Friday, December 30, 2011

2011- రాష్ట్ర వీషెషలు

 రాష్ట్ర రాజకీయల గురించి
రాష్ట్ర చరిత్రలో రెండువేల పదకుండుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఏదో ఒక విశిష్టత ఉండవచ్చు. కాని ఈ 2011 మాత్రం పలు రకాలుగా విశిష్టమైనది చెప్పాలి. రాష్ట్రం అభివృద్ది పధంలో పయనించవలసిన తరుణంలో తిరోగమనంలోకి వెళ్లిపోయింది గత ఏడాది అయితే, అది మరింత తీవ్రం అవడమే కాకుండా, మళ్లీ పట్టాలపైకి వస్తుందన్న ఆశ కలిగించింది ఈ సంవత్సరం అని చెప్పాలి. ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడింది ఈ సంవత్సరమే. అలాగే నెమ్మదిస్తోందన్న భావన కలిగింది ఈ ఏడాది కావడం విశేషం. పదమూడో శాసనసభ ఎన్నికలలో మరోసారి అధికారంలోకి వచ్చిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మూడు నెలలకే ప్రమాదంలో మృత్యువాత పడడంతో ఏర్పడిన అనిశ్చితి ఇప్పటికీ కొనసాగుతున్నప్పట్టికీ, ఇప్పుడు 2011 చివరినాటికి కాస్త గాడిన పడుతోందన్న ఆశ కలిగిస్తూ ఈ ఏడాది వెళ్లి పోతోంది. తెలంగాణ ఉద్యమకారులు సకల జనుల సమ్మె అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడంతో ఏమి జరుగుతుందోనన్న భయం సర్వత్రా వ్యాపించింది. రైతులు పంటలు కోల్పోయి, విద్యార్దులు చదువులు నష్టపోయి, అన్ని వర్గాలు ఏదో విధంగా కష్టాలపాలైనది ఈ సంవత్సరమే. బంద్ లు, ఆందోళనలతో ఈ ఏడాది కూడా తెలంగాణ అట్టుడికింది.ఒకరకంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో 1969,1973,2011లకు కొన్ని పోలికలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తొలుత 1969లో ఉవ్వెత్తున లేచింది. అప్పుడు కూడా కొందరు మంత్రులు రాజీనామాలు చేయడం జరిగింది. ప్రజల మద్య విద్వేషాలు పెరిగే వాతావరణం నెలకొంది. కాని 1969 చివరికి వచ్చేసరికి మెల్లగా రాజకీయ వాతావరణం కుదుటపడింది. 197౦లో అది చల్లబడింది. అప్పట్లో జరిగిన ఉప ఎన్నికలలోకాని, తదుపరి 1971 లోక్ సభ ఎన్నికలలోగాని తెలంగాణ ప్రజాసమితి ఘన విజయం సాధించింది. కాని ఆ తర్వాత అది కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ నుంచి చీలి వచ్చినవారే ప్రధానంగా నాయకత్వం వహించారు. ఇక 1973లో వచ్చిన ప్రత్యేకాంద్ర ఉద్యమం కూడా తీవ్రమైన హింసాత్మకంగా సాగింది. పదిమంది మంత్రుల వరకు తమ పదవులకు రాజీనామా చేశారు. ఉద్యమంలో కొందరు యువకులు మరణించడం చూసిన కురువృద్దుడు , వీర కాకాని, ఉక్కు కాకానిగా ప్రసిద్ది గాంచిన కాకాని వెంకటరత్నం గుండెపోటుతో కన్నుమూశారు. ఆ ఏడాది పరిస్థితి చేయి దాటి పోతుండడంతో రాష్ట్రపతి పాలన విధించారు. తదుపరి రాజకీయ వాతావరణం కుదుటపడి మళ్లీ ప్రశాంతత ఏర్పడింది. అదే రకంగా 2011 లో సకల జనుల సమ్మెతో తారాస్థాయికి చేరిన ఉద్యమం , ఆ తర్వాత చల్లబడింది. అలాగే కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు , ఎమ్.పిలు రాజీనామాలతో హడావుడి చేసినా, ఈ ఏడాది ఆఖరుకు ఆ రగడ కూడా తగ్గుముఖం పట్టింది.అన్నిటిని మించి రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోగలుగుతుందా అన్న సందేహం ఈ ఏడాది ఆరంభంలో ఉండేది. కాని నెలలు గడిచే కొద్దీ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతల వైఖరి మారడంతో ఆ గండం నుంచి అలాగ్గానే బయటపడ్డారని చెప్పాలి. రెండువేల పదిలో జరిగిన ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభంజనం సృష్టించిన టిఆర్ఎస్ ఇప్పుడు మళ్లీ మరో ఆరు ఉప ఎన్నికలకోసం ఎదురు చూస్తోంది. మద్యలో బాన్స్ వాడ ఉప ఎన్నిక జరిగి రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తిరిగి గెలిచినా, కాంగ్రెస్ కు ముప్పైమూడువేల