Read In Tollywood Latest News

Saturday, July 21, 2012

కెసిఆర్‌తో విభేదించిన తెలంగాణ రాములమ్మ..........


 Vijayashanthi Differs With Kcr
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి విభేదించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కెసిఆర్ చేసిన ప్రకటనకు భిన్నమైన అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తుందని కెసిఆర్ నమ్ముతున్నారని, అయితే కాంగ్రెసు ఇస్తుందనే నమ్మకం తనకు లేదని ఆమె అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్ల నేతన్న ధర్నాను వ్యతిరేకించడానికి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆగస్టులో, లేదంటే సెప్టెంబర్‌లో తెలంగాణ వస్తుందని కెసిఆర్ గత కొద్ది కాలంగా ప్రతి సభలోనూ చెప్పుకుంటూ వస్తున్నారు. తనకు ఆ మేరకు సంకేతాలు అందాయని కూడా ఆయన చెప్పారు.

అయితే, కెసిఆర్ ప్రకటనతో తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ విభేదించారు. తమకు అటువంటి సంకేతాలు ఏవీ లేవని ఆయన చెప్పారు. అందువల్ల తాము తెలంగాణ సాధన కోసం ఉద్యమ కార్యాచరణను తీసుకుంటున్నామని కోదండరామ్ చెప్పారు. కెసిఆర్ ప్రకటనతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ కూడా విభేదించారు. ఉద్యమం చేస్తే తప్ప తెలంగాణ రాదని, తమ కాంగ్రెసు పార్టీ నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఆయన అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై దృష్టి సారిస్తుందని, రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని కెసిఆర్ భావించినట్లు చెబుతున్నారు. రాజకీయ పరిణామాలను బట్టి తెలంగాణ వస్తుందని కెసిఆర్ ఓ అంచనాకు వచ్చి అలా మాట్లాడారే తప్ప మరోటి కాదనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

No comments:

Post a Comment