
తెలుగుదేశం పార్టీని వీడి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి కొడాలి నాని తన అనుచరులను ఒప్పించినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తీసుకురావడానికి మధ్యవర్తులు కొంత మంది నానితో రాయబారాలు నడిపినట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన ఓ కీలక నేత, ఓ కార్పరేట్ కాలేజీ యజమాని, మరో నాయకుడు నానిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి తెప్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని అంటున్నారు.
గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీపై నాని అసంతృప్తితో ఉన్నారు. అప్పుడే ఆయన తెలుగుదేశం పార్టీని వీడుతారనే ప్రచారం సాగింది. దీంతో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కొడాలి నానిని తీసుకుని వెళ్లి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. జగన్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించాలని నానికి చంద్రబాబు సూచించారు. అయితే, చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ వార్తలను నాని ఖండించలేదు. గుడివాడకు వెళ్లిన తర్వాత అక్కడ ఖండిస్తానని చెప్పారు.
గుడివాడ వెళ్లిన తర్వాత కూడా నాని ఆ వార్తలను ఖండించకపోగా, తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. వారం రోజుల క్రితం కొడాలి నాని హైదరాబాదులో జరిగిన చర్చల అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతానని నాని వైయస్ జగన్కు చెప్పారు. అయితే, జగన్ అందుకు అంగీకరించలేదు. తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయాలని, ఉప ఎన్నికల భారం తాను చూసుకుంటానని వైయస్ జగన్ నానికి హామీ ఇచ్చారని తెలుస్తోంది.
వైయస్ జగన్ హామీతో నాని తెలుగుదేశం పార్టీకే కాకుండా శాసనసభా సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9వ తేదీన గానీ 18వ తేదీన గానీ నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ను జైలులో కలిసిన తర్వాత నాని ఆ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే తేదీని ఖరారు చేసుకుంటారని చెబుతున్నారు. ఈ విషయాలపై సంప్రదించడానికి కొడాలి నాని అందుబాటులో లేరు.
No comments:
Post a Comment