Friday, August 17, 2012

కెసిఆర్ కాంగ్రెసును టార్గెట్ చేస్తారా?...

 Will Kcr Target Congress
తెలంగాణ అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసు పార్టీని టార్గెట్ చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని తనకు సంకేతాలు అందాయని చెబుతూ వస్తున్న కెసిఆర్ కాంగ్రెసు తగిన నిర్ణయం తీసుకోకపోతే ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి, కాంగ్రెసుకు అనుకూలంగానే కెసిఆర్ వ్యవహరిస్తున్నారనే సందేహాలు చాలా వరకు ఉన్నాయి. ఆ సందేహాలను తీర్చడానికి ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఏమీ లేవు. అయితే, తెలుగుదేశంపై మాత్రం ఆయన విమర్శలను తగ్గించారు.
తెలంగాణపై ప్రకటనకు కాంగ్రెసుకు ఆయన విధించిన గడువు సమీపిస్తోంది. కాంగ్రెసు తెలంగాణపై సానుకూలమైన ప్రకటన ఈలోగా చేస్తుందనే నమ్మకం ఎవరికీ లేదు. ఒకవేళ అలాంటి ప్రకటన చేస్తే అది అత్యంత ఆశ్చర్యకరమైన విషయమే అవుతుంది. కెసిఆర్ చేపట్టబోయే ఉద్యమం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా వుంటే, తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు మాటలను బట్టి చూస్తే ఆ పార్టీ కాంగ్రెసును లక్ష్యం చేసుకుని దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సెప్టెంబర్ మొదటివారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై స్పష్టత ఇస్తారని, అవసరమైతే మరోసారి కేంద్రానికి లేఖ రాస్తారని అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా సినీ హీరో నందమూరి బాలకృష్ణ మాట్లాడడం కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులకు కొత్త ఆశలు కల్పిస్తోంది. ఈ స్థితిలో కెసిఆర్ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసే అవకాశాలు తక్కువే ఉంటాయి.

మరోవైపు, తెలంగాణ విషయంలో కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కెసిఆర్‌తో విభేదిస్తున్నారంటూ తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై వార్తలు వస్తున్నాయి. కోదండరామ్ తెరాసకు మాత్రమే కట్టుబడి ఉండకుండా ఇతర శక్తులను కలుపుకుని వెళ్లడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.కోదండరామ్, ఇతర జెఎసి నాయకులతో కలిసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణను కలిశారు. పరస్పరం సహకరించుకోవడానికి ఇరువురు నేతలు ఓ అవగాహనకు వచ్చారు.

బిజెపి కూడా ఇంకా తెలంగాణ జెఎసిలోనే ఉంది. బిజెపితో కూడా తెలంగాణ జెఎసి కలిసి పనిచేసే అవకాశాలున్నాయి. దీంతో తెలంగాణ జెఎసి తెరాసకు మౌత్ పీస్ అనే ముద్రను తొలగించుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి సమాయత్తమవుతున్నట్లు అర్థమవుతోంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుడు కె. కేశవరావు, తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకేసారి స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో సమావేశం కావడం కూడా కొత్త సమీకరణాల సంకేతాలను అందిస్తోంది.

తాను మాత్రమే తెలంగాణ ఛాంపియన్‌గా ఉండాలని భావించే కెసిఆర్ ఈ అన్ని ప్రయత్నాలు ఎదుర్కోవడానికి మాత్రమే పని చేయవచ్చు. వాటికన్నా దీటుగా తాను ముందుకు వెళ్లడానికి వ్యూహరచన చేయవచ్చునని అంటున్నారు. ఆయన వ్యూహరచన కాంగ్రెసును టార్గెట్ చేసుకునేలా ఉంటుందని చెబుతున్నారు. ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment