Thursday, July 12, 2012

అల్లుడిగా వస్తే రాహుల్‌కు 15 కోట్లు: శాంతి శర్మ.......


 Rahul Gandhi Offered Rs 15 Crore Dowry
ఎఐసిసి ప్రధాన కార్యదర్శి అల్లుడిగా వస్తానంటే ఎవరు మాత్రం కాదంటారు. కానీ, తనకు రాహుల్ గాంధీయే అల్లుడిగా రావాలని, తన బిడ్డను పెళ్లి చేసుకోవాలని, అందుకు రాహుల్ గాంధీకి 15 కోట్ల రూపాయల వరకట్నం ఇస్తానని ఓ మహిళ అంటోంది. ఈ ఆసక్తికరమైన సంఘటనను మొట్టమొదటి సారి మిడ్డే టాబ్లాయిడ్ వార్తాకథనంగా ప్రచురించింది. రాహుల్ గాంధీని అల్లుడిగా కోరుకుంటూ ఓం శాంతి శర్మ అనే మహిళ ఈ నెల 9వ తేదీ నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు దిగింది.

ఓం శాంతి శర్మ మౌనవ్రతం పట్టింది. తన కూతురికి సరైన భర్తను చూపించాలని ఆమె భగవంతుడిని మౌనంగా ప్రార్థిస్తోంది. అయితే, తన కూతురికి భర్తగా రాహుల్ గాంధీ తప్ప మరొకరు అవసరం లేదని అంటోంది. ఆమె పెదవి విప్పి మాట్లాడకపోయినప్పటికీ ఆమె వెనక ఉన్న ప్లకార్డు ఆమె ఆకాంక్షను తెలియజేస్తోంది. రాహుల్ గాంధీ సే అప్నీ బేటీకీ కే రిస్తే కీ మాంగ్ (రాహుల్ గాంధీతో నా కూతురు సంబంధం కోసం) అంటూ అసలు విషయాన్ని తెలియజేస్తూ దీక్ష చేస్తోంది.

తన కోరికను అంగీకరిస్తే కట్నంగా రాహుల్ గాంధీకి 15 కోట్ల రూపాయలు ఇస్తానని కూడా ప్లకార్డు మీద రాసి ఉంది. శర్మ రాజస్థాన్‌కు చెందిన మహిళ అని, తన అత్తవారింటి, కుటుంబం ఆస్తిలో ఆమె వాటాను కోరుతున్నట్లు కూడా ప్లకార్డు తెలియజేస్తోంది. జంతర్ మంతర్ వద్ద దీక్షలో ఉన్న మరో వ్యక్తి సంతోష్ మూరత్ సింగ్ - ఆమె మౌనదీక్ష పట్టిందని, ఆమె మాట్లాడదని, ఏమైనా చెప్పడానికి కాగితం రాయదని, ప్రార్థన కోసం మాత్రమే ఇక్కడ ఆమె కూర్చుందని అంటున్నాడు.

ఓం శాంతి శర్మకు మతి స్థిమితం లేకపోవచ్చునని పోలీసులు అంటున్నారు. దీక్ష కోసం ముందస్తు అనుమతి తీసుకోలేదని, దరఖాస్తు కూడా పెట్టుకోలేదని వారు చెబుతున్నారు.

No comments:

Post a Comment