రాజకీయ పార్టీలకు సాధారణంగా అదికారమే పరమావధి అవుతుంది. తద్వారానే ప్రజలకు
సేవ చేయడం గాని, తమ విదానాలను అమలు చేయడం గాని జరుగుతుందని రాజకీయ పార్టీలు
భావిస్తాయి. రాజకీయ పార్టీలు అధికారానికి దూరంగా ఉంటే సుదీర్ఘకాలం మనగలగడం
కష్టం అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇది ఒక అత్యంత ముఖ్యమైన విషయం. దీనివల్ల
ప్రజాస్వామ్య స్పూర్తికి కొంత విఘాతం కలుగుతున్నా, మన దేశంలో ఉన్నది
మెజార్టీ ప్రజాస్వామ్యమేకాని, దామాషా ప్రజాస్వామ్యం కాకపోవడం వల్ల
రాజకీయపార్టీలు ఎలాగైనా అదికారానికి చేరువకావాలని తహతహలాడుతుంటాయి.
రెండోసారి కూడా రాష్ట్రంలో అధికారాన్ని సాధించలేకపోయిన తెలుగుదేశం పార్టీ
రెండువేల పద్నాలుగు నాటికి ప్రభుత్వంలోకి రావాలని విశ్వప్రయత్నం
చేస్తోంది.ఆ దిశగా ఆ పార్టీ అధినేత చర్యలు తీసుకుంటున్నారు.ఏ ఒక్క
అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు వెళ్లడానికి చంద్రబాబు వ్యూహరచన
చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు దూకుడు విధానాన్ని
అవలంభిస్తున్నట్లు కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ తనపై ఇలాంటి వైఖరి
అనుసరించడం ద్వారానే గెలవగలిగిందని ఆయన నమ్ముతున్నట్లు ఉన్నారు. అందుకే గత
కొంతకాలంగా చంద్రబాబు బాగా ధాటిగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా దివంగత
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిపై, ఆయన పాలన విధానాలపై, అలాగే ఆయన కుమారుడు
జగన్ పై విరుచుకుపడుతున్నారు. అలాగే తన వియ్యంకుడు బాలకృష్ణను ఎన్.టి.ఆర్
కుటుంబ ప్రతినిధిగా, తన మద్దతుదారుడిగా జనంలో కనిపించేలా చేస్తున్నారు.
ఒకవైపు తెలంగాణలో టిఆర్ఎస్ ను, మరో వైపు కోస్తా,రాయలసీమలలో జగన్ ను కట్టడి
చేయడానికి ఇదొక్కటే మార్గమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. జగన్ వయసు
చూస్తే చంద్రబాబు కన్నా చాలా చిన్నవాడు. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి జీవించి
ఉంటే ఆయనతో పోరు సమ ఉజ్జీగా ఉండేది. కాని అనూహ్య పరిణామాలలో జగన్ రాజకీయ
పార్టీని స్థాపించి ప్రజల సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రయత్నాలను
తెలుగుదేశం జాగ్రత్తగా గమనిస్తోంది.ఆయనను కౌంటర్ చేయకపోతే తనకు బిజెపి
అగ్రనేత ఎల్.కె. అద్వాని మాదిరి రాజకీయంగా వెనుకబడి వస్తుందని చంద్రబాబు
నాయుడు అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన పార్టీ నాయకుల వద్ద
ప్రస్తావిస్తున్నారు. యువనేత, సోనియాగాంధీ కుమారుడు రాహుల్ గాంధీ తనకన్నా
వయసులో బాగా చిన్నవాడని చెప్పి అద్వాని ఆయన జోలికి వెళ్లలేదని, దాంతో ఆయన
రాజకీయంగా వెనుకబడిపోయారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. తాను అలా
కాదలచుకోలేదని అందుకోసం గట్టిగా పోరాడవలసిందేనని ఆయన అంటున్నారు. అదే సమస్య
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కూడా చంద్రబాబుకు ఉంది. కిరణ్ తండ్రి
అమరనాధరెడ్డితో కూడా చంద్రబాబు చిత్తూరు రాజకీయాలలో పోరాడారు. ఇప్పుడు
కిరణ్ ను రాజకీయంగా ఎదుర్కోవలసి వస్తున్నది. దీనిని పూర్తిగా అవగాహన
చేసుకున్న చంద్రబాబు రాజకీయాలలో వయసుతో నిమిత్తం లేదన్న నిర్ణయానికి
వచ్చారు.అందుకే కిరణ్,జగన్ లపై ఘాటైన వ్యాఖ్యలు ఆయన చేయడం ఆరంభించారు.
