
రాయల తెలంగాణ తన ప్రతిపాదన కాదని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ స్పష్టం చేశారు. తన మాటలను మీడియా వక్రీకరించిందని ఆయన అన్నారు. శనివారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది తన అభిప్రాయమని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాము గ్రేటర్ రాయలసీమ కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఒకవేళ రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే రాయలసీమకు భారీ ప్యాకేజీ ఇవ్వాలని, లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ కావాలని తాను ఎప్పుడూ కోరలేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్ర కోసం తమ ప్రాంతం లక్ష కోట్ల రూపాయలు నష్టపోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర విడిపోతే తమ ప్రాంత నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని ఆయన అడిగారు.
రాష్ట్రం కలిసి ఉండాలని తాము స్పష్టంగా చెబుతున్నామని ఆయన అన్నారు. ఒక వేళ విడగొడితే తమకు ఇస్తారో చెప్పిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. తమ ప్రాంతానికి ఏం ఇస్తారో చెప్తే తాము ప్రజల్లో మాట్లాడుతామని ఆయన అన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను మంత్రి టిజి వెంకటేష్, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.
రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ రాయలసీమలో ఆందోళన ప్రారంభమైంది. రాయల తెలంగాణ ప్రతిపాదనపై కడప జిల్లాకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జి. శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గొంతు విప్పారు. రాయలసీమ తెలంగాణ ప్రతిపాదనను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
No comments:
Post a Comment