
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పైన రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితికి వారిద్దరే కారణమని, తక్షణమే వారిద్దరినీ పిలిచి వ్యవహార శైలిని మార్చుకోవాలని ఆదేశించాలని, అలా జరగని పక్షంలో పార్టీ కోలుకోవడం కష్టమని అధిష్టానానికి చిరు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.
నాయకత్వ స్థానాల్లో వ్యక్తులను మార్చినంత మాత్రాన పార్టీ బాగుపడుతుందని కూడా తాను భావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారట. ఇటీవల చిరంజీవి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని, పలువురు సీనియర్లను కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు పార్టీ దుస్థితి, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారని తెలుస్తోంది.
కిరణ్, బొత్సలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, ఒకరంటే మరొకరికి పడటం లేదని, మిమ్మల్ని కలిసి రాష్ట్ర పరిస్థితి వివరించే సమయంలో ఎవరికి వారుగానే వస్తూ ఫిర్యాదులు చేసుకుంటున్నారే తప్ప కలిసి రావడం లేదని సోనియా దృష్టికి చిరు తీసుకు వెళ్లారట. దీనివల్ల రాష్ట్రంలో పార్టీ చీలిపోయిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నాయని, ఇది పార్టీని దెబ్బ తీస్తోందని చెప్పారట.
నాయకత్వ మార్పు అంశంపై సోనియా ప్రశ్నించినప్పుడు వ్యక్తులను మార్చినంత మాత్రాన పార్టీ బాగుపడుతుందనుకోవడం సరికాదని, నాయకత్వ మార్పు కంటే వాళ్లిద్దరి మైండ్ సెట్ మార్చడం అవసరమని, వారిని పిలిచి కలిసి పని చేయాల్సిందిగా సూచించాలని, పార్టీ కోసం పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ విషయంలో తక్షణమే పార్టీ నిర్ణయాన్ని ప్రకటించాలని కూడా కోరారట.
No comments:
Post a Comment