రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఎలా ఉందో, రాష్ట్ర బడ్జెట్ కూడా అదే మాదిరి గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా ఎప్పుడూ బడ్జెట్ ఎప్పుడూ గందరగోళంగానే ఉంటుంది. సామాన్యుడికి అర్ధం కాకుండా, పెద్ద, పెద్ద అంకెలతో ఊదర కొట్టడమే బడ్జెట్ లక్ష్యంగా కనబడుతుంది. ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏమి కొత్త దనం ఉంది? మన రాష్ట్రం ఏదైనా కొత్త దిశకు, దశకు తీసుకువెళ్లగలిగే పరిస్థితికి ఈ బడ్జెట్ దర్పణం పట్టిందా అంటే దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే స్వయంగా ఇది రాబడులు, ఖర్చుల లెక్కే అని తేల్చేశారు. నిజానికి బడ్జెట్ అన్నది ఒక వ్యూహ పత్రంగా, భవిష్యత్తు విదాన పత్రంగా, రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసే బడ్జెట్ గా ఉండాలి. కాని దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకులుగాని, మన బ్యూరోక్రాట్లు కాని ఆ దిశలో ఆలోచన చేయడం లేదనే చెప్పాలి. నిజమే. రాజకీయ పార్టీలు తమ మానిఫెస్టోలలో ఉన్న వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్ లను ప్రవేశపెడతాయి. కాని కాలం గడిచే కొద్దీ రాజకీయ పార్టీలు కేవలం ఓట్లను ఆకర్షించే కొన్ని తాయిలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర అభివృద్దికి దోహదపడే దీర్ఘకాలిక అంశాలను సీరియస్ గా తీసుకోవడం లేదు. అప్పుడప్పుడు జీరో బేస్ డ్ బడ్జెట్ అని, లేదా అన్ని శాఖలను పూర్తిగా సమీక్షించి అవసరాలను కొత్తగా గుర్తించడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కాని లాబీయింగ్ రాజకీయాలకు అవేవి సఫలం కాలేదు. ఎక్కడ ఏ శాఖలో కోత పెట్టినా అదే ప్రధాన వివాదంగా మారే పరిస్థిని రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నాయి. దాంతో ప్రభుత్వంలో ఉన్నవారు వాటి జోలికి వెళ్లలేకపోతున్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో 92799 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో కేవలం పదకుండు శాతం మాత్రమే పెట్టుబడి వ్యయంగా ఉంది. అంటే మన రాష్ట్రంలో ఆదాయం పెరిగినా, ఆస్తుల సృష్టికి, తద్వారా ఉపాధి పెంపుదలకు సరైన ప్రయత్నం జరగడంలేదని అర్ధం చేసుకోవచ్చు. మన వాళ్లు ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రజాకర్షక స్కీమ్ ను ఆరంభిస్తే దానికి ఒక ధీరీ మాత్రం తయారు చేస్తుంటారు. ఉదాహరణకు సబ్సిడీ బియ్యం పధకం కింద సుమారు రెండువేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని సంకల్పించారు. కిలో బియ్యం రూపాయికే సరఫరా చేస్తారు. దీనికి పౌష్టికాహారం పధకం కింద ప్రచారం చేస్తారు. 1983 లో కిలో రెండు రూపాయల పధకాన్ని ఎన్.టి. ఆర్ ప్రకటించినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. కాని అదే సమయంలో నాటి విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం రూపాయి తొంభై పైసలకే కిలో బియ్యం సరఫరా చేస్తామని ప్రకటించి అమలు చేసినా జనం పట్టించుకోకుండా ఎన్.