
తమ పార్టీ అధ్యక్షుడు, తన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 15 రోజుల్లో జైలు నుంచి బయటకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ బయటకు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని ఆమె చెప్పారు. బుధవారం కడప జిల్లాలో పర్యటించిన ఆమె వేంపల్లిలోని రాజీవ్నగర్ కాలనీలో 15 లక్షల రూపాయలతో మంచినీటి పనులను ప్రారంభించారు.
సుప్రీంకోర్టులో వైయస్ జగన్కు బెయిల్ లభిస్తుందని, జైలు నుంచి బయటకు వస్తారని ఆమె అన్నారు వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత సంక్షేమ పథకాల అమలు కుంటుపడిందని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆమె అన్నారు. 2014లో వైయస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆమె అన్నారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టని సంక్షేమ పథకాలను వైయస్ రాజశేఖర రెడ్డి మన రాష్ట్రంలో చేపట్టారని ఆమె ప్రశంసించారు. వైయస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాలన్నీ తమవేనని కాంగ్రెసు చెప్పుకోవడాన్ని ఆమె తప్పు పట్టారు. వైయస్ చేపట్టిన పథకాలు తమవే అయినప్పుడు ఇతర కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాలు ఎందుకు లేవని ఆమె ప్రశ్నించారు.
కడప జిల్లాలోని పులివెందుల శానససభా నియోజకవర్గానికి వైయస్ విజయమ్మ ప్రాతినిధ్యం వహిస్తుండగా, కడప పార్లమెంటు స్థానానికి వైయస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ప్రజా సమస్యలపై ఆమె కడప జిల్లాలో పర్యటన చేపట్టారు.
No comments:
Post a Comment