వరకు ఓట్లు రావడం ఒక ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం గురించి వ్యతిరేకంగా మాట్లాడడానికే భయపడే పరిస్థితి నుంచి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నేతలుగా ఉన్న కెసిఆర్, కోదండ రామ్ లను తీవ్ర స్థాయిలో విమర్శించే స్థాయికి ఇతర రాజకీయ పార్టీలు రాగలగడం కూడా ఒక ముఖ్య పరిణామం. అంతేకాదు. తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెబుతున్న వాటిలో కొన్ని హత్యలు ఉన్నాయని తెలుగుదేశం సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు చేసిన సంచలన ప్రకటన కూడా ఈ సంవత్సరమే చోటు చేసుకుంది.అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. ఉద్యమంలో ఎన్ని లోటుపాట్లు ఉన్నా, తెలంగాణ కు చెందిన మెజార్టీ ప్రజలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడాలన్న ఆకాంక్ష మాత్రం బలీయంగా ఏర్పడింది. గతంలో వచ్చిన ఉద్యమాలలో ఇలాంటి భావన స్పష్టంగానే కనిపించినా, ఆ తర్వాత కాలంలో అది క్రమేపి తగ్గిపోయింది. కాని ఈసారి ఇది తగ్గుతుందా?లేదా అన్నది వచ్చే ఏడాది తేలుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కెసిఆర్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు.వచ్చే సంక్రాంతి తర్వాత తిరిగి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ అంశం రాష్ట్రాన్ని ఈ ఏడాది కూడా కుదిపివేస్తే , వచ్చే రెండువేల పన్నెండు అయినా ఒక పరిష్కారం చూపుతుందన్న ఆశతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇక మరో కీలకమైన అంశం జగన్. రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త సంచలనంగా వచ్చిన వై.ఎస్.జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక కోర్టు ద్వారా సిబిఐ విచారణను ఎదుర్కోవలసి రావడం, ఓదార్పు యాత్ర పేరుతో జగన్ జనంలో సంచరించడంలో సరికొత్త రికార్డును నెలకొల్పారు. బహుశా ఇప్పట్లో ఆ రికార్డును ఎవరూ అధిగమించలేకపోవచ్చు. ఎందుకంటే అంత వ్యయ,ప్రయాసలకు ఎవరూ సిద్దం కాలేరు. ప్రత్యర్ధులు అయిన కాంగ్రెస్ , టిడిపి నేతలు జగన్ పై లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు చేసినా ప్రజలు వాటిని పట్టించుకోకుండా ఐదున్నర లక్షల మెజార్టీతో జగన్ ను, ఎనభైవేల మెజార్టీతో ఆయన తల్లి విజయమ్మను గెలిపించడం కూడా రెండువేల పదకుండు విశేషంగా చెప్పుకోవాలి.అంతేకాదు. జగన్ కు మద్దతుగా పదిహేడు మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేయించుకోవడానికి సిద్దపడడం కూడా ఒక రికార్డే. పైగా స్పీకర్ ను కలిసి తమపై అనర్హత వేటు వేయాలని స్వయంగా కోరడం కూడా ఒక చరిత్రే.. ఉప ఎన్నికలకు ఈ పార్టీ సిద్దమవుతుంటే, అధికార కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు ఆలస్యం అయ్యేలా తంటాలు పడుతుండడం కూడా గమనించదగిన అంశమే. ఇక ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి విజయవంతంగా ఏడాది పూర్తి చేశారు. ఒకప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు ఎవరూ ఆయన మాట వింటున్నట్లు కనిపించేదికాదు. అలాంటిది రెండువేల పదకుండు ఆఖరుకు దాదాపు అందరూ ఆయన దారిలోకి వచ్చారన్న అభిప్రాయం కలిగించడంలో కిరణ్ సఫలం అయ్యారని చెప్పాలి. అవిశ్వాస తీర్మానాన్ని ఓడించడం ద్వారా జగన్ కు ఆయన దీటైన జవాబు ఇచ్చారు. తన దయాదాక్షిణ్యాలమీద కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని వ్యాఖ్యానించిన జగన్ కు అదేమీ కాదు అని కిరణ్ రుజువు చేసుకోగలిగారు. అయితే ప్రజారాజ్యం పార్టీకి చెందిన పదిహేడు మంది కాంగ్రెస్ లో విలీనం అవడంతోనే గండం