టి. ఆర్. ను గెలిపించారు. కాని 1989 లో టిడిపి ఓడిపోయింది. అప్పట్లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వం 1991 లో కిలో బియ్యాన్ని 3,50 రూపాయలకు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో కూడా సబ్సిడీ భాగాన్ని పెంచరాదని కూడా బావించారు. కాని ప్రతిపక్ష టిడిపి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. 1994 ఎన్నికలకు ముందు ఎన్.టి. ఆర్ మళ్లీ రెండు రూపాయల స్కీమును ఎన్నికల వాగ్దానంగా పెడితే అంతా ఆశ్చర్యపోయారు. కారణం ఏదైమైనా మళ్లీ ఎన్.టి. ఆర్ అదికారంలోకి రావడం దానిని అమలు చేయడం, అదే సమయంలో మద్య నిషేధం కూడా వర్తింప చేయడం వల్ల ప్రభుత్వ రెవెన్యూ సంక్షోభంలో పడింది. తదుపరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పార్లమెంటు ఎన్నికలకు ముందు తామైతేనే కిలో రెండు రూపాయల పధకం అమలు చేస్తామని చెప్పి ప్రచారం చేసినా, ఎన్నికల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో పలు సమావేశాలు ఏర్పాటు చేసి బియ్యం ధర పెంచవలసిన అవసరం, మద్య నిషేదాన్ని సడలించవలసిన పరిస్థితిని తెలియచెప్పారు. తదుపరి కిలో బియ్యం ఐదు రూపాయలకు పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత 1998 లోక్ సభ ఎన్నికలలో టిడిపి దెబ్బతిన్నా, 1999 ఎన్నికలలో బిజెపితో పొత్తు పెట్టుకుని టిడిపి అధికారంలోకి వచ్చింది. అంటే ఎన్. టి ఆర్ కిలో రెండు రూపాయలకు బియ్యం అమలు చేసినా 1989 లో ఓడిపోయారు. చంద్రబాబు నాయుడు బియ్యం రేట్లు పెంచినా 1999 లో గెలవగలిగారు. 2004 నాటికి పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ నేత వై. ఎస్. రాజశేఖరరెడ్డి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ తదితర ఆకర్షణీయమైన నినాదాలు తీసుకురావడం, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి పాదయాత్ర చేయడం వంటి వాటి ద్వారా అధికారంలోకి రాగలిగారు. రాజశేఖరరెడ్డి విప్లవాత్మకంగా ఉచిత విద్యుత్ తో పాటు సాగునీటి ప్రాజెక్టులకు ఎన్నడూ లేని రీతిలో ఏకంగా పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా కొత్త పుంతలు తొక్కారని చెప్పాలి. ఆ రోజులలో చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలన్న వ్యాఖ్య చేసి ఇరుకున పడ్డారు. ఎందుకంటే తర్వాత కాలంలో ఆయన కూడా ఉచిత విద్యుత్ వాగ్దానం చేసినా ప్రజలు పూర్తిగా ఆయనను విశ్వసించలేదు. ఈ స్కీములు మంచివా? కావా అన్న మీమాంస ప్రజలలో రావడం లేదు. రాజకీయ నేతలు ప్రజలను ఓటు యంత్రాలుగా మలచి భ్రమలలో పెడుతున్నారు. అసలు సబ్సిడీలు వద్దని ఎవరూ అనరు. కాని దానికి కొన్ని పరిమితులు లేకపోతే భవిష్యత్తుకు అవసరమైన ప్రాజెక్టుల నిమిత్తం నిదుల సమస్య ఏర్పడుతుంది. అంతేకాదు. వై. ఎస్, రాజశేఖరరెడ్డి ఫీజుల రీయింబర్స్ మెంట్ స్కీము, ఆరోగ్యశ్రీ స్కీము వంటివి అమలు చేయడమే కాక మళ్లీ రెండు రూపాయలకు కిలో బియ్యం పధకాన్ని అమలు చేయడం ఆరంభించారు. అంటే 1983 లో అమలు చేసిన పదకాన్ని వై. ఎస్. మళ్లీ ఆచరణలోకి తెచ్చారన్నమాట. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరో అడుగు ముందుకేసి కిలో బియ్యం రూపాయికే ఇస్తామని ప్రకటించి, దానిని అమలు చేయడం ఆరంభించారు. ఇది నిజంగా ఒకరకంగా ఆత్మహత్య సదృశ్యం వంటిదని చెప్పాలి. కేవలం ఓట్ల కోసం ఇలాంటి పధకాలను ప్రవేశపెడుతున్నారే కాని దాని మంచి, చెడు ఆలోచించడం లేదు. ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న పేదరికంపై ప్లానింగ్ కమిషన్ వేసిన అంచనాల ప్రకారం మన రాష్ట్రంలో కేవలం 15.8 శాతం మంది మాత్రమే పేదలు ఉన్నారు. అయితే పట్టణాలలో మాత్రం 27.5 శాతం పేదలు ఉండగా, గ్రామాలలో కాస్త తక్కువగా ఉన్నారన్నది ఆ లెక్కల సారాంశం. ఇది మన రాష్ట్ర ప్రగతిగా చెప్పుకోవాలి. కాని ఇదే సమయంలో మన ప్రభుత్వం జారీ చేసిన తెల్ల కార్డుల సంఖ్య చూస్తే అవి కోటి ఎనభై లక్షలుగా ఉన్నాయి. పింక్ కార్డులు ముప్పైలక్షల లోపే ఉన్నాయి. ఇవి కాక ఎఎవై స్కీమ్ కింద మరో పదిహేనున్నర లక్షల కార్డులు ఉన్నాయి. అంటే దీనిని బట్టి మన రాష్ట్రంలో ఎనభై ఐదు శాతంమంది పేదరికంలో ఉన్నట్లు లెక్క. దీనిని ఏ విదంగా అర్దం చేసుకోవాలి. ఇది బడ్జెట్ గందరగోళంగా తీసుకోవాలా? వద్దా? ఎప్పుడు రచ్చబండలు జరిగినా లక్షల సంఖ్యలో తెల్లకార్డులు ఇచ్చామని ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంటోంది. ఇక తలసరి ఆదాయం చూస్తే 2010-11 లో 62.912 రూపాయలుగా ఉంటే, తదుపరి సంవత్సరం అది 71.540 రూపాయలుగా ఉంది. ఈ అంకెలను ఎంతవరకు విశ్వసించాలో అర్ధం కాదు. ఎందుకంటే మన ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలే అందుకు ఉదాహరణగా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ది చూస్తే అంతంతమాత్రంగానే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి .1991 నుంచి కొత్త పారిశ్రామిక విధానం అమలులోకి వచ్చాక ఇప్పటివరకు 7346 ప్రతిపాదనలు వచ్చాయి. వాటి విలువ 7,78,494 కోట్లుగా ఉంది. ఇవన్ని అమలు అయితే 13,49,084 లక్షల మందికి ఉపాధి లభించి ఉండాలి. కాని వీటిలో 3132 ప్రతిపాదనలు అమలు చేస్తే పెట్టుబడి మాత్రం 73.588 కోట్లు మాత్రమే వచ్చింది. వీటివల్ల కలిగిన ఉపాధి 478900 అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అలాగే చిన్న, మద్య తరహా పరిశ్రమల అంచనాలు కూడా అందుకు భిన్నంగా లేవు. పరిస్థితి ఈ విధంగా ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ రాజివ్ యువకిరణాల ద్వారా రెండేళ్లలో పద్నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెబుతున్నారు. ఇరవైఏళ్లలో రాని ఉద్యోగావకాశాలు రెండేళ్లలో ఎలా వస్తాయో అర్దంకాదు. వ్యవసాయం రంగం చూస్తే గత సంవత్సరం అంతకుముందు ఏడాది కన్నా ముప్పై లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. కాని సాగు నీటి సదుపాయం కలిగిన విస్తీర్ణం ఇరవైఒక్క లక్షల ఎకరాలు పెరిగిందని చెప్పారు. కాని ఆహారధాన్యాల ఉత్పత్తి అంత భారీగా తగ్గడం ఏమి సూచిస్తుందో చెప్పనవసరం లేదు. ప్రతిష్టాత్మకంగా రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం అత్యంత ఖరీదైనకార్యక్రమంగా మిగిలిపోతుందేమోనన్న ఆందోళన కలుగుతుంది. ఇప్పటివరకు డెబ్బేవేల కోట్లు పైగా ఖర్చు చేసినా గణనీయంగా ఫలితాలు రాలేదు. మొత్తం 97 లక్షల ఎకరాలకు ఉద్దేశించిన 86 ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తి అవుతాయన్న గ్యారంటీ లేదు. పైగా పోలవరం ప్రాజెక్టును వివాదంగా మార్చడానికి కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు అదే సమయంలో ఆచరణ సాధ్యం కాని ప్రాణహిత -.. చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ప్రజలను మోసం చేయడానికి అందరూ కృషిచేస్తున్నారు ఆ ప్రాజెక్టుకు అయ్యే సుమారు ఏభై వేల కోట్ల మొత్తాన్ని తెలంగాణ ప్రాంతానికి కేటాయించి, ఎక్కడకక్కడ చిన్న, మద్య నీటి పారుదల స్కీములను అమలు చేయడం మంచిదని అందరికి తెలిసినా, దాని గురించి ఆలోచించరు. ఎందుకంటే ప్రజలను మోసం చేస్తూ, తమను తాము మోసం చేసుకోవడంలో మన రాష్ట్ర నేతలు బిజీ అయిపోతున్నారు. అది మన దురదృష్టం. ఇక్కడే మనకు నాయకత్వ లోపం ఎదురవుతోంది. విద్యుత్ రంగం తీసుకోండి. కొత్త ప్లాంట్ లు వస్తుంటే ధర్నాలకు నేతలే నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో కూడా ముడుపుల గొడవలు ఎక్కువగానే ఉంటున్నాయి. అదే సమయంలో గంటల తరబడి కరెంటు కోతలు అనుభవించాల్సి వస్తున్నా ఎవరికి కనికరం కలగడం లేదు. దీనిపై బడ్జెట్ లో స్పష్టమైన విధానం ఉన్నట్లు కనిపించదు. కరెంటు కోత వల్ల పరిశ్రమలు మరింత దెబ్బతినబోతున్నాయి. ఇక ఎస్.ఇ. జడ్ ల గురించి చూస్తే 75 ఎస్.ఇ. జడ్ లు ఉంటే ఇప్పటికి ఇరవై ఏడు మాత్రమే అమలులోకి వచ్చాయి. ఎనిమిదిన్నర లక్షల మందికి ఉపాధి కలుగుతుందని భావిస్తే ఇంతవరకు లక్ష ఐదు వేల మందికే ఉద్యోగాలు వచ్చాయి. అయితే ఒకే ఒక రంగంలో మనం మంచి ప్రగతి సాధించాం. మన రాష్ట్రం నుంచి జరుగుతున్న ఎగుమతులలో నలభై తొమ్మిది శాతం ఐటి రంగం నుంచే జరుగుతున్నాయి. ఇది బాగానే ఉన్నా, గత రెండేళ్లుగా ఈ రంగం కూడా బాగా దెబ్బతింది. ప్రాంతీయ ఉద్యమాలు, ఇ తర రాజకీయ సమస్యలు ప్రభావితం చేస్తున్నాయి. దీని గురించి బడ్జెట్ లో విశ్లేషణ ఉన్నట్లు కనబడదు. ఇక అప్పులు కూడా లక్షా అరవైవేల కోట్లకు చేరుకోవడం కూడా అంత మంచి పరిణామం కాదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. వివిధ కారణాల వల్ల మన రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగింది. లక్షా నలభై ఐదు వేల కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టడంలో కొంత అతిశయోక్తి ఉండవచ్చన్న భావన ఉన్నా, లక్ష ఇరవై వేల కోట్ల వరకు బడ్జెట్ అమలు జరిగినా అభినందించాల్సిందే. ఈ ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమంలో ఒకటైన రాజివ్ యువకిరణాలకు కూడా భారీగానే కేటాయింపులు జరిపారు. అంతవరకు బాగానే ఉంది. కాని నిర్దిష్ట ప్రయోజనం అమలు జరిగేలా చూడకపోతే ఈ నిధులన్నీ వృధా అయిపోతాయన్న విషయాన్ని నేతలు గుర్తించుకోవాలి. మన ప్రభుత్వాలు ఇటీవలికాలంలో ఓట్ల యావలో పడి అన్ని వర్గాలను ఆకట్టుకోవాలన్న ఉద్దేశంతో అనేక పధకాలను ఆరంభించి నోరు వెళ్లబెడుతున్నాయి. అందువల్లనే ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగాన్ని చదివి ఆయనే స్వల్ప అస్వస్థతకు గురి కావల్సి వచ్చింది. గంటన్నర ప్రసంగానికే ఆయన ఇబ్బంది పడితే, ఏళ్లతరబడి ప్రజలు ఉద్యమాలతో సతమతమవుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకుండా వ్యూహం లేకుండా కేవలం జమా, ఖర్చుల పత్రంగా బడ్జెట్ ను పరిగణిస్తే ఇంతకంటే గొప్పగా బడ్జెట్ ఎలా ఉంటుంది?
No comments:
Post a Comment