Read In Tollywood Latest News

Thursday, July 26, 2012

ఎన్నికల కమిషన్ వద్ద దాచేసిన పార్థసారథి.......

Parthasarathi Cheats Ec
మంత్రి పార్థసారథి ఎన్నికల కమిషన్ వద్ద తన పైన కేసు ఉన్న విషయాన్ని దాచి పెట్టారు. 2009 ఎన్నికలలో పార్థసారథి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన తన అఫిడవిట్‌లో పార్థసారథి తనపై కేసులు లేవని పేర్కొన్నారు. అఫిడవిట్ సమర్పించినప్పుడు కేసులు ఉంటే తప్పకుండా పేర్కొనవలసి ఉంది. కానీ పార్థసారథి మాత్రం ఈ విషయాన్ని పేర్కోలేదు.

కేసు నమోదై ఇప్పుడు నేరం రుజువైంది కనుక(రెండో నిందితుడు) పార్థసారథిపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో కేసు విషయమై ప్రస్తావించక పోవడం ద్వారా ఆయన మరిన్ని చిక్కుల్లో పడ్డారని అంటున్నారు. ఈ విషయమపై ఆయన చేతిలో ఓడిపోయిన అభ్యర్థి కూడా కోర్టుకు వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.

ప్రజాప్రాతినిథ్యం చట్టం 1951 ప్రకారం ఆయనపై అనర్హత వేటుకు అవకాశముందని అంటున్నారు. ఈ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే ఆయన ఆరేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు అనర్హుడవుతాడని చెబుతున్నారు. ఈ అంశంపై పార్థసారథి స్పందిస్తూ.. తాను తన ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించానో లేదో చూసుకొని స్పందిస్తానని చెప్పారు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే అనుకోకుండా జరగవచ్చునని చెప్పారు. అయినా కోర్టు కంపెనీకి జరిమానా విధించిందని పేర్కొన్నారు.

కాగా మంత్రి పార్థసారథి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఆర్థిక నేరాల కోర్టు బుధవారం నిర్ధారించిన విషయం తెలిసిందే. కెపిఆర్ టెలీ ప్రోడక్ట్స్ కంపెనీ పేరుతో మిషనరీ కొన్న పార్థసారథి ఫెరా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కోర్టు అతనికి రూ.5లక్షల 15వేల జరిమానాతో పాటు రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఫెరా ఉల్లంఘన కేసులో కెపిఆర్ సంస్థను మొదటి నిందితుడిగా పేర్కొంటూ సంస్థకు రూ.5 లక్షలు, పార్థసారథిని రెండో నిందితుడిగా పేర్కొంటూ అతనికి రూ.5 వేల జరిమానా విధించింది.

మరో కేసులో రూ.10వేల జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో మరో పది నెలలు జైలు శిక్ష విధించింది. అయితే తాత్కాలికంగా జైలు శిక్షను నిలుపుదల చేస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా ఈ బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం ఓ నెల రోజులు గడువు కూడా ఇచ్చింది. ఇందుకుగాను మంత్రి పూచికత్తు కోర్టుకు సమర్పించారు.

No comments:

Post a Comment