Thursday, July 19, 2012

ధిక్కరించిన ఐదుగురు ఎమ్మెల్యేలు, బాబుకు గడ్డు కాలమే...........


 Five Mlas Revolt On Chandrababu
రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఐదుగురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ధిక్కరించారు. రాష్టపతి ఎన్నికల్లో ఓటింగుకు దూరంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించగా ఐదుగురు శాసనసభ్యులు ఓటు వేశారు. చిన్నం రామకోటయ్య, కొడాలి నాని, బాలనాగిరెడ్డి, హరీశ్వర్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి గురువారం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు.

ఓటు వేసిన ఐదుగురు శాసనసభ్యుల్లో చిన్నం రామకోటయ్య, కొడాలి నాని, బాల నాగిరెడ్డి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. హరీశ్వర్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి మాత్రం తెలంగాణ నగారా సమితి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డితో కలిసి పిఎ సంగ్మాకు ఓటేశారు. చిన్నం రామకోటయ్య గత కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన తొలుత జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే, అక్కడ తన షరతులకు ఆమోదం లభించకపోవడంతో కాంగ్రెసు పార్టీకి దగ్గరయ్యారు. ఆయన ఓటు వేయడానికి కూడా కాంగ్రెసు శాసనసభ్యులతో కలిసి వచ్చారు.

ఇదిలా వుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, అధ్యక్షుడు వైయస్ జగన్‌ను కలిసినందుకు గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. చిన్నం రామకోటయ్యపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్దపడుతోంది. కొడాలి నాని నియోజకవర్గం గుడివాడకు, చిన్నం రామకోటయ్య నియోజకవర్గం నూజివీడుకు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీలను కూడా నియమించింది. బాలనాగిరెడ్డి మాత్రం చాలా కాలంగా వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది.
ఇక, తెలంగాణపై చంద్రబాబు వైఖరిని హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి వ్యతిరేకిస్తూ నాగం జనార్దన్ రెడ్డితో కలిసి నడుస్తున్నారు. వీరిపై పార్టీ ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలకు కూడా పూనుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, చంద్రబాబుకు గడ్డు కాలం ఎదురైనట్లే ఉంది.

పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను ఎంతగా గాడిలో పెట్టాలని ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. ఎప్పటికప్పుడు పార్టీలో అసమ్మతి చెలరేగుతూనే ఉన్నది. మరోవైపు, నందమూరి, నారా వారి కుటుంబాల మధ్య వారసత్వ పోరు కూడా చంద్రబాబుకు తలనొప్పిగానే ఉందని అంటున్నారు.

No comments:

Post a Comment