Read In Tollywood Latest News

Wednesday, June 27, 2012

గవర్నర్ అభిప్రాయమే కీలకం..!!....

రాష్టప్రతి ఎన్నికల తర్వాత హైకమాండ్ తలపెట్టిన మార్పుల్లో రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఇచ్చిన నివేదిక కీలకం కానున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని మంగళవారం మర్యాద పూర్వకంగానే కలిసినట్టు గవర్నర్ నరసింహన్ చెబుతున్నా, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా పరాజయం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై హైకమాండ్‌కు గవర్నర్ సమగ్ర నివేదిక అందజేసినట్టు తెలుస్తోంది. ‘అధిష్ఠాన వర్గాన్ని కలిసిన సందర్భంగా గవర్నర్ నివేదికను ఇచ్చి ఉంటారనే విశ్వసిస్తున్నా. ఒకవేళ గవర్నర్ చెప్పినట్టు ఎటువంటి నివేదిక ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై సోనియాకు ఆయన అభిప్రాయాన్ని కచ్చితంగా వివరించి ఉంటారు. హైకమాండ్ తలపెట్టిన మార్పుల్లో గవర్నర్ అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎవరెన్ని నివేదికలు ఇచ్చినా వాటిని అధిష్ఠానం పెద్దగా పట్టించుకోదు’ అని రాష్ట్ర మంత్రి ఒకరు   చెప్పారు. గవర్నర్ వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే అధిష్ఠానం మార్పులు తలపెట్టవచ్చు అని ఆయన అన్నారు.
గవర్నర్ బిజీబిజీ
ఇదిలావుంటే, రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మంగళవారం బిజీబిజీగా గడిపారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, హోమ్‌మంత్రి చిదంబరం రాష్టప్రతి పదవికి పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. దీంతో గవర్నర్ జరిపిన సమావేశాల పర్యవసానంపై పలు ఊహాగానాలు తలెత్తాయి. ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మొదటిసారి ఢిల్లీకి వచ్చిన గవర్నర్ రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక అందచేశారన్న ప్రచారం జరుగుతోంది. గవర్నర్ నరసింహన్ నెలలో ఒకటి రెండుసార్లు ఢిల్లీకి వచ్చి ప్రభుత్వంలో కీలక నిర్ణయ పాత్రధారులను కలవటం పరిపాటి. అయితే తాను ఎవరికీ ఎలాంటి నివేదిక ఇవ్వలేదనీ, మర్యాద పూర్వకంగానే అందరినీ కలిసినట్టు నరసింహన్ చెప్పుకొచ్చారు.
అయితే, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలి, మంత్రుల పని తీరు గురించి హైకమాండ్‌కు గవర్నర్ వివరించినట్టు తెలిసింది. ప్రభుత్వ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఉప ఎన్నికల ఫలితాలపై కిరణ్, బొత్స, మరికొందరు ప్రముఖులు ఇప్పటికే హైకమాండ్‌కు నివేదికలు అందించారు. అయితే వారిచ్చిన నివేదికల కంటే గవర్నర్ నివేదికకే అధిష్ఠానం ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిసింది.
కాగా, రాష్టప్రతి ఎన్నికల తర్వాత మార్పులు ఖాయమని అనుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. అధిష్ఠానాన్ని కలిసి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, రెవిన్యూ మంత్రి రఘువీరారెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. వారు కూడా అధిష్ఠానాన్ని కలుసుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో మూడు రోజులపాటు మకాం వేసి సోనియాను, ఇతర కాంగ్రెస్ పెద్దల్ని కలిసిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ నగరానికి తిరిగి వచ్చారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న నాయకులు, తమ పదవుల్ని కాపాడుకునేందుకు మంత్రులు, మార్పులు తలపెడితే మంత్రి పదవుల కోసం కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానాన్ని కలుసుకుంటున్నారు. రాష్టప్రతి అభ్యర్థిగా యూపీఏ తరఫున ఎంపికైన ప్రణబ్‌ముఖర్జీకి అభినందనలు తెలిపే సాకుతో ఢిల్లీ వెళుతున్న నేతల ప్రధాన అజెండా మాత్రం అధిష్ఠానాన్ని కలవడమేనని తెలిసింది.

No comments:

Post a Comment