అంతేకాక వై.ఎస్.జమానాను కూడా వదిలిపెట్టడం లేదు. చిత్తూరు జిల్లా పర్యటన
సందర్భంగా వై.ఎస్. పాలనను అడవి పంది తో పోల్చడం, చేలను అడవిపంది
పాడుచేసినట్లుగా వై.ఎస్.రాష్ట్రాన్ని పాడుచేశారని విమర్శించడం ద్వారా
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభిమానులను తీవ్రంగా కోపం తెప్పించారు.దాంతో వారు
చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. సరిగ్గా టిడిపికి కూడా అదే కావాలి.
తమ నాయకుడి బొమ్మలు దగ్దం చేసినవారిపై సహజంగానే టిడిపి శ్రేణులలో ఆగ్రహం ,
వ్యతిరేకత పెరుగుతాయి. దాంతో టిడిపి కార్యకర్తలలో కసి పెరిగి పార్టీ
గెలుపుకోసం గట్టిగా పనిచేస్తారన్నది నాయకత్వ వ్యూహంగా ఉంది.అయితే
ఇప్పటినుంచే ప్రత్యర్ధులను కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా మాట్లాడడం,
వ్యవహరించడం సరికాదని వాదించేవారు కూడా ఉన్నారు. అయితే మాజీ స్పీకర్ యనమల
రామకృష్ణుడు వంటివారు దూకుడు విధానాన్ని గట్టిగా బలపరుస్తున్నారని
అంటున్నారు. అలా ధాటిగా విమర్శలు చేస్తేనే హీరో వర్షిప్ వస్తుందని, తద్వారా
పార్టీని చురుకుగా ఉంచవచ్చన్నది వారి వాదనగా ఉంది.అలాగే తన వియ్యంకుడు
బాలకృష్ణను కూడా చంద్రబాబు ఇప్పటినుంచే ప్రచారపర్వంలో దించారు. బాలకృష్ణ
కూడా విశాఖ జిల్లాలో రెట్టించిన ఉత్సాహంలో పర్యటించి వచ్చారు. పార్టీ
స్థానిక నాయకులతో కలసి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అక్కడ రాజకీయ ప్రసంగం
చేయడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. నట్లు ఎక్కువగా పడ్డాయి. చివరికి
తెచ్చుకున్న పేపర్ చదివడానికి కూడా అవస్థపడ్డారు. అయితే ఆ తర్వాత సినీ
డైలాగులు మాత్రం అనర్ఘళంగానే చెప్పడం విశేషం. దీనినిబట్టి రాజకీయ ఉపన్యాసం
చేయడానికి ఆయన ఇంకా అలవాటు పడవలసి ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవితో
మాత్రం వివాదం పెంచుకుంటూ పోయి, తన అభిమానులను సంఘటితం చేయడానికి
ప్రయత్నించినట్లు కనిపించింది. తన అబిమానులంతా టిడిపి కార్యకర్తలేనని కూడా
ఆయన స్పష్టం చేశారు. బాలకృష్ణను మూడు రకాలుగా ప్రయోగిస్తున్నట్లుగా ఉంది.
ఎన్.టి.ఆర్ కుటుంబ ప్రతినిది బాలకృష్ణ అన్న సంకేతం ఇవ్వడం, సినీ గ్లామర్ ను
వాడుకోవడం, హరికృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్.కు చెక్ పెట్టడం వంటి లక్ష్యాలతో
ఈ పర్యటన సాగినట్లుగా ఉంది.ప్రస్తుతం ఎన్.టి.ఆర్ కుటుంబం చీలిపోయి ఉంది.
ఎన్.టి.ఆర్. పెద్ద కుమార్తె పురంధేశ్వరి , అల్లుడు డాక్టర్ దగ్గుబాటి
వెంకటేశ్వరరావులు కాంగ్రెస్ లో చేరి ప్రజాప్రతినిదులుగా ఎన్నికయ్యారు.
పురందేశ్వరి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. లక్ష్మీపార్వతిని ఎన్.టి.ఆర్
కుటుంబంలో భాగంగా ఒప్పుకోవడానికి ఎవరు సిద్దంగా లేరు.ఆమె సొంతంగా ఒక పార్టీ
పెట్టుకున్నారు. హరికృష్ణ కొంతకాలం చంద్రబాబు కు దూరం అయినా, తదుపరి
పార్టీలో కలిసి రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇప్పుడు మళ్లీ వారిద్దరి మద్య అంతరం
పెరిగింది.గత ఎన్నికలలో పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసిన మరో సినీనటుడు
జూనియర్ ఎన్.టి.ఆర్. కూడా కారణం ఏదైనా పార్టీతో అంటీ , ముట్టనట్లు
ఉంటున్నారు. ఎన్.టి.ఆర్., హరికృష్ణలకు చంద్రబాబుకు మధ్య విబేధాలు రావడానికి
అనేక కారణాలు చెబుతున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ను రాజకీయ
వారసుడుగా ప్రకటిస్తారన్న అనుమానం ముఖ్యంగా కనిపిస్తుంది. మహానాడుకు
ఎన్.టి.ఆర్ రాకపోవడం, హరికృష్ణ వచ్చినా అలిగి వెళ్లిపోయి చికాకు
కలిగించారు. అప్పటినుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. చివరికి జూనియర్
ఎన్.టి.ఆర్ వివాహంలో కూడా అవి ప్రతిబింబించాయని అంటారు. ఆ తర్వాత ఇక లాభం
లేదనుకుని చంద్రబాబు వారికి క్రమేపి దూరం అవడానికే మొగ్గు చూపినట్లు
కనిపిస్తుంది. జూనియర్ ఎన్.టి.ఆర్ భవిష్యత్తుకు ఇది మంచిదా? తెలుగుదేశం
అభిమానులు ఆయన వెంట లేకుండా ఉంటే దాని ప్రభావం ఆయన సినిమాలపై పడదా అన్న
చర్చ కూడా ఉంది.అయినా రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతాయో చెప్పలేం.అయితే
జూనియర్ ఎన్.టి.ఆర్. మాత్రం అటు తండ్రి హరికృష్ణకు, ఇటు చంద్రబాబుకు మధ్య
ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నారని కొందరు అంటున్నారు. దాని
సంగతి ఏమైనా ఈ నేపధ్యంలోనే బాలకృష్ణ రాజకీయాలలో బాగా క్రియాశీలం అయ్యారు.
పైగా శాసనసభకు పోటీచేస్తానని ప్రకటించడం ద్వారా కొత్త కోణాన్ని కూడా
ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడుకు మద్దతుగానే బాలకృష్ణ ప్రచారం
సాగిస్తున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాలకృష్ణ కు జాతకాలపై
నమ్మకం ఎక్కువ . బహుశా ఆయన జోతిష్కం చెప్పించుకునే, రాజకీయాలలో
రాణిస్తానన్న నమ్మకం కలిగిన తర్వాతే ఈ విధంగా చొరవ తీసుకుంటున్నారని పార్టీ
వర్గాలలో భావన ఉంది. అయితే ఇది భవిష్యత్తులో కొత్త సమస్యలకు దారి
తీస్తుందా అన్న చర్చ కూడా లేకపోలేదు. అయితే వీటన్నిటికన్నా ముందుగా
తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వ వైభవం తెప్పించడం వీరి ముందున్న
లక్ష్యంగాఉంది. అందుకే బావ,బావమరిది ఈ దిశగా కృషి చేయడం ఆరంభించారు.
వీరిద్దరూ దూకుడుగా వెళ్లడం పార్టీకి ఉపయోగమా?కాదా? అన్న మీమాంస ఉంది.
బాలకృష్ణ ఎలా మాట్లాడినా ఫర్వాలేదు.కాని చంద్రబాబు కూడా తీవ్రమైన
పరుషపదజాలం వాడడం ఆయనకు సొబగునిస్తుందా అన్నది ప్రశ్న. గతంలో
వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో ఉండగా 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబు
పట్ల కొంత కఠిన భాష వాడేవారు. అది విమర్శలకు దారి తీసేది. దాని ఫలితంగాకూడా
ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గు చూపారన్న అభిప్రాయం కూడా ఉంది.తదనంతరం
రాజశేఖరరెడ్డి తన వైఖరి కొంత మార్చుకున్నారని చెబుతారు. అయితే భాషకు, ఓట్లు
సంబంధం లేదని, అది కేవలం చిన్న విషయమేనని, 1999లో బిజెపితో స్నేహం, వాజ్
పేయి గాలి బాబుకు బాగా కలిసి వచ్చాయన్నది మరో విశ్లేషణ. ఏది ఏమైనా
చంద్రబాబు నాయుడు రికార్డు స్థాయిలో ముఖ్యమంత్రిగాఉండడమే కాకుండా,
ప్రతిపక్షనేతగా కూడా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా కూడా
నమోదయ్యారు.తెలుగుదేశం పార్టీకి కర్త,కర్మ, క్రియ అన్నీ చంద్రబాబే. మొత్తం
పార్టీ వ్యవస్థ అంతా ఆయనపైనే ఆధారపడి ఉంది.ఒక్కమాటలో చెప్పాలంటే పార్టీ
భవిష్యత్తు, తన భవిష్యత్తు , వేలాది మంది పార్టీ నాయకుల, కార్యకర్తల
భవిష్యత్తు కు చంద్రబాబే బాధ్యుడవుతారు. అందువల్లనే ఆయన ఇంతగా
శ్రమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని పట్టాలపైకి తీసుకు రావడం ద్వారా
గమ్యాన్ని చేర్చడానికి ఆయన అన్ని చర్యలు చేపడుతున్నారు. అయితే మాటలతో
దూకుడు పార్టీ కి సరిపోతుందా అన్నది ప్రశ్న. పాత తరం నాయకులలో ప్రజాదరణ
లేనివారి బదులు కొత్త రక్తం ఎక్కించడం, విధానాలలో స్పష్టత తెచ్చుకోవడం
వంటివి కూడా అవసరం. ఒకసారి తన సంస్కరణల వల్లే రాష్ట్రం ఇంతగా అభివృద్ది
చెందిందని చంద్రబాబు చెబుతారు. అందులో కొంత నిజం కూడా ఉంది. కాని ఆ తర్వాత
కాసేపటికి తాను తప్పులు చేశాను క్షమించాలని అంటారు.ఇలాంటి వైరుధ్యాల వల్ల
ప్రజలలో భిన్నమైన సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉంది. ప్రజలలో కాని, పార్టీలో
కాని చంద్రబాబు పట్ల కొంత నమ్మకం, మరికొంత అపనమ్మకం ఉన్నాయి. నమ్మకం
పెంచుకుంటూ అపనమ్మకం పోగొట్టుకునే దిశగా ఆయన ముందుకు సాగాలి. పార్టీని
ప్రక్షాళన చేసుకోవడం, కొత్త రక్తం ఎక్కించడం, కొత్త విధానాలు, సరికొత్త
నినాదాలతో వెళ్లగలిగితేనే ఏ రాజకీయ పార్టీకైనా సుదీర్ఘ భవిష్యత్తు
ఉంటుంది. అది తెలుగుదేశం కైనా, మరే పార్టీకైనా వర్తిస్తుంది.
No comments:
Post a Comment