Tuesday, September 4, 2012

షిండేతో సీమాంధ్ర ఎంపిల భేటీ....

 Seemandhra Mps Meet Sushil Kumar Shinde

తెలంగాణ అగ్గి రగులుకుంటున్న నేపథ్యంలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మెల్లగా పావులు కదుపుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వారు మంగళవారంనాడు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీససుకోవాలని వారు ఆయనను కోరారు. ఈ నిర్ణయాన్ని వెల్లడించడంలో జాప్యం చేయకూడదని వారు చెప్పారు. సుశీల్ కుమార్ షిండేను కలిసినవారిలో కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ తదితరులు ఉన్నారు. రేపు బుధవారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కూడా కలుస్తామని వారు చెప్పారు.

ఇదిలావుంటే, తెలంగాణ జెఎసి నేతలు కోదండరామ్ నేతృత్వంలో కేంద్ర మంత్రి వాయలార్ రవిని కలిశారు. తెలంగాణకు అనుకూలంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ఈ నెల 30వ తేదీన భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని వారు వాయలార్ రవికి చెప్పారు. మరోవైపు, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్ష తెలంగాణ అంశంపై దూకుడును సూచిస్తోంది.

బిజెపి చేపట్టిన కార్యక్రమం మంగళవారం ఉద్రిక్తతకు కూడా దారి తీసింది. ఎన్‌డిఎ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి నిర్ణయం తీసుకుంటుందని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ చెప్పారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు తెలంగాణ ఏర్పాటుకు ఎన్డీయె పక్షాలన్నీ సమర్థిస్తాయని ఆయన అన్నారు.

రాష్ట్రంలో సిపిఐ తెలంగాణ పోరు యాత్ర చేపట్టింది. దానికి మంచి స్పందన వచ్చిందనే సంతృప్తితో సిపిఐ నాయకత్వం ఉంది. కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో తెలంగాణపై, కాంగ్రెసులో తెలంగాణ విలీనంపై మాట్లాడేందుకే ఆయన ఢిల్లీ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణపై కీలకమైన నిర్ణయం వెలువడుతుందని భావించిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు క్రియాశీలకంగా మారారు. ఇటీవల కావూరి నివాసంలో జరిగిన విందు సమావేశంలో కూడా కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్ర కోసం ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై కేంద్రం నుంచి ప్రకటన వెలువరింపజేసేందుకు వారు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

No comments:

Post a Comment