Thursday, July 5, 2012

జగన్ మీడియా ఆస్తుల జప్తునకు మరోసారి పిటిషన్...........

 Cbi Files Petition Attachment Sakshi Media
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా ఆస్తుల అటాచ్‌మెంట్ కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) గురువారం మరోమారు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జగన్‌కు సంబంధించిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, జననీ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కంపెనీల ఆస్తుల అటాచ్‌‍మెంట్ కోరుతూ సిబిఐ కోర్టులో ఈ రోజు పిటిషన్ దాఖలు చేసింది.
వివిధ జిల్లాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుండి జగతి, జననీ, ఇందిరాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరించిన సిబిఐ తన పిటిషన్‌లో పొందుపర్చి కోర్టుకు సమర్పించింది. గతంలో ఇదే పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. పిటిషన్‌లో తప్పులు ఉన్నాయని వ్యాఖ్యానిస్తూ కోర్టు అప్పుడు అటాచ్‌మెంట్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడు వాటిని సవరించి దాఖలు చేశారు. మరోవైపు ఎమ్మార్ కేసులో నిందితులు సునీల్ రెడ్డి, కోనేరు ప్రసాద్‌ల ఆస్తుల అటాచ్‌మెంట్ కోసం కూడా సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది.
కోనేరు, సునీల్ రెడ్డిలకు సంబంధించి సుమారు 50 ఆస్తులను సిబిఐ గుర్తించినట్లుగా తెలుస్తోంది. కోనేరు ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులకు విశాఖపట్నం, విజయనగరం, భీమునిపట్నం, భోగాపురం, సబ్బవరంలలో, సునీల్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు మహబూబ్‌నగర్, కడప, హైదరాబాదులలో ఆస్తులు ఉన్నట్లుగా సిబిఐ గుర్తించింది.
కాగా వైయస్ జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ కోసం గత మే నెలలో సిబిఐ అధికారులు సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం అనుమతి తెలిపిన మీదట పిటిషన్‌లో పేర్కొన్న జగన్ ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధం అమలవుతుంది. ఆస్తులన్నీ సివిల్ కోర్టుకి అటాచ్ అవుతాయి.
అలాగే జగన్ సన్నిహితులు, ఎమ్మార్ కేసు నిందితులైన సునీల్ రెడ్డి, కోనేరు ప్రసాద్ ఆస్తులు సైతం న్యాయస్థానం అదుపాజ్ఞల్లో దఖలు పడతాయి. అయితే, సిబిఐ పిటిషన్ విషయంలో సాక్షి మీడియాకు అప్పుడు ఊరట లభించింది. సిబిఐ పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు తోసిపుచ్చింది. తాజాగా సిబిఐ వాటిని సవరించి మరోసారి పిటిషన్ దాఖలు చేసింది.

No comments:

Post a Comment