
మంత్రుల మధ్య కృష్ణా జలాలు చిచ్చు పెట్టాయి. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీరందించడంపై హైదరాబాద్, రాయలసీమ మంత్రులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కృష్ణా డెల్టాకు నీరు అందించడాన్ని హైదరాబాదుకు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తప్పు పట్టారు. ఈ విషయంపై ముఖేష్ గౌడ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాయగా, దానం నాగేందర్ బహిరంగంగానే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పు పట్టారు.
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వడం వల్ల హైదరాబాదు మంచినీటికి కటకట ఏర్పడుతుందని దానం నాగేందర్, ముఖేష్ అంటున్నారు. నాగార్జునసాగర్ జలాశయంలో నీటి మట్టం 510 అడుగుల మేరకు పైన ఉంటేనే కృష్ణా డెల్టాకు నీరందించాలని, అంతకు దిగువ స్థాయికి నీటిమట్టం చేరుకుంటే హైదరాబాదుకు నీరందవని అంటున్నారు. రాయలసీమకు చెందిన మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి కర్నూలు ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
శ్రీశైలం రిజర్వాయర్ నీటి మట్టం 854 అడుగులకు పైకి చేరినప్పుడు మాత్రమే దిగువకు నీటిని విడుదల చేయాలని ఏరాసు ప్రతాప రెడ్డి, పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రితో చెప్పారు. శ్రీశైలం నీటిని మొదట కర్నూలు జిల్లా అవసరాలకు వాడాలని వారన్నారు. అయితే, అందుకు విరుద్ధంగా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కాగా, తెలంగాణకు చెందిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ఈ విషయంలో తీవ్రమైన ఇరకాటంలో పడ్డారు. కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడంలో ఆయన ముఖ్యమంత్రి ఆదేశాలను పాటించారు. తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి తన ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుల నుంచే కాకుండా కాంగ్రెసు నాయకుల నుంచి కూడా విమర్శలు ఎదుర్కుంటున్నారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలను సమర్థించిన నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కె. జానా రెడ్డి తెలంగాణ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నారు.
తమకు అనుకూలంగా నిర్ణయం రావడంతో కోస్తాంధ్రకు చెందిన మంత్రులు ఈ విషయంపై ఏమీ మాట్లాడడం లేదు. కానీ, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడంపై ముఖ్యమంత్రికి బాసటగా నిలుస్తున్నారు. మొత్తం మీద, కృష్ణా జలాల వివాదం మరోసారి తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసే అవకాశం ఉందని అంటున్నారు.
No comments:
Post a Comment