
జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడితో తెలుగు యువత ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ యువజన విభాగం తెలుగు యువత ఖండించింది. ఈ ఘటనతో తమకు ఏ విధమైన సంబంధం లేదని తెలుగు యువత నాయకులు స్పష్టం చేశారు. కావాలనే కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, నందమూరి వంశానికీ నారా వంశానికీ మధ్య మనస్పర్థలు రేపడానికి జరిగిన సంఘటనగా వారు ఈ దాడిని అభివర్ణించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీవారే ఆ పని చేసి తమపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు.
జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై దాడికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి దినేష్ స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన పార్టీ రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెడుతోందని ఆయన ఆరోపించారు. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లకు గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని వెన్నుపోటు పొడిచారని దినేష్ విమర్శించారు.
కాగా ఫిల్మ్ నగర్లోని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయంపై బుధవారం రాత్రి పదకొండు గంటలకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇండికా కారులో వచ్చి దాడి చేసిన విషయం తెలిసిందే. అద్దాలు ద్వంసం అయ్యాయి. అయితే దాడి చేసిన వారు కానీ, దానికి కారణాలు కాని తెలియటం లేదు. జూనియర్ ఇక్కడ నుంచే ఇంతకు ఒక రోజు ముందు కొడాలి నాని విషయమై టీవీ మీడియాతో మాట్లాడారు. కొడాలి నాని వర్గీయలు కావచ్చని కొందరు, తాగి వచ్చిన కొందరు అయి ఉండవచ్చునని మరికొందరు ఊహిస్తున్నారు. అయితే అంతా సజావుగా ఉన్న ఈ సమయంలో ఎవరు దాడికి పాల్పడి ఉంటారనేది అర్దం కావటం లేదని సీనియర్స్ అంటున్నారు.
No comments:
Post a Comment