Friday, July 13, 2012

ఎమ్మెల్యేపై దాడికి ఇసుకమాఫియా యత్నం, బెదిరింపు.........


 Sand Mafia Attacks Mla Dayakar Reddy
మహబూబ్‌నగర్: జిల్లాకు చెందిన మక్తల్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దయాకర్ రెడ్డిపై ఇసుక మాఫియా దాడి చేసేందుకు ప్రయత్నాలు చేసింది. శుక్రవారం ఇసుక మాఫియాను అడ్డుకోబోయిన ఎమ్మెల్యేపై వారు దాడి చేశారు. ఈ సంఘటనకు నిర్ఘాంత పోయిన ఎమ్మెల్యే ఆ తర్వాత దేవరకద్ర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా దయాకర రెడ్డి మాట్లాడారు.

జిల్లాలో ఇసుక మాఫియా విషయాన్ని తాను స్పీకర్ నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టవలసి ఉందని చెప్పారు. ఉదయం కర్నాటక వైపు నుండి వస్తున్న రెండు లారీలను ఎమ్మెల్యే తనిఖీ చేసే ప్రయత్నాలు చేశారు. అందులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని భావించారు. అయితే దయాకర్ రెడ్డి ఎమ్మెల్యే అని తెలియని ఇసుక మాఫియా ఆయనపై దాడి చేసే ప్రయత్నాలు చేసింది. ఆయనపై బెదిరింపులకు దిగింది.

దయాకర్ రెడ్డి అనుచర వర్గం వెంటనే స్పందించింది. ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు కలుగ జేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇసుక మాఫియా ఏకంగా ఎమ్మెల్యే పైనే బెదిరింపులకు పాల్పడటం చర్చనీయాంశమైంది.

ఈ సంఘటనతో ఇసుక మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నట్లుగా అర్థమవుతోందని అంటున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది అంటన్నారు. రవాణాను అడ్డుకున్న వారిపై పథకం ప్రకారం మాఫియా దాడి చేస్తోందని అంటున్నారు. ఈరోజు కూడా ఎమ్మెల్యేపై ఆయన ఎవరో తెలియక అలాగే దాడి చేశారని అంటున్నారు. కాగా ఇసుక మాఫియాపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment