిది స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలుపొందడం అధిష్ఠానవర్గాన్ని కలవరానికి గురి చేసినట్లు తెలిసింది. నెల్లూరు లోక్‌సభ స్థానంలో గట్టి పోటీ ఇస్తామనుకుంటే దాదాపు మూడు లక్షల ఓట్ల మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం అధిష్ఠానవర్గాన్ని మరింత ఆందోళనకు గురి చేసినట్లు తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో లోక్‌సభ స్థానాలను గెలుచుకోవలసి ఉంటుందని అధిష్ఠానం భావిస్తోంది.
జగన్ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మరోమారు తమను తప్పుదారి పట్టించారన్న ఆగ్రహంతో అధిష్ఠానం ఉన్నట్లు తెలిసింది. ఉప ఎన్నికలకు జగన్‌ను దూరంగా ఉంచేట్లు చేయగలిగితే ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవహిస్తుందని, పార్టీ భవిష్యత్తుపై నమ్మకం సన్నగిల్లుతుందని, జగన్ పార్టీ వైపు కాంగ్రెస్ నుంచి కొత్తగా ఎవరూ వెళ్ళరని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చెప్పారని, అయితే అందుకు విరుద్ధంగానే అన్నీ జరిగాయని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలిసింది...................................

జైలు నుంచే జగన్‌ రాజకీయం..........................

రాష్ట్ర రాజకీయాలకు చంచల్‌గూడ జైలు వేదికగా మారుతోంది. ముఖ్యంగా వైకాపా భవిష్యత్‌ ప్రణాళికలు ఇక్కడి నుంచే రూపుదిద్దుకుంటు న్నాయి. పార్టీ నిర్మాణంపై చర్చలు, పార్టీలో చేరికలతో సహా అన్ని వ్యవహారాలు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలోనే చర్చిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో ఇక పార్టీ నిర్మాణంపైనే జగన్‌ ప్రత్యేక దృష్ట్టి కేంద్రీకరించినట్లు సమాచారం. అందుకే తనను కలిసేందుకు వచ్చే పార్టీ శ్రేణులకు ప్రజలతో మమేకం కావాలని జగన్‌ పదే పదే చెబుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలపైనే తమ కుటుంబ సభ్యులతోను, పార్టీ ముఖ్యులతోను ఎక్కువగా చర్చిస్తున్నట్లు సమాచారం. బుధవారం తనను కలిసేందుకు వచ్చిన భార్య భారతి, పార్టీ ముఖ్యులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

తొలుత భార్యను కలిసిన జగన్‌ అనంతరం పార్టీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, వంగవీటిరాధ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, రాజ్‌ ఠాకూర్‌తో పాటు వివిధ జిల్లాలకు చెందిన పలువురు నేతలను కలిశారు. ప్రధానంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో వారి మధ్య కొంత చర్చ జరిగింది. అదే విధంగా వివిధ పార్టీలకు చెందిన వారిని వైకాపాలో చెెర్చుకునే విషయమై చర్చించినట్లు తెలిసింది. పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి జగన్‌ను కలిసింది..............................

ట్రెండ్ సెట్ చేసిన పవర్‌స్టార్‌...................

“నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తా… ” అంటూ ‘గబ్బర్ సింగ్’తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన పవర్ స్టార్ పవన్ ఇప్పుడు సిని పరిశ్రమలో కొత్త ట్రెండ్ కు  శ్రీకారం చుట్టాడు. సినిమా బడ్జెట్‌ నియంత్రణపై ఆయన దృష్టి పెట్టాడు. ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేయాలని పవన్‌ నిర్ణయించుకున్నాడు. తన కారణంగా షూటింగ్‌ ఆలస్యమైతే నిర్మాత నష్టపోయిన డబ్బును తిరిగి ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. తనతో పాటు ఇతర ఆర్టిస్టులకు కూడా ఇవే నిబంధనలు విధించాలని ఆయన తన సన్నిహిత దర్శకులు, నిర్మాతలకు కూడా సూచిస్తున్నాడు. ఇవే నిబంధనలు మిగతా నటులకు వర్తింప చేయాలని ఆయన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్‌కు సూచించాడు. దీని వల్ల పరిశ్రమ అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతోనే పవన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  ఇప్పటికే ఇటువంటి  నిబంధనలు మలయాల పరిశ్రమలో అమలవుతున్నాయి. విజయవంతమవుతున్నాయి...............................

రంజితతో రాసలీలలు: నిత్యానంద స్వామికి కోర్టు షాక్...........