నుంచి బయటపడ్డారన్న భావన ఉన్నప్పట్టికీ, ఇప్పటికీ జగన్ కు అండగా పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడం మింగుడు పడని విషయమే అయినా , కిరణ్ మాత్రం ముఖ్యమైన గండాలను అధిగమించి ఏదైనా అనివార్య పరిణామం సంభవిస్తే తప్ప , వచ్చే రెండు వేల పద్నాలుగు వరకు ఈయనే రాజ్యం చేస్తారన్న విశ్వాసాన్ని కాంగ్రెస్ క్యాడరుకు ఇచ్చారని చెప్పక తప్పదు. అలాగే ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ముద్రను తొలగించి, తన ముద్ర వేసుకోవడానికి ఈ సంవత్సరం కిరణ్ అన్ని వ్యూహాలను అమలు చేశారు. అవి ఎంతవరకు సఫలీకృతం అయ్యాయన్నది అప్పుడే చెప్పజాలం.అయితే తెలంగాణ ఉద్యమాన్నికాని, శాంతి బద్రతల అంశాన్ని కిరణ్ జాగ్రత్తగా డీల్ చేశారని ఈ ఏడాది రుజువైంది.ముఖ్యంగా రోశయ్య ప్రభుత్వం మాదిరి టిఆర్ఎస్ తోనో, కాంగ్రెస్ లోని ప్రత్యేకవాదులతోకాని మాచ్ ఫిక్సింగ్ చేసుకోకుండా నిలబడడం కూడా కిరణ్ సాఫల్యానికి ఒక కారణంగా కనిపిస్తుంది. కాగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో విబేధాలు ఏర్పడడం, అవి వచ్చే సంవత్సరం ఏ రూపు దాల్చుతాయన్నది కొత్త సంవత్సరం కాని తేల్చదు. అయితే కొత్త సంవత్సరంలో వచ్చే ఉప ఎన్నికలు కిరణ్ కు పరీక్ష అవుతాయనే చెప్పాలి. అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినా చివరికి ఈ ఏడాది ఆయన కాంగ్రెస్ లో విలీనం చేయవలసి రావడం కూడా మరో ముఖ్య పరిణామంగానే చెప్పుకోవాలి. వచ్చే ఏడాది ఆయనకు, ఆయనకు చెందిన కొందరికి మంచి పదవులు వస్తాయన్న ఆశతో వారు కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే తొలుత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పర్యటించడమే ఈ ఏడాది ఆరంభంలో కష్టంగా మారితే, ఏడాది ఆఖరుకు పలు తెలంగాణ జిల్లాలలో పర్యటించి రైతుపోరుబాట పేరుతో పాదయాత్రలు కూడా నిర్వహించడం విశేషం. ఒక అరడజను మంది తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయినప్పట్టికీ , మెజార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలను ఆయన నిలబెట్టుకోగలిగారు.అది ఆయన సక్సె స్ కాగా కడప ఉప ఎన్నికలో డిపాజిట్ పోగొట్టుకోవడం ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి. ఇటు తెలంగాణ, అటు జగన్ అంశాలు తెలుగుదేశం పార్టీని ఈ ఏడాదంతా వెన్నాడుతూనే ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఈ సమస్యలను అదిగమిస్తారా? అన్నది ఆసక్తికరమైన అంశం. ఇక టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు 2009 ఎన్నికలలో బాగా దెబ్బతిన పది స్థానాలకే పరిమితం కాగా, ఆ తర్వాత క్రమేపి పెంచుకుని ఇప్పటికి పన్నెండుకు చేరారు. మరికొందరు కూడా పార్టీలో చేరినా పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల ద్వారా వారిని గెలిపించుకోవలసిన బాద్యత కెసిఆర్ పై పడింది. తెలంగాణ కోసం పోరాడే యోదుడుగా పేరొందిన కెసిఆర్ , కాంగ్రెస్ తో రాజీపడ్డారనో, మరో ఆరోపణను ఎదుర్కునే పరిస్థితిని తెచ్చుకున్నారు. అయితే తెలంగాణ అంటే కెసిఆర్, కెసిఆర్ అంటే తెలంగాణ అన్న అబిప్రాయాన్ని వ్యాపించిందన్నది వాస్తవం. దానిని కెసిఆర్ ఎలా నిలబెట్టుకుంటారన్నదే ఆయనకు ఎదురయ్యే ప్రశ్న. వచ్చే సంవత్సరం కెసిఆర్ కు సంబంధించినంతవరకు అత్యంత కీలకమైన సమయం అని చెప్పవచ్చు. మొత్తం మీద రాష్ట్ర స్వరూపం, రాజకీయ పార్టీల భవిష్యత్తును ఈ ఏడాది తేల్చలేదు. కాని వచ్చే సంవత్సరం ఇవన్ని ఒక రూపానికి వచ్చే అవకాశం ఉంది. 

2011 - తెలుగు సినిమలా గురించి



2011 తెలుగు సినిమా విషాదాలు - వివాదాలు





 

    No comments:

    Post a Comment