Wednesday, July 18, 2012

తెలంగాణపై తేల్చాల్సిందే: మంత్రుల కమిటీతో ఎమ్మెల్యేలు......


 Mlas Want Solve Telangana Issue
తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాలని కాంగ్రెసు శాసనసభ్యులు మంత్రుల కమిటీకి సూచించారు. పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను తీసుకోవడానికి మంత్రుల కమిటీ బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో సమావేశమైంది. ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసి, గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి, నివేదిక సమర్పించడానికి మంత్రి ధర్మాన ప్రసాద రావు తదితరులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఓ కమిటీని వేశారు.

మంత్రులు తమను పట్టించుకోవడం లేదని శాసనసభ్యులు కమిటీకి ఫిర్యాదు చేశారు. మంత్రులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సందర్భాలున్నాయని వారన్నారు. నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రచారం బాగా లేదని వారు చెప్పారు. పలు సమస్యలను శాసనసభ్యులు మంత్రుల కమిటీ దృష్టికి తెచ్చారు.

పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కష్టపడి పార్టీ కోసం పనిచేసేవారికి నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఇవ్వాలని వారు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గురించి చర్చ జరిగింది. ఎస్సీలకు ఇచ్చిన ప్రాధాన్యం ఎస్టీలకు ఇవ్వడం లేదనే అభిప్రాయం కూడా సమావేశంలో వ్యక్తమైంది. మంత్రుల కమిటీ ప్రస్తుతం అభిప్రాయ సేకరణ జరుపుతోంది.

అభిప్రాయాలను సేకరించి, ఆ తర్వాత మంత్రుల కమిటీ సమీక్షిస్తుంది. ప్రభుత్వ పథకాలపై కూడా సమీక్ష చేస్తుంది. అన్నింటినీ కలిపి మంత్రుల కమిటీ ముఖ్యమంత్రికి ఓ నివేదిక సమర్పిస్తుంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వడానికి మంత్రుల కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ మధ్య కమిటీ తరుచుగా సమావేశమవుతోంది.

No comments:

Post a Comment