బెంగళూరు: రాసలీలల నిత్యానంద స్వామికి స్థానిక రామనగర కోర్టు షాక్ ఇచ్చింది. ప్రముఖ నటి రంజితతో రాసలీలల కేసులో బెంగళూరులోని రామనగర జెఎంఎఫ్‌సి కోర్టు నిత్యానందకు రక్త, స్వర పరీక్షలు నిర్వహించాలని బుధవారం అధికారులను ఆదేశించింది. రెండేళ్ల క్రితం నిత్యానంద, రంజిత రాసలీలల సిడిలు పలు టీవి చానళ్లలో ప్రసారమైన విషయం తెలిసింది. ఇవి సంచలనం సృష్టించాయి.
దీనికి సంబంధించి అప్పట్లో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. వీడియో సిడిలలో ఉన్నది తాము కాదని నిత్యానంద, రంజిత చెబుతున్నారు. దీంతో వీడియోలో ఉన్నది వారా కాదా అనే విషయాన్ని ధ్రువీకరించేందుకు పరీక్షలు చేయాలని సిఐడి అధికారులు నిర్ణయించారు. దీనిపై తమకు సహకరించాలని నిత్యానందకు అప్పట్లో పలుమార్లు నోటీసులు అందజేశారు. అయితే నిత్యానంద మాత్రం స్పందించలేదు.
దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. నిత్యానందకు రక్త, స్వర పరీక్షలు జరపుతామని వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం నిత్యానందకు పరీక్షలు జరపాలని ఆదేశించింది. కాగా ఇటీవల బిడదిలోని ధ్యానపీఠానికి తాళం వేసిన కర్నాటక ప్రభుత్వం ఈ మంగళవారం పీఠాన్ని తిరిగి భక్తులకు అప్పగించింది.
మరోవైపు నిత్యానంద స్పెయిన్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు ఆయన ముంబయిలోని స్పెయిన్ రాయబార కార్యాలయానికి రెండు రోజుల క్రితం దరఖాస్తు ఇచ్చారని తెలుస్తోంది. రంజిత అనంతరం ఇటీవల మరో నటిపై నిత్యానంద పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే........................................

జగన్ భయం: కెసిఆర్‌తో చిరు తరహా ప్యాకేజీ.....................

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భయం కాంగ్రెసు అధిష్టానాన్ని గట్టిగా పట్టుకున్నట్లే తెలుస్తోంది. తెలంగాణలో కూడా పార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని పరకాల ఉప ఎన్నిక ఫలితం ద్వారా కాంగ్రెసు అధిష్టానం గుర్తించినట్లు భావిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును దరి చేర్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్‌తో చిరంజీవి తరహా ఒప్పందం చేసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సీమాంధ్రలో భవిష్యత్తు వైయస్ జగన్ కారణంగా తమ పార్టీ భవిష్యత్తు అంధకార బంధురమవుతుందని గ్రహించిన కాంగ్రెసు అధిష్టానం తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేతిలో నాయకత్వాన్ని పెట్టడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో కెసిఆర్‌ను వాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెరాసను తమ పార్టీలో విలీనం చేయాలనే ప్రతిపాదనను కెసిఆర్ ముందు ఉంచాలని, అందుకు కెసిఆర్‌కు చిరంజీవికి ఇచ్చినట్లే కొన్ని వాగ్దానాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇది ఆవశ్యకమని కాంగ్రెసు అధిష్టానం గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. సీమాంధ్రలో పార్టీ బరువు బాధ్యతలను చిరంజీవి పెట్టాలని ఆలోచిస్తోంది.
విలీనం ప్రతిపాదనతో తెరాస ముందుకు వచ్చిందని, ఇందుకు సంబంధించిన తన వద్ద కచ్చితమైన సమాచారం ఉందని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి, రాయలసీమ నేత టిజి వెంకటేష్ అన్నారు. గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, జైపాల్ రెడ్డి వంటి నాయకులతో టిజి వెంకటేష్ ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ అంశం త్వరలో తేలుతుందని ఆయన చెప్పారు. తెరాస విలీనం ప్రతిపాదనతో తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెబుతున్నారు............................................

జైల్లో రాత్రంతా క్యాండిల్ వెలుగులో జగన్: జైలుకు ఈడి..................

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం రాత్రి అంతా చీకట్లోనే గడిపారట. రాత్రి విద్యుత్ కేబుల్స్ కాలిపోవడంతో జైలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లుగా సమాచారం. దీంతో ఖైదీలు రాత్రంతా చీకట్లోనే ఉన్నారు. ఖైదీల గదులలో జైలు అధికారులు క్యాండిల్స్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
జగన్ గదిలో కూడా అధికారులు క్యాండిల్ ఏర్పాటు చేశారు. దీంతో యువనేత రాత్రంతా క్యాండిల్ వెలుగులో నిద్రపోయారట. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఖైదీల లెక్కింపు తదితరాల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలుస్తోంది. గతంలో ఖైదీల లెక్కింపు మ్యానువల్‌గా ఉండేది. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అయింది. దీంతో లెక్కింపు సమస్య ప్రహసనంగా మారిందని తెలుస్తోంది. కాగా జైలు అధికారులు, విద్యుత్ అధికారులు ఉదయం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసి కేసు, ఎమ్మార్ కేసులలో జైలులో ఉన్న నిందితులను విచారించేందుకు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడి) అధికారులు గురువారం ఉదయం చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. నిందితులను అధికారులు ఈ రోజు నుండి పదిహేను రోజుల పాటు విచారించనున్నారు. శ్రీలక్ష్మి, బిపి ఆచార్య, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ రెడ్డి, విజయ రాఘవ, కోనేరు ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి తదితరులను విచారించనున్నారు.
కాగా జగన్, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డికి నార్కో టెస్టులు జరపాలన్న సిబిఐ పిటిషన్ పైన విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు వచ్చే నెల 4వ తేదికి వాయిదా వేసింది. జగన్, విజయ సాయి రెడ్డిలను నార్కో టెస్టులకు అనుమతించాలని సిబిఐ ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే...................

సిబిఐ జెడి ఫోన్ కాల్స్ జాబితాలో చంద్రబాల ఎవరు?

సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ చేసిన ఫోన్ కాల్ జాబితాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ శాసనసభ పక్షం విడుదల చేస్తూ, సిబిఐ కుట్ర ప్రకారమే వై.ఎస్.జగన్ కేసును డీల్ చేస్తోందంటూ పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది. మీడియా ప్రతినిదులతో పాటు వాసిరెడ్డి చంద్రబాల అనే ఆమె కు లక్ష్మీనారాయణ సెల్ ఫోన్ నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్, అలాగే మీడియా నుంచి, చంద్రబాల నుంచి లక్ష్మీనారాయణకు వెళ్లిన ఫోన్ కాల్స్ జాబితాను విడుదల చేసి ఇందులో కుట్ర ఉందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఒక వర్గం మీడియాతోనే మాట్లాడారన్నది ఒక అభియోగం కాగా, చంద్రబాల ఆంధ్రజ్యోతి ఎమ్.డి.రాధాకృష్ణకు కూడా పది ఫోన్ కాల్స్ చేసినట్లు ఆ జాబితా వెల్లడించింది. ఒక టీవీ ప్రతినిధితో 389సార్లు జెడి మాట్లాడినట్లు జాబితా వెల్లడించడం విశేషం. ఒక వర్గం మీడియావారితోనే జెడి మాట్లాడారన్నది ఎమ్మెల్యేల అభియోగంగా ఉంది. అయితే చంద్రబాల గురించి కూడా అందరిలో ఆసక్తి ఏర్పడింది.చంద్రబాల తో 320సార్లు జెడి మాట్లాడారన్నది వీరి అభియోగం. ఎవరీ చంద్రబాల అంటూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ ఆవరణలో ధర్నా చేసిన సందర్భంగా ప్లకార్డులను కూడా ప్రదర్శించడం విశేషం.మీడియా ప్రతినిదులతో జెడి మాట్లాడడం లో పెద్ద తప్పు ఉంటుందా అన్నది చర్చనీయాంశం. అయితే కేవలం కొందరితోనే ఆయన మాట్లాడారన్నది ఒక విమర్శ కావచ్చు. జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరించే మీడియాతోనే ఆయన మాట్లాడారని, సిబిఐ ఆయా వ్యక్తులను విచారించే సందర్భంలో పలు విషయాలు బయటకు వచ్చిన తీరుపై సాక్షి ఫిర్యాదులు చేసిందని, అయినా పట్టించుకోలేదన్నది మరో అభియోగంగా ఉంది. కాగా మీడియాతో మాట్లాడినదానిపై ఎంతవరకు ఇది సమస్య అవుతుందో చెప్పజాలం. అయితే వాసిరెడ్డి చంద్రబాల పాత్రపై ఏవైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తే అప్పుడు సిబిఐ పాత్రపై విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా చంద్రబాలకు ఈ వ్యవహారాలతో సంబంధాలు లేవని తేలితే అప్పుడు సిబిఐకి గాని, లక్ష్మీనారాయణకు గాని పెద్ద ఇబ్బంది ఉండదు. అయితే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వద్ద ఇంకే ఆరోపణల జాబితా ఉంది? వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆ పార్టీ చూపబోతోందన్నదానిపైనే ఈ వ్యవహారం ఆధారపడి ఉంటుంది.ఇక ఇప్పుడు ఇది వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు మధ్య యుద్దంగా మారిందని అనుకోవాలి. ఇప్పుడు లక్ష్మీనారాయణ ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరం.మార్చి నెల నుంచి జూన్ పదిహేడో తేదీవరకు లక్ష్మీనారాయణ పోన్ కాల్స్ జాబితాను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విడుదల చేసింది.......................

ప్రణబ్ కు టిడిపి మద్దతు ఇవ్వడంలో ఆంతర్యం....................

రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న కాంగ్రెస్ నేత, యుపిఎ అభ్యర్ధి ప్రణబ్ ముఖర్జీ కి టిడిపి ఎందుకు ఇంత హడావుడిగా మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చిందన్నదానిపై చర్చ జరుగుతోంది.సెక్యులర్ అభ్యర్దికే తమ మద్దతు ఉంటుందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లతో కలిసి కూటమి తయారు చేయాలని భావించినా చంద్రబాబు ఎందుకో విరమించుకున్నారు.ప్రణబ్ కు అనుకూలంగా టిడిపి మాట్లాడానికి పలు కారణాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కన్నా ముందుగానే ప్రణబ్ కు సపోర్టు ప్రకటించడం ద్వారా ఆ పార్టీని ఇరుకున పెట్టవచ్చని కొందరు భావించారు. అదే సమయంలో బిజెపి ఉన్న ఎన్.డి.ఎ.వైపు టిడిపి వెళ్లడం లేదన్న అబిప్రాయాన్ని ప్రచారంలోకి తీసుకు రావచ్చు.అయితే ఇవన్ని ఒక ఎత్తు అయితే టిడిపికి చెందిన ఒక ఎమ్.పి. ప్రత్యేకంగా చంద్రబాబును ఈ విషయంలో ఒప్పించారని అంటున్నారు. పారిశ్రామికవేత్త కూడా అయిన ఆ ఎమ్.పి ప్రణబ్ కు మద్దతు ఇవ్వడం వల్ల కలిగే ప్రత్యేక ప్రయోజనాలను కూడా వివరించి పార్టీ నాయకత్వాన్ని ఒప్పించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.అందుకే రాష్ట్రపతి ఎన్నిక విషయంలో రాజకీయాలకు అతీతంగా చూడాలని అంటూ కాంగ్రెస్ వ్యతిరేకతను ప్రస్తుతానికి పక్కనబెట్టారని అంటున్నారు.ఏదైనా అనివార్య పరిణామం సంభవిస్తే తప్ప టిడిపి ప్రణబ్ కే మద్దతు ఇస్తుందన్నది వారి మాటలని బట్టే అర్దం చేసుకోవచ్చు..................

అసెంబ్లీలో ముందు సీట్లోకి రాబోతున్న విజయమ్మ.............

ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్రను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పోషిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ప్రజల తరపున వారికి అండగా పనిచేస్తామని , ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశమై పలు తీర్మానాలు చేసినట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చెప్పారు. వై.ఎస్.విజయమ్మను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై తీర్మానాలు చేశారు. కాగా శాసనసభ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. కాగా సిబిఐ విచారణ తీరుపై తీవ్ర అభ్యంతరం చెప్పారు.విజయమ్మ ఇకపై ముందు సీట్లో కూర్చోబోతున్నారు.ఒక రాజకీయ పార్టీగా ఐదు స్థానాలు గెలిస్తే గాని దానికి ఒక ప్రత్యేక గుర్తింపు రాదు.ప్రస్తుతం ప్రతిపక్షంలో టిడిపికి ఎనభైఆరు మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆ తర్వాత టిఆర్ఎస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లకు పదిహేడు మంది చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఎమ్.ఐ.ఎమ్.కు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.సిపిఐకి నాలుగు, సిపిఎంకు ఒక్కరు, లోక్ సత్తాకు ఒకరు ప్రాతినిద్యం వహిస్తున్నారు.......