Read In Tollywood Latest News

Monday, July 23, 2012

కిరణ్‌కు చుట్టుకున్న విజయమ్మ దీక్ష!, కెటిఆర్ ధర్నా...


 Vijayamma Deeksha Needles At Kiran Kumar Reddy
కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో చేనేత దీక్ష పేరుతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ చేపట్టిన ఒక్క రోజు ధర్నా కార్యక్రమం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెడకు చుట్టుకుంది! విజయమ్మ దీక్షపై పార్టీలకతీతంగా తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. అదే సమయంలో వారు ముఖ్యమంత్రి కిరణ్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెసుకు చేనేత కార్మికులపై ప్రేమ లేదని, వారి సమస్యలు పరిష్కరించాలనే యావ కాని లేదని రాజ్యసభ సీనియర్ సభ్యుడు వి.హనుమంత రావు ఢిల్లీలో అన్నారు. విజయమ్మ దీక్ష సిరిసిల్లలో దీక్ష చేసేందుకు చేనేత కార్మికులు కేవలం అక్కడే లేరని ప్రొద్దుటూరు, ధర్మవరం, వెంకటగిరి తదితర ప్రాంతాలలో ఉన్నారన్నారు. వీరిదో పొలిటికల్ గేమ్ అని విమర్శించారు.

విజయమ్మ దీక్షకు ప్రభుత్వం ఎందుకు సహకరించిందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దీనిపై సమాధానం చెప్పాలన్నారు. విజయమ్మ దీక్షను అడ్డుకున్న వారిపై పోలీసుల ప్రవర్తన సరిగా లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పొలిటికల్ డ్రామా వల్ల తెలంగాణ సెంటిమెంట్ మరింత పెరిగిందన్నారు. పోలీసులు తెలంగాణ భవన్‌లోకి వెళ్లడం సరికాదన్నారు. కార్యకర్తలను, నాయకులను ముందే నిర్భందించడం, పోలీసుల అండతో విజయమ్మను సిరిసిల్లకు తరలించడాన్ని చూస్తుంటే కిరణ్ వ్యవహార శైలిని ప్రశ్నించాల్సి వస్తోందన్నారు. రాయలసీమలో ప్రజాస్వామ్యం లేదన్నారు. తాను కూడా త్వరలో సీమలో పర్యటిస్తానని, తనకూ భద్రత కల్పించాలని విహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వైయస్సార్ కాంగ్రెసుతో ముఖ్యమంత్రి కుమ్మక్కయ్యారని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకే విజయమ్మ దీక్షకు సహకరించారన్నారు. దీక్షను అడ్డుకున్న వారి అరెస్టులు అక్రమమని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే విజయమ్మ దీక్ష చేపట్టారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ ఆరోపించారు.

విజయమ్మ రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్ష చేపట్టారని టిడిపి నేత కిష్టప్ప విమర్శించారు. తెలంగాణలో రక్తం పారించడానికే విజయమ్మ దీక్ష చేపట్టారని జెఏసి చైర్మన్ కోదండరామ్ ఆరోపించారు. పులివెందుల ఎమ్మెల్యేను సిరిసిల్లకు రానివ్వడం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ దమన నీతికి నిదర్సనమన్నారు. విజయమ్మ దీక్ష ముమ్మాటికీ తెలంగాణపై దండయాత్ర అన్నారు. విజయమ్మ దీక్షను నిరసిస్తూ మంగళవారం కరీంనగర్ జిల్లా బందుకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు.

ప్రజలు విజయమ్మను అడుగడుగునా నిలదీశారన్నారు. విజయమ్మ దీక్షను చూస్తుంటే ఆమె వెనుక ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. సీమాంధ్రులంతా తోడు దొంగలే అన్నారు. తెలంగాణవాదులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీమాంధ్రుల కుట్రలు భగ్నం చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తన అక్రమాస్తులు కాపాడుకునేందుకే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సమస్యకు పరిష్కారం తెలంగాణ తప్ప మరొకటి లేదన్నారు. కాగా విజయమ్మ దీక్ష సందర్భంగా అక్రమ జరిగిన అక్రమ అరెస్టులను నిరసిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కెటి రామారావు మరి కొద్ది సేపట్లో దీక్ష చేపట్టనున్నారు.

No comments:

Post a Comment